logo

ఉపాధి ప్రణాళిక ఖరారు

జాతీయ ఉపాధిహామీ పథకం కింద 2023-24 ఆర్థిక సంవత్సరానికి పని దినాలను ఖరారు చేశారు. గత సంవత్సరం అక్టోబరు నుంచి డిసెంబరు వరకు ఉపాధి పనుల కేటాయింపు, గుర్తింపునకు గ్రామ సభలు నిర్వహించి పనులను గుర్తించారు.

Published : 07 Feb 2023 05:17 IST

2023-24 ఆర్థిక సంవత్సరంలో 27.20 లక్షల పనిదినాలు
గద్వాల కలెక్టరేట్‌, న్యూస్‌టుడే

పనుల్లో నిమగ్నమైన కూలీలు (పాత చిత్రం)

జాతీయ ఉపాధిహామీ పథకం కింద 2023-24 ఆర్థిక సంవత్సరానికి పని దినాలను ఖరారు చేశారు. గత సంవత్సరం అక్టోబరు నుంచి డిసెంబరు వరకు ఉపాధి పనుల కేటాయింపు, గుర్తింపునకు గ్రామ సభలు నిర్వహించి పనులను గుర్తించారు. 2023 ఏప్రిల్‌ 1 నుంచి 2024 మార్చి 31 వరకు స్థానికంగా కూలీలకు పనులు కల్పించనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని 255 గ్రామ పంచాయతీల పరిధిలో 27 లక్షల 20 వేల 943 పని దినాలు కల్పించాలని జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. గతేడాదితో పోలిస్తే 4.68 లక్షల పని దినాలు తగ్గించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 31 లక్షల 88 వేల 285 పని దినాలను కల్పించాలని ప్రణాళికలు రూపొందిస్తే జనవరి 31 నాటికి 25,70,664 పని దినాల్లో ఉపాధి పనులు జరిగాయి. మార్చి 31 నాటికి మిగిలిన పని దినాలకు సంబంధించిన పనులు గ్రామాల్లో కొనసాగించి లక్ష్యాన్ని చేరుకోవడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఇప్పటికే మండలాలవారీగా ఎంపీడీవోలు, ఎంపీవోలు, గ్రామ కార్యదర్శులు గ్రామ సభలు నిర్వహించి పనులు గుర్తించి కూలీలతో చేయించడానికి కసరత్తు ప్రారంభించారు. ప్రతీ గ్రామంలో 100 మందికి తగ్గకుండా ఉపాధి కూలీలకు పనులు కల్పించాలని కలెక్టర్‌ ఎంపీడీవోలకు ఆదేశాలు జారీ చేశారు. 2022-23 నుంచి కేంద్ర ప్రభుత్వం సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు పనులకు సంబంధించి కొత్త సాప్ట్‌వేర్‌ను రూపొందించారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో టీఎస్‌ రాగాస్‌ సాప్ట్‌వేర్‌తో పనులు చేపట్టేవారు. కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో జమ అయ్యేవి. ఈ విధానంతో కూలీలకు సకాలంలో వేతనాలు అందలేదని ఆరోపణలు రావడంతో కేంద్ర ప్రభుత్వం ఈ సాప్ట్‌వేర్‌ను తొలగించి దాని స్థానంలో కొత్త సాప్ట్‌వేర్‌ ఎన్‌ఐసీతో పనులు చేపట్టనున్నారు. ఈ విధానంలో కూలీలకు బ్యాంకు ఖాతాలో వేతనాలు అందించేందుకు ఆధార్‌ అనుసంధానం ప్రక్రియ కూడా పూర్తి చేశారు. ఈ నెల 1 నుంచి ఆధార్‌తోనే కూలీలకు వేతనాలు చెల్లించే ప్రక్రియ చేపట్టాలని ఇప్పటికే కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.  

పనులు ఇలా : కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ ఏడాది చెరువులు, పంట కాలువల పూడికతీత, అటవీ ప్రాంతంలో నీటి నిల్వలు పెంచడానికి ట్రెంచ్‌ల నిర్మాణాలు, వరద నీటి మళ్లింపు కాలువలు, నీటి కుంటల నిర్మాణం, ఇంకుడు గుంతలు, హరితహారానికి గుంతలు తవ్వడం, వ్యవసాయ పంటపొలాలకు నూతన రోడ్ల నిర్మాణాలు, కూలీలు ఎక్కువగా అవసరమయ్యే పనులు ఈ ఏడాది చేపట్టనున్నారు.


ఎక్కువ పని దినాలు కల్పిస్తాం : 2023-24 ఆర్థిక సంవత్సరంలో కూలీలకు ఎక్కువగా పనులు కల్పించేందుకు ఉపాధి ప్రణాళిక సిద్ధం చేశాం. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పనులను గుర్తించడం జరిగింది. అన్ని మండలాల అధికారులకు మార్గదర్శకాల ప్రకారం పనులు చేపట్టాలని సూచనలు ఇచ్చాం.

నాగేంద్రం, ఇన్‌ఛార్జి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు