logo

ఎగువన నీళ్లు.. దిగువన కన్నీళ్లు

ఉమ్మడి కర్నూలు జిల్లాకు 19.81 టీఎంసీలు.. కేసీ కాలువకు 8.26 టీఎంసీల తుంగభద్ర నీటిని ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది.. జులై 6న నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని రెండ్రోజుల కిందట సమావేశమైన బోర్డు తీర్మానించింది.

Published : 10 Jun 2023 02:46 IST

కర్ణాటకలో ఎల్లెల్సీ కాలువల నిర్వహణ బాగు 
జిల్లాలో నత్తను తలపిస్తున్న పనులు

ఎల్లెల్సీ కాలువ 260 మైలురాయి వద్ద పరిస్థితి

ఉమ్మడి కర్నూలు జిల్లాకు 19.81 టీఎంసీలు.. కేసీ కాలువకు 8.26 టీఎంసీల తుంగభద్ర నీటిని ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది.. జులై 6న నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని రెండ్రోజుల కిందట సమావేశమైన బోర్డు తీర్మానించింది. ‘జల’ తీర్మానం బాగున్నా చి‘వరి’కి నీళ్లు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. తుంగభద్ర దిగువ కాలువ ఆధునికీకరణ పనులు కర్ణాటకలో చాలా వరకు పూర్తయ్యాయి. ఆంధ్ర సరిహద్దున నత్తను తలపిస్తున్నాయి. పనులు జరుగుతున్న తీరు చూస్తే మరో ఏడాది పట్టే అవకాశం ఉన్నట్లు ‘ఈనాడు-ఈటీవీ’ పరిశీలనలో తేలింది. చివరి ఆయకట్టు రైతులకు నీరందడం ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి ప్రత్యేక దృష్టి సారించాలని అన్నదాతలు కోరుతున్నారు.

న్యూస్‌టుడే, ఆలూరు గ్రామీణ హాలహర్వి,ఎమ్మిగనూరు

ఆధునికీకరణకు రూ.448 కోట్లు

తుంగభద్ర బోర్డు పరిధిలో 0/0 నుంచి 250 కి.మీ వరకు దిగువ కాలువ ఉంది. ఎగువన జలచౌర్యం పెరగడంతోఆంధ్రాకు రావాల్సిన 24 టీఎంసీల నీటి వాటాలో కోత పడుతోంది. దీంతో కాలువల ఆధునికీకరణకు బోర్డు శ్రీకారం చుట్టింది. ఇందుకు రూ.448 కోట్లు కేటాయించింది.. తొమ్మిది ప్యాకేజీలుగా విభజించి పనులు ప్రారంభించారు. జిల్లా పరిధిలో 135 కి.మీ. నుంచి 205 కి.మీ. వరకు పనులు దక్కించుకున్న గుత్తేదారులు గతేడాది జూన్‌లో నీటి సరఫరాకు ముందు హడావుడిగా ప్రారంభించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం, క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో గుత్తేదారులు ఇష్టారాజ్యంగా పనులు చేపడుతున్నారు.

కాలువ పొడవునా కనిపించని లైనింగ్‌

ఎమ్మిగనూరు మండలం గుడేకల్లు నుంచి గోనెగండ్ల వరకు 22 కి.మీ. మేర నీరు ముందుకెళ్లాలి. సుమారు 18 కి.మీ. మేర కాలువకు లైనింగ్‌ లేక సాగునీరు ముందుకు పారటం లేదు. 210 క్యూసెక్కుల నీరు పారాల్సిన చోట 160కే పరిమితమైంది. కాలువ కింద 10వేల ఎకరాలకు పారాల్సి ఉండగా.. కొన్ని డిస్ట్రిబ్యూటరీలకు అందడం లేదు. ఏటా చివరి ఆయకట్టు రైతులు రూ.4కోట్లపైగానే పంట నష్టపోతున్నారు.

ప్రధాన కాలువలో సీసీ లైనింగ్‌లేక ముందుకు సాగని నీరు

బీళ్లుగా ఆయకట్టు

* పశ్చిమ ప్రాంత పల్లెలకు జీవనాడి తుంగభద్రమ్మ. దిగువ కాలువ (ఎల్లెల్సీ) పరిధిలో వేల ఎకరాలకు సాగునీరు అందించాలనేది లక్ష్యం. కాలువలు అధ్వానంగా మారడంతో పొలాలు బీళ్లుగా మారి అన్నదాతలకు కన్నీళ్లే మిగులుతున్నాయి.

* తుంగభద్ర దిగువ కాలువ పొడవు : 127 కి.మీ.

* డిస్ట్రిబ్యూటరీలు : 15  

* పిల్లకాల్వలు : 310

* కాలువ పరిధిలో 282.315 కి.మీ నుంచి 305 కి.మీ వరకు లైనింగ్‌ లేదు.

* 305 కి.మీ నుంచి 315 కి.మీ వరకు ఉన్న పాత లైనింగ్‌ శిథిలావస్థకు చేరింది.

* ప్రధాన కాల్వ 45 కి.మీ, డిస్ట్రిబ్యూటరీల పరిధిలో 105 కి.మీ. పిల్ల కాలువలు మరమ్మతులకు నోచుకోలేదు.

ఏటా రూ.250 కోట్ల నష్టం

* ఖరీఫ్‌ ఆగస్టు నుంచి డిసెంబరు 15, రబీ డిసెంబరు 15 నుంచి మార్చి 31 వరకు నీటిని అందించాలి. నీరు చి‘వరి’కి అందకపోవడంతో ఏటా రూ.250 కోట్ల మేర పంట ఉత్పత్తులకు నష్టం వాటిల్లుతోంది.

* ఆయకట్టు : 1,51,134 (రబీ, ఖరీఫ్‌) హెక్టార్లు (ఆదోని, ఎమ్మిగనూరు, కర్నూలు, కోడుమూడు మండలాలు)

* కాలువలో పారాల్సిన నీరు : 724 క్యూసెక్కులు

* సాగునీటి వాటా: 24 టీఎంసీలు

* ఏటా నీటివాటాలో కోత : 6 నుంచి 7 టీఎంసీలు

అక్కడ అద్దంలా

కర్ణాటక రాష్ట్రంలో తుంగభద్ర దిగువ కాలువ 114 కి.మీ. నుంచి 120 కి.మీ. వరకు కాలువ ఆర్‌సీసీ లైనింగ్‌ పనులు పూర్తి చేశారు. గత ఫిబ్రవరిలో నీరు నిలిపివేసినా నేటికీ కాలువలో రెండు అడుగుల నిలిచి ఉంది. ఇక్కడి రైతులు పంటల చివరి దశలోనూ సద్వినియోగం చేసుకుంటున్నారు.

ఇక్కడ అధ్వానంగా

గోనెగండ్ల మండలంలో తుంగభద్ర దిగువ కాలువకు డీపీ 86, పొకలదిన్నె, మిట్టసోమాపురం డిస్ట్రిబ్యూటర్లు ఉన్నాయి.  గోనెగండ్ల, గాజులదిన్నె, కైరవాడి, పుట్టపాశం, వేముగోడు గ్రామాల్లో కాలువ అధ్వాన స్థితికి చేరింది. పంట కాలువలను ముళ్లపొదలు కప్పివేయడంతో నీటిసరఫరాకు అంతరాయం కలుగుతోంది. 3,500 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించాల్సి ఉండగా వంద ఎకరాలకు కూడా అందడం లేదు.

న్యూస్‌టుడే, గోనెగండ్ల

బిల్లులు రావని గుత్తేదారుల వెనకడుగు

కౌతాళం మండలంలో 250.580 నంబరు రాయి నుంచి 265 నంబరు రాయి వరకు సుమారు 14.42 కి.మీ. మేర కాలువ నిర్మించారు. లైనింగ్‌ పూర్తిగా ధ్వంసమైiంది... 500 మీటర్ల మేర కాలువకు ఇరువైపులా లైనింగ్‌ ఆనవాళ్లు కనిపించడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 2019-20 సంవత్సరంలో 14.42 కి.మీ. మేర కాలువకు గోడ, లైనింగ్‌, మట్టి పనులకు రూ.కోటితో టెండర్లు పిలిచారు. బిల్లులు రావడం లేదన్న భయంతో గుత్తేదారులు ముందుకు రావడం లేదు.

న్యూస్‌టుడే, మంత్రాలయం గ్రామీణం

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని