logo

ఎండుతున్న భావితరం గొంతులు

ప్రభుత్వ పాఠశాలలో మంచినీరు దొరక్క విద్యార్థులు అల్లాడిపోతున్నారు. చేతిపంపులు, ట్యాంకుల వద్దకు పరుగులు పెడుతున్నారు.

Published : 02 Apr 2023 02:49 IST

నిరుపయోగంగా నీటి శుద్ధి యంత్రాలు
 నాడు..నేడు పనుల్లో రూ.లక్షలు ఖర్చు

ప్రభుత్వ పాఠశాలలో మంచినీరు దొరక్క విద్యార్థులు అల్లాడిపోతున్నారు. చేతిపంపులు, ట్యాంకుల వద్దకు పరుగులు పెడుతున్నారు. మనబడి నాడు-నేడు పథకం కింద ప్రతి పాఠశాలలో నీటి శుద్ధి యంత్రాలు ఏర్పాటుచేసింది. అమర్చిన కొన్ని నెలలకే చాలా ప్రాంతాల్లో మరమ్మతులకు గురయ్యాయి.  ప్రధానోపాధ్యాయులు విద్యాశాఖలో ఉన్న ఇంజినీరింగ్‌ విభాగం అధికారుల దృష్టికి సమస్య తీసుకెళ్లినా పరిష్కారానికి నోచుకోలేదు.

న్యూస్‌టుడే, కర్నూలు విద్య


భారీగా ఫిర్యాదులు అందినా..

* కర్నూలు జిల్లాలో 567 బడుల్లో నీటి వసతి కల్పించేందుకు నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేశారు. విద్యార్థుల సంఖ్యను బట్టి రూ.75 వేల నుంచి రూ.5 లక్షల వరకు నిధులు వెచ్చించారు. వాటిని ఏర్పాటుచేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 353 యంత్రాలు పనిచేయడం లేదని ఆయా పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులు ఫిర్యాదు చేశారు. వీటిల్లో 213 ఫిర్యాదులను పరిష్కరించినట్లు అధికారులు లెక్కల్లో చూపించారు. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కానరావడం లేదు.

నంద్యాల జిల్లాలో 443 విద్యాలయాల్లో నీటి శుద్ధి యంత్రాలు అమర్చారు. పనిచేయడం లేదంటూ 220 ఫిర్యాదులు రాగా ఏకంగా 223 వరకు పరిష్కరించినట్లు అధికారులు లెక్కల్లో చూపడం గమనార్హం.


కానరాని ప్రత్యేక నిధి

విద్యార్థుల దాహం తీర్చేందుకు రూ.లక్షలు వెచ్చించి పాఠశాలల్లో నీటి శుద్ధి యంత్రాలు అమర్చారు. వీటి కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామని చెప్పిన మాటలు కాగితాలకే పరిమితమయ్యాయి. పాఠశాల గ్రాంట్స్‌ నుంచైనా ఖర్చు చేసి బాగు చేసుకుందామనుకుంటే ఆ నిధుల్లో ఇప్పటివరకు కేవలం 20 శాతం మాత్రమే విడుదల చేయడం గమనార్హం.


పైపులు లీకేజీ.. పరికరం పక్కకు

⇒ ప్రధాన ప్రాథమిక పాఠశాల, ఆలూరు
293 (1-5వ తరగతి)
రూ.2 లక్షలు వెచ్చించి వెయ్యి లీటర్ల సామర్థ్యమున్న నీటి శుద్ధి యంత్రాన్ని ఏడాదిన్నర కిందట ఏర్పాటు చేశారు.
యంత్రం బిగించి ఆరు నెలలకే పైపుల లీకేజీ అయ్యాయి. ఏడాది నుంచి వినియోగించడం లేదు. విషయాన్ని సంబంధిత అధికారులు, మెకానిక్‌ దృష్టికి తీసుకెళ్లినా నేటికీ మరమ్మతులు జరగలేదు.
పాఠశాలలోని కుళాయి నీటిని తాగుతున్నారు. ప్రత్యేకంగా సంపు, సింటెక్స్‌లు ఉండటంతో నీటికి ఇబ్బందులు లేదని పాఠశాల ప్రధానోపాధ్యాయిని మంజులమ్మ తెలిపారు.

న్యూస్‌టుడే, ఆలూరు


మరమ్మతులు మమ

ఉన్నత పాఠశాల, నిడ్జూరు
103        రూ.5 లక్షలు
ప్రారంభంలో పని చేసిన పరికరం మోటార్లు పనిచేయకపోవడంతో పడకేసింది. సమస్యను గ్రామస్థులు ఎమ్మెల్యే సుధాకర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.మెకానిక్‌లు వచ్చి మొక్కుబడిగా మరమ్మతులు చేయడంతో మళ్లీ సమస్య ఉత్పన్నమైంది.
పాఠశాల ఆవరణలో చేతి పంపును వినియోగించుకుంటున్నారు.

న్యూస్‌టుడే, కర్నూలు విద్య


ప్రారంభం నుంచే పడకేసింది

బాలికల ఉన్నత పాఠశాల, డోన్‌ పట్టణం
1,750
2021లో రూ.5 లక్షలు వెచ్చించి వెయ్యి లీటర్ల సామర్థ్యమున్న నీటి శుద్ధి యంత్రాన్ని బిగించారు.
సాంకేతిక లోపాలు తలెత్తడంతో రెండేళ్ల నుంచి నిరుపయోగంగా ఉంది.
పాఠశాల ప్రాంగణంలో ఉన్న బోరు నీటిని కొందరు తాగుతున్నారు. చాలా మంది ఇంటి నుంచే తెచ్చుకుంటున్నారు.

న్యూస్‌టుడే, డోన్‌ పట్టణం


విద్యుత్తు   సరఫరా లేక...

బనగానపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 789 మంది విద్యార్థులు ఉన్నారు. శుద్ధజల కేంద్రానికి విద్యుత్తు సరఫరా లేకపోవడంతో నెలల తరబడిగా నిరుపయోగంగా మారింది. ఇక్కడ విద్యార్థులు నీటి తొట్టిలో నిల్వ ఉంచిన నీరే తాగుతున్నారు. త్వరలోనే విద్యుత్తు సౌకర్యం కల్పించి వినియోగంలోకి తెస్తామని ప్రధానోపాధ్యాయుడు నాగభూషణం పేర్కొన్నారు.

 న్యూస్‌టుడే, బనగానపల్లి


ట్యాంకులో కనిపించని శుభ్రత

తుగ్గలి జడ్పీ ఉన్నత పాఠశాలలో రూ.5 లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన నీటి శుద్ధి యంత్రం నిరుపయోగంగా మారింది. ఇక్కడ 502 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రస్తుతం విద్యార్థులు పాఠశాల ఆవరణలోని ట్యాంకు నుంచి వచ్చే కుళాయిల ద్వారా నీటిని పట్టుకుంటున్నారు. ట్యాంకు లోపల మొత్తం నాచు పేరుకుపోయింది. అపరిశుభ్రంగా మారింది. నీటి శుద్ధి యంత్రం ప్లాంట్‌ నుంచి వ్యర్థ జలం బయటకు వెళ్లేందుకు బిగించిన పైపులైన్‌ పని చేయడం లేదు. పాత ట్యాంకులో అపరిశుభ్రత నెలకొన్న విషయం మా దృష్టికి రాలేదు.. వెంటనే సరిచేయిస్తామని ప్రధానోపాధ్యాయురాలు ఉమ పేర్కొన్నారు.

న్యూస్‌టుడే, తుగ్గలి


పానీ సరిపోదని పక్కన పెట్టారు

పురపాలక ఉన్నత పాఠశాల, ఆర్‌ఆర్‌ లేబర్‌ కాలనీ, ఆదోని పట్టణం
827
రూ.5 లక్షలు
పాఠశాలలో నిర్మించిన ట్యాంకులో నీటిని నింపితే నాలుగు రోజులకే సరిపోతున్నాయి. ఈ ట్యాంకుకు నీటి శుద్ధి యంత్రాన్ని అనుసంధానం చేస్తే ఒక్కరోజులోనే ఖాళీ అవుతున్నాయి. దీంతో పక్కన పడేశారు.
ప్రస్తుతం విద్యార్థులు ఇంటి నుంచే సీసాల్లో నీటిని తెచ్చుకుంటున్నారు. నాడు-నేడు రెండో విడత మరో ట్యాంకు నిర్మిస్తున్నాం.. పాఠశాలకు నిత్యం మంచినీరు సరఫరా చేయాలని పుర అధికారులకు విన్నవించినట్లు ప్రధానోపాధ్యాయుడు రమేశ్‌నాయుడు తెలిపారు.

న్యూస్‌టుడే, ఆదోని విద్య


ఆరుసార్లు పగిలిన ఫిల్టర్‌

జడ్పీ ఉన్నత పాఠశాల, బేతంచెర్ల
389
2021 జూన్‌లో రూ.1,84,408 వెచ్చించి 300 లీటర్ల సామర్థ్యం ఉన్నది ఏర్పాటు చేశారు.
ప్రారంభించిన మూడు నెలలకే జంబో ఫిల్టర్‌ పగిలిపోయింది. కంపెనీ వారికి ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయగా వారు వచ్చి మరమ్మతులు చేపట్టారు. ఇప్పటి వరకు ఆరుసార్లు మరమ్మతులకు గురైంది.
పాఠశాలకు పురపాలక నీరే విద్యార్థులకు దిక్కైంది. ‘‘ నాలుగు రోజుల క్రితం ఫిల్టర్‌ పగిలిపోయింది.. కంపెనీవారికి ఫిర్యాదు చేశాం.. వీలైనంత త్వరగా బాగు చేయిస్తామని’’ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.  

న్యూస్‌టుడే, బేతంచెర్ల

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని