logo

మందగించిన పల్లెప్రగతి

గ్రామ పంచాయతీల్లో పెండింగ్‌ బిల్లులు మంజూరులో జాప్యం పల్లెల అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

Published : 29 May 2023 05:20 IST

ఉమ్మడి జిల్లాలో రూ.100 కోట్లకు పైగా పెండింగ్‌ బిల్లులు

వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం కల్వరాలలో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం


వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం కల్వరాలలో నాలుగేళ్లలో రూ.50 లక్షలకు చెందిన అభివృద్ధి పనులు చేపట్టారు. స్థానిక ప్రజాప్రతినిధులు సొంత నిధులతో పనులు పూర్తిచేశారు. సీసీ రోడ్ల ఏర్పాటు, డ్రైనేజీ, తాగునీటి మోటార్ల మరమ్మతులు, పంచాయతీ భవనం నిర్మాణం, క్రీడా ప్రాంగణాల పనులు చేపట్టారు. పంచాయతీ భవనానికి సంబంధించి రూ.16లక్షలకు గాను రూ.7లక్షలు వచ్చాయి. సీసీ రోడ్డుకు సంబంధించి రూ.25 లక్షలు రావాలి. డ్రైనేజీ పనులకు రూ.9 లక్షలు రావాలి. నీటి సరఫరాకు సంబంధించిన రూ.8 లక్షలు రావాలి.


మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌ మండలం మున్ననూరు పంచాయతీలో రూ.30లక్షల వ్యయంతో డంపింగ్‌ యార్డు, శ్మశానవాటిక, డ్రైనేజీ తదితర పనులు చేశారు. ఇప్పటివరకు రూ.15లక్షల బిల్లులు మాత్రమే వచ్చాయి. మిగతా రూ.15లక్షల కోసం రెండేళ్ల నుంచి అధికారులు చుట్టూ తిరుగుతున్నా చెల్లించకపోవటంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. చిన్నచింతకుంట మండలం కురుమూర్తిలో శ్మశానవాటిక నిర్మించిన ఉపసర్పంచి శంకర్‌ యాదవ్‌ బిల్లు కోసం ఏకంగా నీటి ట్యాంకు ఎక్కి నిరసన తెలిపారు.


ఈనాడు డిజిటల్‌, మహబూబ్‌నగర్‌: గ్రామ పంచాయతీల్లో పెండింగ్‌ బిల్లులు మంజూరులో జాప్యం పల్లెల అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మరో ఏడాదిలో గ్రామ పంచాయతీలకు కొత్త పాలకవర్గాలు రానుండటంతో సర్పంచులు అభివృద్ధి పనులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం లేదు. పాత బిల్లులు రూ. లక్షల్లో పేరుకుపోయాయి. మళ్లీ కొత్త పనులు చేస్తే ఆ బిల్లులకు ఎన్నాళ్లు పడుతోందన్న ఆందోళన వారిలో నెలకొంది. కొత్తగా ఎన్నికయ్యే సర్పంచులు ఈ బిల్లులు మంజూరు చేస్తారో లేదోనన్న అనుమానం కూడా ఉంది. ప్రభుత్వం రాష్ట్ర నిధులు మంజూరు చేయకపోతుండటంతో 15వ ఆర్థిక సంఘం నిధులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ నిధులు కూడా సిబ్బంది జీతభత్యాలకే సరిపోతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 1,690 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో 1,127 గ్రామ పంచాయతీలు పాతవి. ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడంతో మరో 563 కొత్తగా ఏర్పాటయ్యాయి. పాత గ్రామ పంచాయతీలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. కొత్త గ్రామ పంచాయతీలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. చాలాచోట్ల కొత్త పంచాయతీల్లో భవనాల నిర్మాణంతో పాటు ఇతర అభివృద్ధి పనులు చేశారు. దీనికి తోడు సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. తాత్కాలిక సిబ్బందిని ఏర్పాటు చేసుకుని జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు లక్ష్యాలు విధించటంతో అభివృద్ధి పనులకు సొంత నిధులు వెచ్చించిన సర్పంచులు ఇప్పుడు బిల్లులు కోసం ఎదురుచూస్తున్నారు. పంచాయతీల్లో ఆదాయం తక్కువగా ఉండడంతో సిబ్బంది జీతాల చెల్లింపు కూడా కష్టమవుతోంది.
పాత పంచాయతీల్లోనూ అదే పరిస్థితి.. : పాత గ్రామ పంచాయతీల్లోనూ సర్పంచులు వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. పెద్ద గ్రామాలు కావటంతో ఇంటి పన్నుల ఆదాయంతో సిబ్బంది జీతభత్యాలు మాత్రం చెల్లించగలుగుతున్నారు. పన్నుల ఆదాయం తక్కువగా ఉన్నచోట మాత్రం ఇబ్బందులు తప్పటం లేదు. పల్లె ప్రగతిలో భాగంగా అనేక అభివృద్ధి పనులు చేశారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1,681 వైకుంఠధామలు, 1,690 డంపింగ్‌ యార్డులు, 1,692 నర్సరీలు, 1,652 వరకు రైతుల వేదికలను నిర్మించారు. ఐదో విడత పల్లె ప్రగతిలో భాగంగా పలుచోట్ల క్రీడా మైదానాలను ఏర్పాటు చేశారు. వీటితో పాటు సీసీ రోడ్లు, కమ్యూనిటీ భవనాలు, మురుగు కాల్వల వంటి పనులు జరిగాయి. ఒక్కో గ్రామ పంచాయతీలో సుమారు రూ. 20 లక్షలకు పైగా అభివృద్ధి పనులు జరిగాయి. వీటికి సంబంధించిన బిల్లులు రాకపోవడంతో కొత్త పనులు చేపట్టడం లేదు.


ప్రభుత్వ ప్రకటనతో ఆశలు.. : పంచాయతీ పాలకవర్గాల గడువు కూడా దగ్గర పడింది. కొత్త పాలకవర్గాలు వస్తే పెండింగ్‌ బిల్లులపై చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం తాజాగా పెండింగ్‌ బిల్లుల కోసం రూ.1,190 కోట్లు విడుదల చేస్తామని ప్రకటించింది. ఈ బిల్లులొస్తే గ్రామాల్లో మళ్లీ అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో సుమారు రూ. 100 కోట్లకుపైగానే పెండింగ్‌ బిల్లులు ఉన్నట్లు సమాచారం. అత్యధిక గ్రామాల్లో భారాసకు చెందిన సర్పంచులే ఉన్నారు. వీరు కూడా పెండింగ్‌ బిల్లులపై మండల సర్వసభ్య సమావేశాల్లో గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం ఇటీవల చేసిన ప్రకటనపైనే సర్పంచులు ఆశలు పెట్టుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని