logo

జనంపై పిడుగు

ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో గురువారం పిడుగుపాటుకు  గురై నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

Published : 02 Jun 2023 02:00 IST

నలుగురి మృత్యువాత
పలువురికి అస్వస్థత

ఆలూరు, హాలహర్వి, న్యూస్‌టుడే : ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో గురువారం పిడుగుపాటుకు  గురై నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు అస్వస్థతకు గురయ్యారు. హాలహర్వి మండలం బలగోటలోని బసవేశ్వరస్వామి ఆలయంలో జరిగిన ఓ వివాహ వేడుకకు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తులు వచ్చారు. మధ్యాహ్నం కొందరు ఆలయం సమీపంలోని చెట్టు వద్ద ఉండగా ఒక్కసారిగా పిడుగులు పడ్డాయి. శిరుగుప్ప తాలుకా బొమ్మలాపురానికి చెందిన బసవరాజ్‌గౌడ్‌, ఉత్నూరుకు చెందిన శేఖర్‌ గౌడ్‌ మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడగా ఆలూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉరుములు, గాలుల కారణంగా విద్యుత్తు సరఫరా ఆగిపోయింది. ఆసుపత్రిలోనూ విద్యుత్తు లేకపోవడంతో బాధితులకు టార్చిలైట్‌, సెల్‌ఫోన్‌ వెలుతురులో చికిత్స అందించాల్సి వచ్చింది.

కోసిగి మండలం వందగల్లు గ్రామానికి చెందిన యువ రైతు ఈరేష్‌ పొలం పనులకు వెళ్లి పిడుగు పడటంతో ప్రాణాలు వదిలారు. ఉయ్యాలవాడ మండలం తుడుమలదిన్నెలో చక్రవర్తి (20) పిడుగు పాటుకు గురై మృతి చెందారు.

గడివేముల : గడివేములకు చెందిన దూదేకుల మాబాషా, దూదేకుల మాసుంవలి పొలానికి వెళ్లగా పిడుగు పడటంతో అస్వస్థతకు గురయ్యారు. 108లో ఆస్పత్రికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని