logo

ఆర్‌యూలో ఆయన చెప్పిందే వేదం

రాయలసీమ విశ్వవిద్యాలయంలో ఏదో ఒక అంశంపై ఆరోపణలు రావడం.. పలు అక్రమాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. వీటిపై కమిటీలు వేస్తున్నా ప్రయోజనం ఉండడం లేదని విద్యార్థి సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Published : 07 Jun 2023 02:17 IST

ఆర్థిక శాఖ, ఈసీ ఆమోదం లేకుండానే నోటిఫికేషన్‌

రోస్టర్‌ పాయింట్ల కేటాయింపులో జాప్యం

కర్నూలు విద్య, న్యూస్‌టుడే : రాయలసీమ విశ్వవిద్యాలయంలో ఏదో ఒక అంశంపై ఆరోపణలు రావడం.. పలు అక్రమాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. వీటిపై కమిటీలు వేస్తున్నా ప్రయోజనం ఉండడం లేదని విద్యార్థి సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలువురు ఉద్యోగులు నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగాలు పొందినట్లు జిల్లా విద్యాశాఖ తేల్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి ఎలాంటి నిబంధనలు పాటించకుండానే ఇంజినీరింగ్‌ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు భర్తీ చేసేందుకు ఇటీవల ఆర్‌యూ అధికారులు ప్రకటించారు. దీనిపై కొందరు కోర్టును ఆశ్రయించారు. ఆర్‌యూలో విధులు నిర్వహిస్తున్న ఓ ప్రొఫెసర్‌ అంతా నేను చూసుకుంటాలే.. అంటూ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అభయం ఇస్తున్నట్లు సమాచారం.

యూజీసీ నిబంధనల బేఖాతరు

ఇంజినీరింగ్‌ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ విషయంలో రోస్టర్‌ పాయింట్ల కేటాయింపులో తీవ్ర జాప్యం జరిగిందంటూ కడప, చిత్తూరు జిల్లాలకు చెందిన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. యూజీసీ నిబంధనల ప్రకారం నోటిఫికేషన్‌ ఇచ్చేముందు ఆర్‌యూ పాలకమండలిలో ఆమోదించిన తర్వాత రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యాలయానికి అనుమతి కోసం పంపాల్సి ఉంది. నోటిఫికేషన్‌లో మహిళా రిజర్వేషన్‌ ఒక్కటీ చూపకపోవడం గమనార్హం. వీసీ పదవీ విరమణ సమయం ఆరు నెలలు ఉంటే ఈ వ్యవధిలో కొత్త పోస్టుల నియామకం, నూతన కోర్సుల ప్రారంభం చేపట్టకూడదని జీవో నంబరు 167 స్పష్టంగా చెబుతోంది. ఈ నిబంధనలూ ఉల్లంఘించారని పలువురు అభ్యర్థులు గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
* రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లో నియామకాలు చేపట్టే అంశం డివిజన్‌ బెంచ్‌ కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నప్పటికీ ఆర్‌యూలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల ఖాళీలు ఎలా భర్తీ చేస్తారని పలువురు ప్రొఫెసర్లు ప్రశ్నిస్తున్నారు.
* పీహెచ్‌డీ పూర్తి చేసిన వారికి మొదటి ప్రాధాన్యమిస్తూ పీజీ, ఎన్‌ఐటీ, ఐఐటీ, బిట్స్‌ పిలానీలో చదివిన వారికి నియామకాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ ఈ నిబంధన ఎక్కడా పాటించలేదని తెలుస్తోంది.

కోర్టును ఆశ్రయించి..

* 2021లో ఆర్‌యూలోని ఇంజినీరింగ్‌ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల భర్తీ కోసం 1 నుంచి 26 వరకు రోస్టర్‌ పాయింట్లు చూపారు. ఇంతవరకు బాగానే ఉన్నా 2023 ఏప్రిల్‌ 25న మరోసారి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో 27వ నంబరు నుంచి రోస్టర్‌ పాయింట్ల చూపాల్సి ఉండగా 22వ నంబరు నుంచి 91వ నంబరు వరకు చూపారు. రోస్టర్‌ పాయింట్లు వరుసగా లేకపోవడంతో పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్‌ ఆపేయాలంటూ హైకోర్టు స్టే ఇచ్చింది. అయినప్పటికీ కొందరు ప్రొఫెసర్లు అత్యుత్సాహం ప్రదర్శించి దరఖాస్తులు తీసుకొని అక్రమాలకు పాల్పడుతూ పలువురు అభ్యర్థులకు అభయం ఇస్తున్నట్లు సమాచారం.
* నోటిఫికేషన్‌లో చూపించని రోస్టర్‌ పాయింట్లు: 23, 26, 28, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 46, 47, 54, 55, 59, 62, 64, 65, 66, 67, 70, 71, 72, 73, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90. యూజీసీ నిబంధన మేరకు ఈ రోస్టర్‌ పాయింట్లు నోటిఫికేషన్‌లో చూపించాల్సి ఉండగా చూపకపోవడంతో అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
* ఈ విషయమై రాయలసీమ విశ్వవిద్యాలయం వీసీ ఆనందరావు మాట్లాడుతూ ఇంజినీరింగ్‌ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్‌కు సంబంధించి యూజీసీ నిబంధన మేరకే దరఖాస్తులు తీసుకుంటున్నామని చెప్పారు. కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించిన మాట వాస్తవమేనని పేర్కొన్నారు. అయినప్పటికీ ఉన్నత విద్యామండలి అనుమతితో దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని