logo

చెల్లికి పిల్లలు లేరని..

బాలుడి కిడ్నాప్‌ కేసులో నిందితులైన కర్నూలు శరీన్‌నగర్‌కు చెందిన కేదాసు లక్ష్మీనారాయణమ్మ, ఆమె చెల్లెలు.. ఎమ్మిగనూరుకు చెందిన మునీశ్వరి, ఆమె మరిది నాగార్జునను కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు.

Published : 31 Mar 2023 02:12 IST

బాలుడిని కిడ్నాప్‌ చేయించిన అక్క
కేసు ఛేదించిన పోలీసులు
నిందితుల అరెస్టు

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ కె.వి.మహేష్‌,   సీఐ శంకరయ్య, ఎస్సై రామయ్య

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : బాలుడి కిడ్నాప్‌ కేసులో నిందితులైన కర్నూలు శరీన్‌నగర్‌కు చెందిన కేదాసు లక్ష్మీనారాయణమ్మ, ఆమె చెల్లెలు.. ఎమ్మిగనూరుకు చెందిన మునీశ్వరి, ఆమె మరిది నాగార్జునను కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా కర్నూలు నాలుగో పట్టణ పోలీసుస్టేషన్‌లో సీఐ శంకరయ్య, ఎస్సై రామయ్యతో కలిసి డీఎస్పీ కె.వి.మహేష్‌ గురువారం వివరాలు వెల్లడించారు.

నగరంలోని శరీన్‌నగర్‌లో లలిత నివసిస్తున్నారు. ఆమె భర్త శివకుమార్‌ అనారోగ్యంతో గతంలో చనిపోయారు. ఆమెకు ప్రశాంతకుమార్‌ (9), ప్రవీణ్‌కుమార్‌ (7) కుమారులు ఉన్నారు. ఆమె ఇంటి సమీపంలో నివాసం ఉండే కేదాసు లక్ష్మీనారాయణమ్మకు సంతానం లేకపోవటంతో భర్త తిరుపాలు వదిలేశాడు. ఆమె ఇళ్లలో పాచి పని చేసుకుంటూ ఒంటరిగా జీవిస్తోంది. ఎమ్మిగనూరులో నివాసం ఉండే ఈమె చెల్లి మునీశ్వరికి పిల్లలు కలగకపోవటంతో దిగులు చెందేవారు. ఈ క్రమంలో లక్ష్మీనారాయణమ్మకు లలిత పరిచయమైంది. తన చెల్లెలికి ప్రశాంత్‌నుగానీ, ప్రవీణ్‌ను దత్తత ఇవ్వాలని లక్ష్మీనారాయణమ్మ పలుమార్లు కోరినా లలిత నిరాకరించింది. దీంతో ఆమె తన చెల్లితో కలిసి కిడ్నాప్‌ పథకం రచించింది. అందులో భాగంగా ఉగాది రోజున కల్లూరులోని చౌడేశ్వరిదేవి ఆలయం వద్ద జరిగే జాతరకు వెళ్దామని లలితమ్మ, ఆమె పిల్లలను లక్ష్మీనారాయణమ్మ నమ్మించి తీసుకెళ్లింది. తనకు దాహం వేస్తోందని, నీళ్లు తీసుకురమ్మని లక్ష్మీనారాయణమ్మ చెప్పటంతో లలిత తన చిన్న కుమారుడిని ఆమె వద్ద వదిలి పెద్ద కుమారుడిని వెంట బెట్టుకుని వెళ్లింది. అప్పటికే అక్కడే సిద్ధంగా ఉన్న మునీశ్వరి, నాగార్జునకు ప్రవీణ్‌ను అప్పగించటంతో వారు పిల్లాడిని తీసుకుని ఎమ్మిగనూరు వెళ్లిపోయారు. నీళ్లతో వచ్చిన లలిత తన చిన్న కుమారుడు ఎక్కడా అని ప్రశ్నించగా నీ వెనుకే వచ్చినట్లు లక్ష్మీనారాయణమ్మ కట్టుకథ అల్లింది. అంతా వెతికినా ప్రవీణ్‌ జాడ తెలియకపోవటంతో లలిత కర్నూలు నాలుగో పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లక్ష్మీనారాయణమ్మ ప్రవర్తన పట్ల అనుమానం కలగటంతో పోలీసులు విచారించగా అసలు విషయం చెప్పింది. ఎమ్మిగనూరు వెళ్లి నాగార్జున, మునీశ్వరి దంపతుల వద్ద ఉన్న ప్రవీణ్‌ను స్వాధీనం చేసుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు పంపుతున్నట్లు డీఎస్పీ తెలిపారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని