logo

టెండర్లలో గోల్‌మాల్‌!

పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డు ఆధ్వర్యంలో నిర్మించిన 12 దుకాణాలకు ఆన్‌లైన్‌లో టెండర్లు ఆహ్వానించగా శుక్రవారం గడువు ముగిసింది.

Updated : 27 Nov 2022 04:52 IST

మార్కెట్‌ యార్డు దుకాణాల కేటాయింపు పూర్తి

దుకాణాల టెండర్లను ఖరారు చేస్తున్న అధికారులు

గద్వాల కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డు ఆధ్వర్యంలో నిర్మించిన 12 దుకాణాలకు ఆన్‌లైన్‌లో టెండర్లు ఆహ్వానించగా శుక్రవారం గడువు ముగిసింది. శనివారం టెండర్‌ దరఖాస్తులను పరిశీలించి ఖరారు చేశారు. ఇందులో గోల్‌మాల్‌ జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గద్వాల వ్యవసాయ మార్కెట్‌ యార్డు ప్రహారీని ఆనుకొని రెండుచోట్ల 6 చొప్పున దుకాణాలుండే సముదాయాలను నిర్మించారు. వాటిని కేటాయించడానికి అమల్లో ఉన్న రిజర్వేషన్లను పాటించారు. 12 దుకాణాల్లో ఎస్సీలకు 2, ఎస్టీకి 1, బీసీలకు 3, ఇతరులకు 6 కేటాయించారు. దుకాణాలకు బహిరంగ వేలం నిర్వహించాలని స్థానిక అధికారులు భావించినా.. ఉన్నతాధికారులు ఆన్‌లైన్‌ విధానంలో టెండర్లను ఆహ్వానించారు. ఒక్కో దుకాణానికి గద్వాల రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో నమోదైన ధరలను పరిగణనలోకి తీసుకొని అద్దెను నిర్ణయించారు. ఒక్కో దుకాణానికి రూ.5,742 అద్దె నిర్ణయించి టెండర్లు ఆహ్వానించారు. ఈ అద్దెను పరిగణనలోకి తీసుకొని ఆసక్తి ఉన్నవారి నుంచి కార్యాలయంలోనే కంప్యూటర్లను ఏర్పాటు చేసి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. టెండర్‌ గడువు ముగిసే నాటికి 26 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 12 మంది అద్దె ప్రాతిపదికన దుకాణాలను దక్కించుకున్నారు. ఒక దుకాణానికి ఎక్కువగా 9వేలు, తక్కువగా 5,900లకు దక్కించుకున్నారు. ఆన్‌లైన్‌లో ఎక్కడినుంచైనా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉన్నా.. కార్యాలయంలోనే కంప్యూటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించడంతో కోట్‌ చేసిన ధరలు బహిర్గతమై అతి తక్కువ అద్దెలకు దుకాణాలను దక్కించుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరో వైపు సిండికేట్‌గా మారారనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. బహిరంగ వేలం నిర్వహిస్తే ఇంకా ఎక్కువగా అద్దెలు వసూలయ్యేవని యార్డులోని వ్యాపారులు అంటున్నారు. ఈ విషయమై యార్డు కార్యదర్శి నర్సింహ మాట్లాడుతూ.. సిండికేటు అయ్యేందుకు అవకాశం లేదన్నారు. ధరలు కోట్‌ చేసిన వ్యక్తి ఇతరులకు చెబితే ఏమీ చేయలేమన్నారు. ఆన్‌లైన్‌ విధానం టెండర్లు రాష్ట్ర స్థాయిలో తీసుకున్న నిర్ణయమన్నారు. ఈ విధానంలో ఇప్పటికే చాలాచోట్ల టెండర్లు నిర్వహించినట్లు తెలిపారు. జాయింట్‌ డైరెక్టర్‌ ఇఫ్తికార్‌ అహ్మద్‌, జిల్లా మార్కెటింగ్‌ అధికారిణి పుష్పమ్మ ప్రక్రియను పూర్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని