తైక్వాండోలో బాద్షా నవాజ్
ఆత్మరక్షణ క్రీడ అయిన తైక్వాండోకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. గతంలో క్రికెట్, టెన్నిస్, ఫుట్బాల్ వంటి క్రీడల పట్ల మొగ్గుచూపుతున్న యువత ప్రస్తుతం తైక్వాండోపై దృష్టి సారిస్తున్నారు.
అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న యువకుడు
న్యూస్టుడే, నంద్యాల గాంధీచౌక్: ఆత్మరక్షణ క్రీడ అయిన తైక్వాండోకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. గతంలో క్రికెట్, టెన్నిస్, ఫుట్బాల్ వంటి క్రీడల పట్ల మొగ్గుచూపుతున్న యువత ప్రస్తుతం తైక్వాండోపై దృష్టి సారిస్తున్నారు. క్రీడా సంఘాల వారు శిక్షణ ఇస్తూ.. టోర్నమెంట్లు నిర్వహిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారు. దీంతో చాలామంది ఈ ఆట నేర్చుకుని పోటీల్లో సత్తా చాటుతూ విజయ పథంలో సాగిపోతున్నారు. ఇదే కోవలో నంద్యాలకు చెందిన షానవాజ్ఖాన్ తైక్వాండో నేర్చుకుని జాతీయస్థాయిలో రాణిస్తూ ప్రశంసలు అందుకుంటున్నాడు.
* నంద్యాల పట్టణం సంజీవనగర్కు చెందిన సర్ధార్ఖాన్, రుక్సానా ఖాతూన్ దంపతుల కుమారుడు షానవాజ్ఖాన్. ఇంటర్ పూర్తిచేశాడు. తండ్రి తైక్వాండో కోచ్గా పనిచేస్తున్నారు. చిన్నతనం నుంచి క్రీడలపై ఆసక్తి పెంచుకున్న షానవాజ్ తైక్వాండోలో రాణించాలని నిర్ణయించుకున్నాడు. 2015 నుంచి తండ్రి వద్దే శిక్షణ తీసుకుంటూ ఆటపై పట్టు సాధించాడు. పోటీల్లో ప్రతిభ చూపుతూ విజేతగా నిలుస్తున్నాడు.
సివిల్స్ సాధించడమే లక్ష్యం
- షానవాజ్ఖాన్
నాకు చదువుతో పాటు ఆటలంటే మక్కువ. రెండింట్లో రాణిస్తున్నా. ప్రస్తుతం తైక్వాండోలో అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తున్నా. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సాధన చేస్తున్నా. డిగ్రీ పూర్తిచేసిన తర్వాత సివిల్స్లో రాణించి ఐఏఎస్ లేదా ఐపీఎస్ సాధించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నా.
ఆటలో ప్రతిభ..
* 2015లో నంద్యాలలో జరిగిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో పాల్గొని బంగారు పతకం అందుకున్నాడు.
* 2017లో కర్నూలులో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో స్వర్ణం గెలుపొందాడు.
* 2017లో కడపలో జరిగిన రాష్ట్రస్థాయి టోర్నమెంట్లో బంగారు పతకం సాధించాడు.
* 2018లో నంద్యాలలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో బంగారు పతకం అందుకున్నాడు.
* 2020లో బెంగళూరులో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో స్వర్ణ పతకం గెలుచుకున్నాడు.
* 2021లో బెంగళూరులో నిర్వహించిన జాతీయస్థాయి పోటీల్లో బంగారు పతకం అందుకున్నారు.
* 2022లో విశాఖపట్నంలో జరిగిన రాష్ట్రస్థాయి తైక్వాండో టోర్నమెంట్లో స్వర్ణం గెలుపొందాడు.
* 2022లో దిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో బంగారు పతకం సాధించాడు.
* 2022లో బెంగళూరులో జరిగిన జాతీయస్థాయి టోర్నమెంట్లో సత్తాచాటి బంగారు పతకం అందుకున్నాడు.
* 2023లో గోవాలో నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో రాణించి స్వర్ణం గెలుపొందాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.