Kurnool: భర్తకు ఇంట్లోనే దహన సంస్కారాలు చేసిన భార్య

మృతి చెందిన భర్తకు ఇంట్లోనే భార్య దహన సంస్కారాలు నిర్వహించింది. ఈ సంఘటన కర్నూలు జిల్లాలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది.

Updated : 29 May 2023 14:53 IST

పత్తికొండ పట్టణం: మృతి చెందిన భర్తకు ఇంట్లోనే భార్య దహన సంస్కారాలు నిర్వహించింది. ఈ సంఘటన కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. పత్తికొండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన పోతుగంటి హరికృష్ణ ప్రసాద్‌ (60), లలిత భార్యాభర్తలు. వీరిద్దరూ మెడికల్‌ షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడు దినేశ్‌ కర్నూలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తుండగా.. చిన్న కుమారుడు  కెనడాలో స్థిరపడ్డారు.

సోమవారం ఉదయం హరికృష్ణప్రసాద్‌ ఇంటి నుంచి పొగలు రావడాన్ని గమనించిన కాలనీ వాసులు.. స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతుడి భార్య లలితతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించారు. తన భర్త అనారోగ్యంతో సోమవారం ఉదయం మృతి చెందినట్లు పోలీసులకు లలిత తెలిపింది. కుమారులిద్దరూ తమను సరిగా చూసుకోవడం లేదని.. ఆస్తి కోసమే తమ వద్దకు వస్తున్నారని ఆమె తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. తండ్రి చనిపోయిన విషయం తెలిస్తే కుమారులిద్దరూ వచ్చి ఆస్తి కోసం గొడవ చేస్తారని.. ఆ భయంతో తానే భర్తకు అట్టపెట్టెలతో దహన సంస్కారాలు పూర్తిచేసినట్లు తెలిపారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని