logo

లిక్కర్‌ స్కాంలో నిండా మునిగిన తెరాస

రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం, కేసీఆర్‌ కుటుంబం లిక్కర్‌ స్కాంలో నిండా మునిగిందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న నాయకులు పేదలను దోచుకుని రూ.కోట్లు సంపాదించి దిల్లీలో పెట్టుబడులు పెట్టారని ఆరోపించారు.

Updated : 02 Dec 2022 07:08 IST

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌

గొందిమళ్ల ప్రాథమిక పాఠశాల వద్ద చిన్నారితో మాట్లాడుతున్న ప్రవీణ్‌కుమార్‌

అలంపూర్‌, న్యూస్‌టుడే : రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం, కేసీఆర్‌ కుటుంబం లిక్కర్‌ స్కాంలో నిండా మునిగిందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న నాయకులు పేదలను దోచుకుని రూ.కోట్లు సంపాదించి దిల్లీలో పెట్టుబడులు పెట్టారని ఆరోపించారు. నియోజకవర్గంలో ఈ నెల 23న ప్రారంభమైన బహుజన రాజాధికార యాత్ర ముగింపు కార్యక్రమానికి గురువారం హాజరయ్యారు. జిల్లా నాయకులతో కలిసి బుక్కాపురం, గొందిమళ్ల, బైరాన్‌పల్లి మీదుగా అలంపూర్‌కు పాదయాత్ర చేశారు. మార్గమధ్యలో రైతులు, విద్యార్థులతో మాట్లాడారు. అలంపూర్‌లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ కరుడుగట్టిన తీవ్రవాదులు కూడా తమ చరవాణులను ధ్వంసం చేయరని, లిక్కర్‌ స్కాంలోని వారంతా తమ ఫోన్లను ధ్వంసం చేశారన్నారు. కేంద్రంలో భాజపా ప్రభుత్వం రాజ్యాంగం మార్చడానికి ప్రయత్నిస్తోందని, మైనార్టీల ఓటు హక్కు తీసేయాలనే కుట్ర చేస్తోందన్నారు. బీసీ రిజర్వేషన్లు పెంచాలని, లేకపోతే ఓట్ల కోసం రావద్దని బండి సంజయ్‌కు సవాల్‌ విసిరారు. అలంపూర్‌ నుంచి ప్రజలు వలస వెళ్తున్నారే తప్ప సిరిసిల్ల, గజ్వేల్‌, సిద్దిపేట ప్రజలు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. నడిగడ్డ పుట్టెడు దుఃఖంలో ఉందని, ఆర్డీఎస్‌ ద్వారా రైతులకు పూర్తి స్థాయిలో సాగు నీరు అందడం లేదన్నారు. అప్పటి ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌, ప్రస్తుత ఎమ్మెల్యే డా.అబ్రహాం 2009లో అలంపూర్‌ వరద బాధితులకు ఎంపిక చేసిన స్థలాల్లో ఇప్పటి వరకు ఇళ్లు నిర్మించలేదన్నారు. ఇటీవల ఓ ప్రైవేటు ఆసుపత్రిలో రమ్య అనే అమ్మాయి మృతి చెందితే రెండు రోజులపాటు వైద్య సేవలు అందించి డబ్బులు లాక్కోవడం బాధాకరమన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని