logo

మారనున్న రూపురేఖలు

అమృత్‌ భారత్‌ యోజనలో భాగంగా ఉమ్మడి జిల్లాలో అయిదురైల్వేస్టేషన్ల అభివృద్ధికి రైల్వేశాఖ నడుంబిగించింది.

Published : 02 Jun 2023 02:00 IST

ఉమ్మడి జిల్లాలో అయిదు రైల్వేస్టేషన్ల అభివృద్ధి
న్యూస్‌టుడే, డోన్‌ పట్టణం

అమృత్‌ భారత్‌ యోజనలో భాగంగా ఉమ్మడి జిల్లాలో అయిదురైల్వేస్టేషన్ల అభివృద్ధికి రైల్వేశాఖ నడుంబిగించింది. కర్నూలు సిటీ, డోన్‌ జంక్షన్‌, ఆదోని, నంద్యాల, మంత్రాలయం రోడ్‌ స్టేషన్లలో మౌలిక సదుపాయాలు కల్పించి ప్రయాణికులకు అత్యున్నత, నాణ్యమైన సేవల్ని అందించనున్నారు. రాష్ట్రంలో 72 రైల్వేస్టేషన్లను ఈ పథకం కింద ఎంపిక చేయగా..ఉమ్మడి కర్నూలు జిల్లాలో అయిదింట్లో వెలుగురేఖలు కాంతులీననున్నాయి. మౌలిక సదుపాయాలకల్పనే లక్ష్యంగా అధికారులు మాస్లర్‌ప్లాన్లను రూపొందించనున్నారు. బడ్జెట్‌ రూపొందించాక ప్రక్రియ పట్టాలెక్కనుంది.
 

రూ.కోట్లు మంజూరు

ఒక్కో స్టేషన్‌ను రూ.5 కోట్ల నుంచి రూ.20 కోట్లతో అక్కడ అవసరాలను బట్టి మంజూరు చేయనున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ జరిగిందంటున్నారు. స్టేషన్లలో భవనాలు, ఫ్లోరింగ్‌కు సంబంధించి అత్యాధునిక నిర్మాణాలు చేపట్టనున్నారు. ఫ్లాట్‌ఫారాల పొడవునూ పెంచనున్నారు. 600 మీటర్లను 700 నుంచి 840 మీటర్ల వరకూ పెంచనున్నట్లు తెలుస్తోంది.

ఇరువైపులా అప్రోచ్‌ రోడ్లు  

ఎంపికైన రైల్వేస్టేషన్లకు ఇరువైపులా అప్రోచ్‌రోడ్లను నిర్మించనున్నారు. ప్రయాణికులు రైల్వేస్టేషన్లకు వచ్చేందుకు, స్టేషన్లలో రైళ్లను దిగిన తర్వాత వెళ్లేందుకు వీలుగా వీటిని నిర్మించనున్నారు. స్టేషన్ల పరిధిలో పార్కింగ్‌ ఏరియా, పాదచారులకు ప్రత్యేకంగా దారి ఏర్పాటు వంటి వాటికి రైల్వేశాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించనున్నారు.

లిఫ్టు, ఎస్కలేటర్ల ఏర్పాటు

ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉండే కర్నూలు సిటీ, నంద్యాల, ఆదోని, డోన్‌, మంత్రాలయం రోడ్‌ వంటి చోట ఎన్‌ఎస్‌జీ 1-4, ఎన్‌ఎస్‌జీ 1-2 కేటగిరీ స్టేషన్లలో వృద్ధులు, పిల్లల తల్లులు, గర్భిణులు వంటి వారు స్టేషన్లలో ఒక ప్లాట్‌ఫారం నుంచి మరోదానికి వెళ్లేందుకు వీలుగా లిఫ్టు, ఎస్కలేటర్లను ఏర్పాటు చేస్తారు. వేచి ఉండే గదుల వద్ద వాటికి అనుబంధంగా కెఫ్ట్‌ ఏరియాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించనున్నారు. ఆయా రైల్వేస్టేషన్ల పరిధిలో స్థానిక ఉత్పత్తుల విక్రయానికి కనీసం రెండు స్టాళ్లు, సమావేశ మందిరాలు, ల్యాండ్‌ స్కేపింగ్‌, దీపాల ఏర్పాటు, వేగవంతమైన వైఫై సేవలకు 5జీ టవర్లు, ప్రతిస్టేషన్‌ మొదటి అంతస్తులో ప్రత్యేకంగా రూఫ్‌ ప్లాజా, దివ్యాంగుల కోసం వీల్‌ఛైర్లు, ప్రవేశమార్గాల వంటి వాటిని ఏర్పాటు చేయనున్నారు.


అత్యున్నత సౌకర్యాలు

-జి.వెంకటేశ్వర్లు, రైల్వేస్టేషన్‌ మేనేజర్‌, డోన్‌

అమృత్‌భారత్‌ యోజన పథకం కింద డోన్‌ రైల్వే స్టేషన్‌ ఎంపికైంది. రూ.5 కోట్లు మంజూరయ్యాయి. స్టేషన్‌లో పలు రకాల సదుపాయాలను కల్పిస్తుండటంతో స్టేషన్‌ రూపురేఖలు మారనున్నాయి. రాబోయే రోజుల్లో ప్రయాణికులకు అత్యున్నత సౌకర్యాలు అందనున్నాయి. లైటింగ్‌, అప్రోచ్‌రోడ్లు, లిప్టు, ఎస్కలేటర్లు వంటి వాటితో కొత్త వెలుగులు సంతరించుకోనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని