logo

రాష్ట్రం వచ్చినా పేదల కష్టాలు తీరలే : భట్టి

ఎన్నో ఆశలతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దం గడుస్తున్నా.. పేదల కష్టాలు మాత్రం తీరడం లేదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు.

Published : 29 May 2023 05:20 IST

పాదయాత్ర సందర్భంగా ఇంద్రకల్‌లో డప్పు కొడుతున్న భట్టి విక్రమార్క

తాడూరు, న్యూస్‌టుడే : ఎన్నో ఆశలతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దం గడుస్తున్నా.. పేదల కష్టాలు మాత్రం తీరడం లేదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. పీపుల్స్‌ మార్చ్‌ 73వ రోజు పాదయాత్రలో భాగంగా ఆదివారం ఉదయం నాగర్‌కర్నూల్‌ జిల్లా తాడూరు మండలంల తుమ్మలసుగూరు గ్రామంలో ప్రారంభమైంది. తుమ్మలసుగూరు, యత్మతాపూర్‌ గ్రామాల మీదుగా సాగిన పాదయాత్రలో మల్లు భట్టివిక్రమార్క దారి పొడవునా కలిసిన రైతులు, మహిళలతో మాట్లాడుతూ ముందుకుసాగారు. ఇంద్రకల్‌లో ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరంలో మధ్యాహ్నం విలేకర్ల సమావేశం నిర్వహించిన అనంతరం భోజన విరామం తీసుకున్నారు. సాయంత్రం ఆరు గంటలకు తిరిగి పాదయాత్రను ప్రారంభించారు. ఇంద్రకల్‌ గ్రామంలో దారి పొడువునా కలిసి మహిళలు, యువకులు, వృద్ధులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన కార్నర్‌ సమావేశంలో భట్టివిక్రమార్క మాట్లాడారు. పదేళ్ల పాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏమి సాధించారని ప్రశ్నించారు. రాష్ట్రంలో సాగుతున్న అప్రజాస్వామ్య పాలనను సాగనంపేందుకే పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అయిదు నెలల్లో రాష్ట్రంలో పేదలు, బడుగు, బలహీన వర్గాల కష్టాలు తీర్చే కాంగ్రెస్‌ ప్రభుత్వం రాబోతుందన్నారు. ప్రత్యేక రాష్ట్రాన్నిచ్చిన కాంగ్రెస్‌కు ఓటు వేసి రుణం తీర్చుకోవాలని కోరారు. రాత్రి ఇంద్రకల్‌ నుంచి తాడూరుకు బయలుదేరగా రాత్రి 10 గంటలకు చేరుకున్నారు. తాడూరు ప్రధాన కూడలిలో ప్రసంగించారు. కృష్ణా నదీ జలాల్లో మన రాష్ట్ర వాటా తేల్చాలని, అన్ని ప్రాంతాలకు సాగునీరందించాలన్నారు. రాత్రి తాడూరు శివారులో బస చేశారు. మాజీ ఎంపీ డా.మల్లురవి, డీసీసీ అధ్యక్షుడు డా.వంశీకృష్ణ, జడ్పీటీసీ సభ్యులు రోహిణి, సుమిత్ర, ఏవీఎన్‌రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు లక్ష్మయ్య, నాయకులు గోవర్దన్‌రెడ్డి, బాలగౌడ్‌, సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు