logo

గాజులదిన్నె గాయం

గాజులదిన్నె ప్రాజెక్టు (సంజీవయ్య సాగర్‌) నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచినట్లు సీఎం గొప్పగా చెప్పే ప్రయత్నం చేశారు.

Updated : 22 Sep 2023 05:46 IST

 ప్రాజెక్టు సామర్థ్యం పెంపు
పరిహారం ఇవ్వకుండానే పనులు
 ప్రశ్నార్థకంగా రైతుల భవిష్యత్తు

కొనసాగుతున్న కట్ట ఎత్తు పనులు

‘‘ హంద్రీనీవా కాల్వకు తూము ఏర్పాటు చేసి గాజులదిన్నె ప్రాజెక్టుకు గ్రావిటీ ద్వారా నీటిని అందించడానికి రూ.57 కోట్లు వెచ్చించి పనులు పూర్తి చేశాం.. నీటి నిల్వ సామర్థ్యాన్ని 4.5 టీఎంసీల నుంచి 5 టీఎంసీలకు పెంచే పనులూ పూర్తి చేశామని చెప్పడానికి గర్వపడుతున్నా.

 ఇటీవల డోన్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు.


గాజులదిన్నె ప్రాజెక్టు (సంజీవయ్య సాగర్‌) నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచినట్లు సీఎం గొప్పగా చెప్పే ప్రయత్నం చేశారు. ప్రాజెక్టు ఎత్తు పెంపు కారణంగా ముంపునకు గురయ్యే రైతుల సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేశారు. దీంతో బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూసర్వేకు వచ్చిన అధికారులను పొలాల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. దశాబ్దాలుగా వ్యవసాయంపై ఆధారపడిన మమ్మల్ని హఠాత్తుగా భూములు ఇచ్చేయమనడం ఎంతవరకు సబబు, గతంలో ఒకసారి భూములు, ఇళ్లు కోల్పోయాం.. ఆ గాయాలు నేటికీ వేధిస్తూనే ఉన్నాయి, మళ్లీ మా భూములను లాక్కోవడం న్యాయమా? పరిహారం చెల్లించకుండానే పనులు పూర్తి చేశామని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చెప్పడం దారుణమని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈనాడు, కర్నూలు, న్యూస్‌టుడే, గోనెగండ్ల: గోనెగండ్ల మండలం గాజులదిన్నె గ్రామ సమీపంలో 1977లో హంద్రీ నీవా నదిపై 4.5 టీఎంసీల నీటి సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మించారు. జలాశయం నుంచి ప్రస్తుతం 24,372 ఎకరాలకు సాగునీరు అందుతోంది. పత్తికొండ నియోజకవర్గంలో 27 గ్రామాలు, కృష్ణగిరి మండలంలో 55 పల్లెలు, డోన్‌ మున్సిపాలిటీ, గోనెగండ్లతోపాటు మరో 10 గ్రామాలకు తాగునీరు అందిస్తోంది. నీటి కొరత తీవ్రంగా ఉన్నప్పుడు కర్నూలు నగరానికీ ఈ ప్రాజెక్టు నుంచి నీటిని తరలిస్తారు. తాజాగా దీని సామర్థ్యాన్ని ఒక టీఎంసీకి పెంచుతున్నారు. పెంపు కారణంగా సుమారు 1,923.60 ఎకరాలు ముంపునకు గురికానుంది. వెయ్యి మంది వరకు రైతుల భూములు కోల్పోయే అవకాశముంది. భూసేకరణ చేయాల్సిన గ్రామాల్లో కొన్నిచోట్ల ఎకరం రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ధర పలుకుతోంది. ప్రభుత్వం రూ.4.20 లక్షలే ఇస్తామంటోంది. ఇటీవల ఎన్నెకండ్లలో భూసర్వే చేయడానికి వచ్చిన రెవెన్యూ, సర్వే విభాగాల ఉద్యోగులు, అధికారులను రైతులు అడ్డుకున్నారు.

ఆరు గ్రామాలు.. 1,923 ఎకరాలు మునక

ప్రాజెక్టు నిర్మాణ సమయంలో రైతులు తమ విలువైన భూములు, ఇళ్లు కోల్పోయారు. నిర్వాసితులకు ఎన్నెకండ్ల, ఐరన్‌బండ(ఎ), ఐరన్‌బండ(బి) తదితర గ్రామాల్లో స్థలాలు కేటాయించారు. అప్పట్లో ప్రభుత్వం ఇచ్చిన అత్తెసరు పరిహారం సరిపోక ఇళ్ల నిర్మాణానికి నిర్వాసితులు అప్పులు చేశారు. వాటిని తీర్చడానికి ఏళ్లు పట్టింది.. కొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు.. ఫలితంగా పలు కుటుంబాలు ఛిన్నాభిన్నమైపోయాయి. తాజాగా ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచి మరికొందరిని ముంచుతున్నారు.
గాజులదిన్నె ప్రాజెక్టు సామర్థ్యం పెంపు కారణంగా 1,923.60 ఎకరాలు అవసరమవుతాయని అధికారులు తేల్చారు. సామర్థ్యం పెంచడం వల్ల అదనంగా ఎకరం పారదు.. కేవలం ఎమ్మిగనూరు మున్సిపాలిటీ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ప్రాజెక్టు     సామర్థ్యాన్ని పెంచుతున్నారు. ప్రజల అవసరాల దృష్ట్యా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలను తీసుకున్నా ఫర్వాలేదుగానీ.. వాటి కారణంగా బాధితులుగా మారే వారికి న్యాయం చేయాలన్న కర్తవ్యాన్ని విస్మరించకూడదని రైతులు పేర్కొంటున్నారు.


కుటుంబం ఛిన్నాభిన్నమైంది
- శ్రీనివాసరెడ్డి, ఎన్నెకండ్ల

మా నాన్నకు తొమ్మిది మంది సోదరులు, ఎన్నెకండ్లలో ఉండేవారు. గాజులదిన్నె ప్రాజెక్టు కోసం 1978లో భూములు సేకరించారు. అధికారులు భూములు తీసుకోవడంతో మిగిలినవారు గ్రామం వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లారు. మేము ఒక్కరమే ఇక్కడ ఉంటున్నాం. మిగిలిన భూములు తీసుకుంటామని అంటున్నారు. వృద్ధాప్యం మీద పడింది. ఇలాంటి తరుణంలో భూములు కోల్పోతే ఎలా జీవించాలో అర్థం కావడం లేదు.


ఏకపక్షంగా పెంచేశారు
- నజీర్‌ సాహెబ్‌, ఐరన్‌బండ(ఎ)

ప్రాజెక్టు సామర్థ్యాన్ని ఏకపక్షంగా పెంచేశారు. అందులో నీరు చేరితే మరో 2 వేల ఎకరాలు ముంపునకు గురయ్యే ముప్పు పొంచి ఉందంటున్నారు. ఎవరి పొలాలు మునుగుతాయో తెలీదు. భూసేకరణ చేయకుండానే ప్రాజెక్టు సామర్థ్యం ఎలా పెంచుతారు? ముంపునకు గురయ్యే భూముల యజమానులకు ఇస్తామంటున్న పరిహారం స్వల్పంగా ఉంది. ఇదెక్కడి న్యాయం? ప్రభుత్వం అడ్డగోలుగా ముందుకెళ్తోంది. వందలాది మంది రైతులు, వారి కుటుంబ సభ్యుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు