logo

ఆ రైలులో ప్రయాణం నరకమే!

కర్నూలు నుంచి మచిలీపట్నం వరకు ప్రత్యేక సర్వీసు కేటగిరీలో నడుపుతున్న ‘మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌’ ప్రయాణికులకు నరకం చూపిస్తోంది. విజయవాడ వైపు ప్రయాణించే వేలాది మంది కర్నూలు వాసులకు నేరుగా అందుబాటులో ఉన్నది ఆ ఒక్క రైలు మాత్రమే.

Published : 31 May 2023 03:39 IST

ప్రతిసారీ కనీసం గంటన్నరకుపైగా ఆలస్యం

ఈనాడు, కర్నూలు : కర్నూలు నుంచి మచిలీపట్నం వరకు ప్రత్యేక సర్వీసు కేటగిరీలో నడుపుతున్న ‘మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌’ ప్రయాణికులకు నరకం చూపిస్తోంది. విజయవాడ వైపు ప్రయాణించే వేలాది మంది కర్నూలు వాసులకు నేరుగా అందుబాటులో ఉన్నది ఆ ఒక్క రైలు మాత్రమే. వారానికి మూడు రోజులు (బుధ, శుక్ర, ఆది) నడుపుతున్నా ఏనాడూ అది సరైన సమయానికి గమ్యస్థానం చేరుకున్న దాఖలాలు లేవు. విజయవాడ వెళ్లేసరికి కనీసం గంటన్నర నుంచి రెండు గంటల వరకు ఆలస్యమవడం పరిపాటిగా మారింది. ఈ రైలు తెల్లవారుజామున 4.40 గంటలకు విజయవాడ వెళ్లాల్సి ఉంది. దీనిని నమ్ముకుని ఉత్తరాంధ్ర వైపు, ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు విజయవాడ రైల్వేస్టేషన్‌ నుంచి ఉదయం 6.30 గంటలలోపు అందుబాటులో ఉన్న పలు రైళ్లకు రిజర్వేషన్లు చేయించుకుంటున్నారు. విజయవాడకు వెళ్లే సరికే పలు సందర్భాల్లో ఉదయం 6.30 దాటుతుండడంతో ఆయా లింకు రైళ్లన్నీ వెళ్లిపోతున్నాయి. ఫలితంగా ప్రయాణికులు రెండు రకాలుగా నష్టపోవాల్సిన దుస్థితి తలెత్తుతోంది.

సమస్య పరిష్కరించరు..

రైళ్ల రాకపోకలకు సంబంధించి అధికారులు ప్రతి వారం, ప్రతి నెలా సమీక్షలు నిర్వహిస్తారు. ఆలస్యానికి కారణాలు గుర్తించి సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారు. మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌ విషయంలో తగిన నిర్ణయాలు తీసుకోవడం లేదు. హైదరాబాద్‌, గుంతకల్‌, గుంటూరు, విజయవాడ డివిజన్ల పరిధిలోని మార్గంలో మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌ ఆలస్యంగా నడుస్తోంది. ఆ నాలుగు డివిజన్లు దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలోనే ఉన్నాయి. సమస్యను రైల్వే జోనల్‌ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం లేదన్న విమర్శలున్నాయి.

ఛార్జీలు భారీగా..

మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌ను నేటికీ ప్రత్యేక రైలుగానే నడుపుతున్నారు. ఫలితంగా సాధారణ రైళ్ల కంటే అదనంగా రుసుములు ఉండడంతో ప్రయాణికులు చేతి చమురు భారీగా  వదిలించుకోవాల్సి వస్తోంది.


కారణాలెన్నో....

రైళ్ల రాక ఆలస్యమైతే విషయాన్ని నమోదు చేసి కారణాలు రాయాల్సి ఉండగా.. ఆ ప్రక్రియ మొక్కుబడిగా సాగుతోంది. ఫలితంగా తప్పు సరిదిద్దే ప్రయత్నాలు జరగని దుస్థితి తలెత్తుతోంది. మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌ ఇంజిన్‌ను డోన్‌ స్టేషన్‌ వద్ద ‘రివర్స్‌’ చేయాలి. ఆ ప్రక్రియ పూర్తయ్యేందుకు 20 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. పలు సందర్భాల్లో 45 నుంచి 60 నిమిషాల వరకు సమయం తీసుకుంటుండటం గమనార్హం.

* డోన్‌-నంద్యాల మధ్య డబ్లింగ్‌ పనులు జరుగుతున్నాయి. ఆయా పనుల కారణంగానూ మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌ కొంత ఆలస్యంగా నడుస్తోంది. దీనిని ఓ కారణంగా చూపుతున్నారు.

* రైలు నంద్యాల స్టేషన్‌కు చేరుకునే సరికే సగటున 1.05 గంటలు ఆలస్యంగా నడుస్తోంది. విజయవాడ వెళ్లేసరికి దాదాపు 2 గంటల సమయం వరకు ఆలస్యమవుతోంది.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని