logo

వారం రోజుల్లో పరిహారం పంపిణీ

జాతీయ రహదారులకు భూములు ఇచ్చిన రైతులకు పరిహారం పంపిణీ ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా ప్రత్యేక అధికారి, రవాణా, ర.భ.శాఖ కార్యదర్శి పీఎస్‌ ప్రద్యుమ్న అధికారులను ఆదేశించారు.

Published : 04 Jun 2023 02:51 IST

సమీక్షిస్తున్న పీఎస్‌ ప్రద్యుమ్న, చిత్రంలో కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే : జాతీయ రహదారులకు భూములు ఇచ్చిన రైతులకు పరిహారం పంపిణీ ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా ప్రత్యేక అధికారి, రవాణా, ర.భ.శాఖ కార్యదర్శి పీఎస్‌ ప్రద్యుమ్న అధికారులను ఆదేశించారు. నంద్యాల కలెక్టరేట్‌లో జాతీయ రహదారులకు భూ సేకరణపై కలెక్టర్‌ డా.మనజీర్‌ జిలాని సామూన్‌, జాయింట్‌ కలెక్టర్‌ నిశాంతితో కలిసి శనివారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూ సేకరణ పూర్తి చేయడంతో పాటు సంబంధిత ప్రాజెక్టుల పనుల్ని రైతులు అడ్డుకోకుండా పూర్తయ్యేలా చూడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులదేనని స్పష్టం చేశారు. జిల్లాలో ఎన్‌హెచ్‌ 340బీలో భాగంగా సోమయాజులపల్లె నుంచి డోన్‌ వరకు నాలుగు వరుసల రహదారికి సేకరించిన 52.74 హెక్టార్ల భూములకు నెల రోజుల్లో 3జీ అవార్డులు పాస్‌ అయ్యేలా చర్యలు తీసుకోవాలని డోన్‌ ఆర్డీవో వెంకటరెడ్డిని ఆదేశించారు. ఎన్‌హెచ్‌ 167కే జాతీయ రహదారికి సంబంధించి ప్యాకేజీ-4 కింద కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు సేకరించిన భూములకు పరిహారం చెల్లించేందుకు మార్కెట్‌ ధర నిర్ణయించి రైతులకు అవగాహన కల్పించాలని జేసీకి సూచించారు. జాతీయ రహదారి 340సీకి సంబంధించి నందికొట్కూరు నుంచి ఆత్మకూరు వరకు భూములు ఇచ్చిన రైతులకు రూ.40 కోట్ల పరిహారం మొత్తాన్ని వారం రోజుల్లో అందజేయాలని జాతీయ రహదారి పీడీ తరుణ్‌ను ఆదేశించారు. సమావేశంలో ర.భ.శాఖ ఎస్‌ఈ శ్రీధర్‌రెడ్డి, ఎన్‌హెచ్‌ పీడీలు పాల్గొన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని