logo

నమోదులో జాప్యం.. అందని రేషన్‌!

ఆహార భద్రత కార్డులో ఓ ప్రాంతంలో తనకున్న పేరు తొలగించి మరోచోట నమోదు చేయాలని రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లోపే వాటిని తొలగిస్తున్నారు.

Published : 02 Feb 2023 04:41 IST

న్యూస్‌టుడే, నారాయణపేట గ్రామీణం

ఆహార భద్రత కార్డులో ఓ ప్రాంతంలో తనకున్న పేరు తొలగించి మరోచోట నమోదు చేయాలని రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లోపే వాటిని తొలగిస్తున్నారు. వేరేచోట నమోదు మాత్రం ఏళ్లు గడుస్తున్నా నోచుకోవడం లేదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కొత్తగా పెళ్ళయిన వారికి భర్త వారి కార్డులో (కోడళ్లు), వారికి కలిగిన పిల్లలకు ఆహారభద్రత కార్డులో నమోదు చేయకపోవడంతో పౌరసరఫరాల శాఖ నుంచి అందాల్సిన బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు అందడం లేదు. ఒక్కో కుటుంబంలో ఇద్దరు లేక ముగ్గురు వరకు కార్డులో నమోదు కావడం లేదు. ఈ పరిస్థితి ఎనిమిదేళ్ళ నుంచి ఇలాగే ఉంది. ఆహార భద్రత కార్డులో వారి కుటుంబ సభ్యులకున్న కార్డులో తమ పేరు నమోదు చేయాలని ప్రభుత్వానికి మీసేవ ద్వారా అంతర్జాలంలో జిల్లాలో 25,712 మంది నమోదు చేసుకున్నారు. వీరంతా తమ పేర్లు నమోదు చేస్తారని ఎదురు చూస్తుండగా మరికొందరు నమోదుకు అవకాశం కల్పిస్తారేమోనని నిరీక్షిస్తున్నారు. అధికారుల వద్ద నమోదుకు నోచుకోకుండా మరికొందరున్నారు.

ప్రభుత్వ పథకాలకు దూరం.. : ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలంటే పలు పథకాలకు రేషన్‌కార్డు అడుగుతున్నారు. జిల్లాలో 13 మండలాల్లో 300 రేషన్‌ దుకాణాలు కొనసాగుతుండగా వీటిలో 1,40,444 రేషన్‌ కార్డుదారులున్నారు. వీటిలో తమ కుటుంబ సభ్యుల పేర్ల నమోదుకు జిల్లా వ్యాప్తంగా 25,712 మంది దరఖాస్తు చేసుకొని నిరీక్షిస్తున్నామని వాపోతున్నారు. అనారోగ్యం పాలైతే ఆరోగ్యశ్రీ పథకం వర్తించడం లేదని వాపోతున్నారు. దీంతో ప్రైవేట్‌ ఆస్పత్రిని ఆశ్రయించాల్సి వచ్చినప్పుడు లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తూ నష్టపోతున్నారు. ఈ ఇబ్బందుల నుంచి గట్టేక్కేందుకు కార్డులో పేర్లు నమోదు చేయాలని కోరుతున్నారు.



కోస్గి పట్టణంలోని పదో వార్డుకు చెందిన రాస్నం ఆంజనేయులు. ఇతనికి ముగ్గురు ఆడపిల్లలతో పాటు ఓ బాబు ఉన్నాడు. ఒక్క పాప పేరు మాత్రమే తమ కార్డులో నమోదైందని, మిగతా ముగ్గురు పిల్లల పేర్ల నమోదుకు దరఖాస్తు చేసుకున్నా ప్రభుత్వం అవకాశం ఇవ్వకపోవడంతో ప్రతినెలా రేషన్‌ బియ్యం పొందలేక నష్టపోతున్నామని వాపోతున్నారు.

రాస్నం ఆంజనేయులు


చంద్రవంచ గ్రామానికి చెందిన రమేష్‌యాదవ్‌ ఇతనికి 2014లో వివాహం కాగా ఇద్దరు కుమారులున్నారు. రేషన్‌కార్డులో వారి పిల్లల పేర్లు నమోదుకు దరఖాస్తు చేసుకొని మూడేళ్లు గడిచినా నేటికీ నమోదు చేయకపోవడంతో బియ్యం పొందలేక పోతున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా పేర్ల నమోదు ప్రక్రియను చేపట్టాలని కోరుతున్నారు.

చంద్రవంచ రమేష్‌


ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం : అంతర్జాలంలో నమోదు చేసుకున్న వారి వివరాలను ప్రభుత్వానికి నివేదించామని, అనుమతి రాగానే దరఖాస్తుదారుల పేర్లు నమోదు ప్రక్రియ పూర్తవుతుందని డీఎస్‌వో శివప్రసాద్‌రెడ్డి తెలిపారు.

- శివప్రసాద్‌రెడ్డి, డీఎస్‌వో, నారాయణపేట


పెండింగులో ఉన్న దరఖాస్తుల వివరాలు

రెవెన్యూ పరిశీలకుని వద్ద 16,249
రెవెన్యూ తహసీల్దార్‌ 5,392
డీఎస్‌వో పరిధిలో 4,071


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు