logo

దుబాయి కరెన్సీ మార్పిడి పేరుతో మోసం

దుబాయి కరెన్సీ మార్చుకుని లాభపడాలనుకున్న దంపతులను గుర్తు తెలియని వ్యక్తి నిలువునా ముంచాడు.

Published : 06 Feb 2023 06:23 IST

రూ.5 లక్షలతో పరారీ

బాధితుల నుంచి వివరాలు తెలుసుకుంటున్న జడ్చర్ల సీఐ రమేశ్‌బాబు

జడ్చర్ల గ్రామీణం, న్యూస్‌టుడే: దుబాయి కరెన్సీ మార్చుకుని లాభపడాలనుకున్న దంపతులను గుర్తు తెలియని వ్యక్తి నిలువునా ముంచాడు. వారి నుంచి రూ.5 లక్షలు తీసుకుని ఉడాయించిన ఘటన ఆదివారం జడ్చర్లలో జరిగింది. సీఐ రమేశ్‌బాబు, ఎస్సై లెనిన్‌ కథనం మేరకు వివరాలు.. మహబూబ్‌నగర్‌లోని మదీన మసీదు సమీపంలో నివాసం ఉంటున్న సిరాజుద్దీన్‌ ఆప్టికల్స్‌ దుకాణం నిర్వహిస్తున్నారు. ఈయనకు వద్దకు వారం రోజుల క్రితం గుర్తు తెలియని ఓ వ్యక్తి వచ్చి తన వద్ద దుబాయ్‌ కరెన్సీ (దిర్‌హమ్‌) ఉందని, వాటిని తీసుకుని ఇండియన్‌ కరెన్సీ ఇవ్వాలని కోరాడు. కరోనా సమయంలో తన వద్ద దిర్‌హమ్స్‌ ఉండి పోయిందని చెప్పుకొచ్చాడు. తన వద్ద ఉన్న దిర్‌హమ్స్‌ను చూపించాడు. ఇండియన్‌ రూపాయి విలువ ప్రకారం సుమారు 35 లక్షల వరకు ఉంటుందని, వాటిని తీసుకొని రూ.10 లక్షలు ఇవ్వాలని కోరాడు. జడ్చర్లలోని రైల్వేగేటు సమీపంలో గ్రంథాలయం వద్దకు రావాలని సిరాజుద్దీన్‌, ఆయన భార్య యాస్మిన్‌ను సూచించాడు. అక్కడికి ఎందుకు రావాలని వారు ప్రశ్నించడంతో దిర్‌హమ్స్‌ అక్కడే ఉన్నాయని తప్పుదోవ పట్టించాడు. అత్యాశకు పోయిన వారు ఆదివారం జడ్చర్లకు చేరుకుని రూ.5 లక్షలు దుండగుడికి ఇచ్చారు. అతను దుబాయి కరెన్సీ ఉందని ఓ సంచి ఇచ్చాడు. వారు సంచి తెరచి చూడగా అందులో కాగితాలు కనిపించాయి. దుండగుడిని పట్టుకునేందుకు యత్నించగా అతను మరో వ్యక్తితో కలిసి ద్విచక్ర వాహనంపై ఉడాయించాడు. బాధితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ రమేశ్‌బాబు, ఎస్సై లెనిన్‌ బృందం ఘటనా స్థలాన్ని చేరుకొని విచారణ చేశారు. ఇతర రాష్ట్రానికి చెందిన నిందితులు మోసం చేశారని గుర్తించారు. ఆప్రాంతంలోని సీసీ కెమెరాలు పరిశీలించగా ఇద్దరు ద్విచక్ర వాహనంపై పారిపోతున్నట్లు గుర్తించారు. బాధితురాలు యాస్మిన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని