logo

108కు భయాలసిస్‌

డయాలసిస్‌ రోగులూ 108 సేవలు వినియోగించుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఏదైనా ప్రమాద, అనారోగ్య సమస్య ఉన్న బాధితులను సమీప ఆసుపత్రికి చేర్చడానికి గంట సమయం సరిపోతుంది.

Published : 08 Jun 2023 04:31 IST

రోగిని తరలిస్తున్న 108 వాహనం

 ఆళ్లగడ్డ నియోజకవర్గ కేంద్రంలోని 108 వాహనం ఉదయం నాలుగు గంటలకే 25 కి.మీ దూరంలోని ఓ గ్రామానికి వెళ్లింది.. అక్కడ డయాలసిస్‌ బాధితుడిని ఎక్కించుకుని 75 కి.మీ ప్రయాణించి శాంతిరామ్‌ ఆసుపత్రిలో చేర్పించారు. నాలుగు గంటల విలువైన సమయాన్ని ఒక రోగికే సేవలందించారు.

 వైఎస్సార్‌ జిల్లాకు చెందిన డయాలసిస్‌ బాధితుడు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిని ఎంపిక చేసుకున్నారు. ఆ జిల్లా నుంచి 108లో తీసుకురావడానికి నిబంధనలు ఒప్పుకోవు. ఈ నేపథ్యంలో బాధితుడు చాగలమర్రి వచ్చి ఫోన్‌ చేస్తే ఆళ్లగడ్డ పరిధిలోని వాహనం 25 కి.మీ వెళ్లి 65 కి.మీ దూరంలో ఉన్న నంద్యాలకు తరలిస్తోంది. ఇందుకు కనీసం 3 గంటలకు పైగా సమయాన్ని వెచ్చించాల్సి ఉంటోంది.

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: డయాలసిస్‌ రోగులూ 108 సేవలు వినియోగించుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఏదైనా ప్రమాద, అనారోగ్య సమస్య ఉన్న బాధితులను సమీప ఆసుపత్రికి చేర్చడానికి గంట సమయం సరిపోతుంది. డయాలసిస్‌ బాధితులకు కనీసం 3 నుంచి 4 గంటల సమయాన్ని వెచ్చించాల్సి ఉంటోంది. ఇలా ఎక్కువ సమయం కేటాయిస్తుండటంతో ఇతర సేవలపై ప్రభావం పడుతోంది. ఆళ్లగడ్డకు చెందిన 108 వాహనం ద్వారా ఐదుగురు డయాలసిస్‌ బాధితులు సేవలు పొందుతున్నారు. వారి కోసం వారంలో 10 సార్లు నిత్యం 5 గంటలు కేటాయించాల్సి వస్తోంది. చాగలమర్రిలో నలుగురి కోసం ఎనిమిది సార్లు వెళ్ల్లాలి. ఈ సమయంలో ఏదైనా పెద్ద ప్రమాదం జరిగితే వాహనం అందుబాటులో ఉండటం ప్రశ్నార్థకమే.

నిత్యం నలుగురిని తరలించాలి

108 వాహన సేవల నిర్వహణకు నాలుగేళ్ల కిందట కొత్త సంస్థ బాధ్యతల్ని తీసుకొంది. నిత్యం కనీసం నలుగురికి సేవలు అందించాలన్న ఒప్పందం మేరకు డయాలసిస్‌ రోగులను తరలించే బాధ్యతలు 108కు అప్పగించారు. కర్నూలు, నంద్యాల, ఆదోని ప్రాంతాల్లో డయాలసిస్‌ కేంద్రాలు ఉన్నాయి. డయాలసిస్‌ బాధితులను ఆయా కేంద్రాలకు తరలించేందుకు ఒక వాహనం కనీసం 3 గంటలు పడుతోంది. అది కూడా అత్యంత కీలకమైన వేకువ జాము నుంచి 11 గంటల వరకు.  ఆ సమయంలో సగం వాహనాలు డయాలసిస్‌ బాధితుల సేవలకే పరిమితం అవుతున్నాయి.

ఇలా చేస్తే అందరికీ మేలు

తెలంగాణ రాష్ట్రంలో డయాలసిస్‌ రోగులకు ఉచిత బస్‌పాస్‌లు కేటాయించారు. సమీపంలోని డయాలసిస్‌ కేంద్రాలకు (పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌) బస్సుల్లో రాకపోకలు సాగించేందుకు వీలుంటుంది. ఇక్కడ 108 వాహనం కేవలం డయాలసిస్‌ కేంద్రానికి తీసుకెళ్లేందుకు వినియోగిస్తున్నారు. తిరిగి ఇంటికి చేర్చే బాధ్యత తీసుకోలేదు. ఉచిత బస్‌ సౌకర్యం కల్పించడం ద్వారా రాకపోకలకు వెసులుబాటు కలుగుతుంది. 108 సేవలపై ఒత్తిడి తగ్గుతుందని పలువురు పేర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని