logo

సర్ది చెప్పేందుకు వెళ్లి.. హత్యకు గురయ్యాడు

రస్తా విషయంలో రెండు కుటుంబాల మధ్య వివాదం తలెత్తింది. ఈ విషయంలో సర్దిచెప్పేందుకు వెళ్లిన రాముడు(54) అనే వ్యక్తి హత్యకు గురైన సంఘటన వెల్దుర్తి మండలం సిద్దనగట్టు గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది.

Updated : 31 May 2023 05:32 IST

రాముడు  (పాత చిత్రం)

వెల్దుర్తి, న్యూస్‌టుడే: రస్తా విషయంలో రెండు కుటుంబాల మధ్య వివాదం తలెత్తింది. ఈ విషయంలో సర్దిచెప్పేందుకు వెళ్లిన రాముడు(54) అనే వ్యక్తి హత్యకు గురైన సంఘటన వెల్దుర్తి మండలం సిద్దనగట్టు గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రస్తా విషయంలో దాయాదులైన లక్ష్మన్న, బాలకృష్ణ కుటుంబాల మధ్య కొంతకాలంగా వివాదం జరుగుతోంది. ఈ విషయంపై రాముడుతో పాటు, గ్రామస్థులు పెద్దమనుషులుగా ఉండి సర్దుబాటు చేశారు. మంగళవారం ఉదయం లక్ష్మన్న భార్య లక్ష్మీదేవి ఇదే రస్తాలో బహిర్భూమికి వెళ్తుండగా.. ఇటు దారిలేదని బాలకృష్ణ, అతని సోదరుడు మహేష్‌ అడ్డుకున్నారు. గతంలో రస్తా పంచాయితీ చేసిన రాముడు ఇంటికి వెళ్లి ఈ విషయాన్ని చెప్పింది. దీంతో ఆయన మహేష్‌, బాలకృష్ణకు సర్దిచెప్పేందుకు వెళ్లారు. ఆగ్రహానికి గురైన మహేష్‌, బాలకృష్ణ రాముడిపై రాళ్లతో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయన ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలిసిన వెంటనే ఎస్సై చంద్రశేఖర్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడి భార్య మంజుల ఫిర్యాదు మేరకు బాలకృష్ణ, మహేష్‌పై కేసు నమోదు చేశామన్నారు.


ద్విచక్ర వాహనాల ఢీ.. ఒకరి దుర్మరణం

దేవనకొండ, న్యూస్‌టుడే: ద్విచక్రవాహనాలు ఎదురెదుగా ఢీకొన్న ఘటనలో రాజశేఖర్‌(29) అనే వ్యక్తి చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. వివరాల మేరకు గోనెగొండ్ల మండలం హెచ్‌ కైరవాడి గ్రామానికి చెందిన వడ్డె రాజశేఖర్‌ సోమవారం కోడుమూరు నుంచి స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా కర్నూలు-బళ్లారి రహదారిలోని వీరంపల్లి సమీపంలో ఎదురుగా రాంబాబు అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై వస్తుండగా ఎదురెదురుగా ఢీ కొనడంతో వడ్డే రాజశేఖర్‌ తీవ్ర గాయాలు కాగా కర్నూలు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక మంగళవారం  వేకువజామున మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


రైలు నుంచి జారి పడి..

కొండాపురం, న్యూస్‌టుడే : రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి ఓ వ్యక్తి చెందిన ఘటన కొండాపురం శివారులో మంగళవారం వేకువన చోటు చేసుకుంది. ఎర్రగుంట్ల రైల్వే ఎస్సై వర్మ వివరాల మేరకు.. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన సందీప్‌ (27) తిరుపతి వెళ్లేందుకు రైలు ఎక్కారు. వాకిలి వద్ద కూర్చొని ఉండగా ప్రమాదవశాత్తు జారిపడి ఉండొచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.


అక్కను కాపాడబోయి.. చెల్లెలి మృతి

షబానా మృతదేహం

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: అక్కాబావల మధ్య జరిగిన ఘర్షణ ఆమె ప్రాణాలను హరించింది. భార్యాభర్తల గొడవలో అమాయకురాలు బలైంది. ఈ ఘటన కర్నూలు నగరంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పాతబస్తీ గడ్డావీధికి చెందిన బ్రెడ్‌ వ్యాపారి షేక్‌మహబూబ్‌బాషాకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. మూడో సంతానమైన ఫర్జానాను అదే కాలనీకి చెందిన బేల్దారు పనిచేసే షేక్‌ సలీంబాషాతో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఒక కుమార్తె సంతానం. భార్యాభర్తల మధ్య మనస్పర్థల కారణంగా ఫర్జానా పుట్టింటికి చేరుకుంది. దీంతో ఇరువురి మధ్య గొడవ మరింత పెరిగింది. పదిహేను రోజుల క్రితం సలీం బాషా తన కుటుంబసభ్యులతో కలిసి భార్య ఇంటికి వెళ్లి ఘర్షణ పడ్డారు. అతను ఫర్జానాను కొడుతుండగా ఆమె చెల్లెలు షబానా(25) అడ్డుకుంది. కోపోద్రేకంతో సలీం బాషా క్రికెట్‌బ్యాట్‌తో షబానా తలపై బలంగా కొట్టాడు. ఆమెకు తీవ్రగాయం కాగా కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఆమె మృతి చెందింది. షబానా తండ్రి ఫిర్యాదు మేరకు షేక్‌ సలీంబాషాపై కర్నూలు ఒకటో పట్టణ పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


పెళ్లి ఇష్టం లేక యువకుడి ఆత్మహత్య

కోయిలకొండ (కృష్ణగిరి), న్యూస్‌టుడే: కృష్ణగిరి మండలంలోని కోయిలకొండ గ్రామానికి చెందిన  ఆకుల సూర్యగంగాధర్‌(23) అనే యువకుడు పెళ్లి ఇష్టం లేక చెట్టుకు ఉరేసుకొని ఆత్యహత్య చేసుకున్నట్లు ఎస్సై చంద్రశేఖరరెడ్డి తెలిపారు. గ్రామానికి చెందిన ఆకుల నాగరాజుకు ఇద్దరు కుమారులు. వీరిలో పెద్దవాడు సూర్య గంగాధర్‌కు ఇటీవల కుటుంబ సభ్యులు పెళ్లి నిశ్చయించారు. ఇది ఇష్టం లేని యువకుడు తన పొలానికి కొద్ది దూరంలో ఉన్న వేప చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. తండ్రి ఆకుల నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


పోక్సో కేసులో నిందితుడి అరెస్టు

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: నందికొట్కూరు నియోజకవర్గం నాగటూరుకు చెందిన నవీన్‌ను కర్నూలు మూడో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ఓ మైనర్‌ బాలికకు మాయమాటలు చెప్పి ప్రేమిస్తున్నట్లు నమ్మించి హైదరాబాద్‌, తిరుపతికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక ఫిర్యాదు మేరకు నిందితుడిపైన కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్‌కు పంపారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని