logo

సేంద్రియం.. అవుతోంది వ్యర్థం

సేంద్రియ ఎరువుల వాడకంవైపు రైతులను సమాయత్తం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయశాఖ ద్వారా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

Updated : 24 Mar 2023 06:34 IST

మార్కెటింగ్‌పై దృష్టిసారించని అధికారులు

గదుల్లో వృథాగా ఉంచిన సేంద్రియ ఎరువు

పాలమూరు పురపాలకం, న్యూస్‌టుడే: సేంద్రియ ఎరువుల వాడకంవైపు రైతులను సమాయత్తం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయశాఖ ద్వారా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అయితే పాలమూరు పురపాలికశాఖ తడి, పొడి చెత్త సేకరణ ద్వారా మూడేళ్లుగా డంపింగ్‌యార్డులో సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నప్పటికీ ప్రయోజనం కనిపించడం లేదు. ఉత్పత్తి చేస్తున్న సేంద్రియ ఎరువుకు ప్రచారం కల్పించి మార్కెటింగ్‌ చేస్తే ఆదాయం వస్తుందన్న విషయాన్ని పెడచెవిన పెడుతున్నారు. నిత్యం తయారు చేస్తున్న ఎరువును సంచుల్లో నింపి అక్కడే ఉన్న గదిలో నిల్వ ఉంచగా నిష్ప్రయోజనం కావడం గమనార్హం.

నిత్యం తయారీ చేస్తున్నా..

పాలమూరు పురపాలికలో నిత్యం 150 నుంచి 250 కిలోల వరకు సేంద్రియ ఎరువు తయారీ జరుగుతోంది. పురపాలికలోని 49 వార్డుల పరిధిలో ఇళ్లు, వ్యాపార సముదాయాల నుంచి ప్రతి రోజూ సేకరిస్తున్న 110 మెట్రిక్‌ టన్నుల చెత్త నుంచి 45 మెట్రిక్‌ టన్నుల వరకు తడి చెత్తను డంపింగ్‌ యార్డులోనే వేరు చేసి ఆరబెడుతున్నారు. తడి చెత్త ఆరిన తర్వాత పల్వరైజ్‌ యంత్రంతో ముక్కలు చేసి సేంద్రియ ఎరువు తయారీ షెడ్డులో ప్రత్యేకంగా నిర్మించిన గాట్లలో వరుస కుప్పలుగా పోసి వానపాములతో 40 రోజులపాటు కుళ్లబెడుతున్నారు. అలా కుళ్లిన ఎరువును జల్లెడ పట్టి ఎరువుగా తయారు చేసి సంచుల్లో నింపుతున్నారు.

ఇలా చేస్తే ఆదాయం

ఇళ్లలో పూల మొక్కలు, పెరటి తోటలు, రూఫ్‌గార్డెన్లకు, ఇటీవల కొందరు రైతులు సైతం సేంద్రియ ఎరువు ఉపయోగిస్తున్నారు. పురపాలకశాఖ ఈ సేంద్రియ ఎరువును 2, 5, 10, 25 కిలోల ప్యాకెట్లగా తయారు చేసి విక్రయించేలా ఏర్పాట్లు చేయాలి. పట్టణంలో తమ పారిశుద్ధ్య సిబ్బంది ద్వారా సేంద్రియ ఎరువు విక్రయంపై ప్రచారం కల్పించాలి. ప్రస్తుతం తయారు చేస్తున్న ఎరువును హరితహారం మొక్కల పెంపకానికి నర్సరీల్లో ఉపయోగిస్తుండగా మిగతా ఎరువును సంచుల్లో నింపి వృథాగా ఉంచారు.


విక్రయానికి చర్యలు
- రవీందర్‌రెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌

మెట్టుగడ్డ కూడలిలో లేదా రాయచూర్‌ రోడ్డులో పురపాలకకు చెందిన దుకాణాన్ని ఎంపిక చేసుకుని అక్కడ సేంద్రియ ఎరువుల సంచులు విక్రయించేందుకు నిర్ణయించాం. అయితే కార్యాచరణ అమల్లో ఆలస్యమైంది. కమిషనర్‌తో చర్చించి త్వరలో విక్రయానికి చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని