logo

తెలుగు తేజాలు దిల్లీలో మెరిశారు

దిల్లీలో జరిగిన రిపబ్లిక్‌ డే క్యాంప్‌(ఆర్‌డీసీ)లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ యూనిట్‌కు చెందిన ఎన్‌సీసీ కేడెట్లు వేర్వేరు విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ట్రోఫీలు, మెడల్స్‌ అందుకున్నారు.

Published : 03 Feb 2023 03:16 IST

ఏపీ, తెలంగాణ ఎన్‌సీసీ కేడెట్లకు మెడల్స్‌
ఈనాడు, హైదరాబాద్‌

జనవరి 26న దిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పరేడ్‌లో విజేతలుగా నిలిచిన క్యాడెట్లు

దిల్లీలో జరిగిన రిపబ్లిక్‌ డే క్యాంప్‌(ఆర్‌డీసీ)లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ యూనిట్‌కు చెందిన ఎన్‌సీసీ కేడెట్లు వేర్వేరు విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ట్రోఫీలు, మెడల్స్‌ అందుకున్నారు. ఆర్మీ సీనియర్‌ వింగ్‌ విభాగంలో సికింద్రాబాద్‌ గ్రూప్‌నకు చెందిన జి.ప్రేమ్‌కృతిక  దిల్లీలో జనవరి 28న కరియప్ప పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన పీఎం ర్యాలీలో ప్రధాని మోదీ చేతుల మీదుగా ఉత్తమ కేడెట్‌గా ట్రోఫీ అందుకున్నారు. సీనియర్‌ డివిజన్‌ నేవి విభాగంలో కేడెట్‌ అమోఘ్‌వర్ధరాజన్‌ మూడో స్థానం, జూనియర్‌ డివిజన్‌ ఆర్మీలో కేడెట్‌ వి.శివగణేశ్‌, నేవి విభాగంలో కేడెట్‌ నితిన్‌ సాయి నాలుగో స్థానంలో నిలిచారు. ఎన్‌సీసీ రిపబ్లిక్‌ డే క్యాంప్‌ దిల్లీలో జనవరి 1 నుంచి 30వ తేదీ వరకు జరిగింది. దేశంలోని 17 యూనిట్ల నుంచి 2155 మంది ఇందులో పాల్గొనగా.. ఏపీ, తెలంగాణ యూనిట్‌ నుంచి 121 మంది ఉన్నారు. 9 మంది బాలురు, 9 మంది బాలికలతో ఏర్పాటు చేసిన కంటింజెంట్‌ కర్తవ్య్‌పథ్‌లో జరిగిన రిపబ్లిక్‌ డే పరేడ్‌లో పాల్గొన్నారు. దిల్లీ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన కేడెట్లకు సికింద్రాబాద్‌లోని ఎన్‌సీసీ డైరెక్టరేట్‌ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏపీ, తెలంగాణ డైరెక్టరేట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ పి.మహేశ్వర్‌ ప్రతి కేడెట్‌ దగ్గరికి వెళ్లి కరచాలనం చేసి అభినందించారు. అత్యుత్తమ ప్రతిభతో యూనిట్‌ గర్వించేలా చేశారని అన్నారు. ఇదే క్రమశిక్షణతో కొనసాగుతూ జీవితంలోనూ ఉన్నత స్థానాలకు చేరాలని ఆకాక్షించారు. ఇకపై చదువులు, పరీక్షలపై దృష్టిపెట్టాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని