logo

ఏడేళ్లయినా.. అతీగతీ లేదు!

రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలతో పాటు, 2016 అక్టోబరులో  కొత్త మండలాలను ఏర్పాటు చేసింది.

Published : 29 May 2023 05:20 IST

రాజోలి కస్తూర్బా పాఠశాల పనులు ఇలా..

గద్వాల న్యూటౌన్‌, ఉండవల్లి, న్యూస్‌టుడే : రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలతో పాటు, 2016 అక్టోబరులో  కొత్త మండలాలను ఏర్పాటు చేసింది. ఇది జరిగి ఏడేళ్లు కావొస్తోంది. ఇప్పటికీ ప్రభుత్వ కార్యాలయాలను ఇరుకైన అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. ఫలితంగా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లాలోని అలంపూర్‌, గద్వాల నియోజకవర్గాల పరిధిలో మొదట తొమ్మిది మండలాలే ఉండేవి. అధిక జనాభా, మండల కేంద్రాలకు దూరంగా ఉన్న రాజోలి, కేటీదొడ్డి, ఉండవల్లి గ్రామాలను కొత్త మండలాలుగా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇరుకైన అద్దె భవనాలలో కార్యాలయాలను నిర్వహిస్తున్నారు. అధికారులు, ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు.
* రాజోలి మండలంలో పోలీస్‌ ఠాణా మినహా, మిగతా కార్యాలయాలకు సొంత భవనాల్లేవు. వ్యవసాయ కార్యాలయాన్ని ఇరుకైన భవనంలో నిర్వహిస్తున్నారు. సామగ్రితో నిండి ఉన్న గదిలోనే అధికారులుంటున్నారు. ఐకేపీ కార్యాలయాన్ని గదిలో నిర్వహిస్తున్నారు.
* ఉండవల్లిలో చిన్నపాటి పీఏసీఎస్‌ భవనంలో ఐకేపీ భవనం నిర్వహిస్తుండగా, సమావేశాలకు అవకాశం లేక మానవపాడుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది.
* కేటీదొడ్డిలోనూ సొంత భవనాలు లేకపోవడం తీవ్ర సమస్యగా మారింది. మూడు మండలాల్లో 12 కార్యాలయాలను అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు.

విద్యావ్యవస్థ అస్తవ్యస్తం

* కొత్త మండలాల్లో విద్యావ్యవస్థ గాడి తప్పింది. మండల విద్యాధికారులందరూ ఇన్‌ఛార్జులు కావడంతో పర్యవేక్షణ ఏమాత్రం ఉండటం లేదు. మూడు మండలాల్లో రూ.55 లక్షలకు పైగా వెచ్చించి ఎమ్మార్సీ కార్యాలయాలు నిర్మించినా, అవి ఎంపీడీవో, తహసీల్దార్‌, ఉపాధి కార్యాలయాలుగా మారాయి.
* మూడు మండలాలకు కేజీబీవీలు మంజూరైనా సొంత భవనాలు లేక ఇతర ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. ఒక్కో భవనానికి రూ.2.50 కోట్లకు పైగా కేటాయించారు. రాజోలిలో పనులు పిల్లర్ల దశలోనే నిలిచిపోయాయి. ఫలితంగా పాఠశాలను వడ్డేపల్లి కస్తూర్బాలో నిర్వహిస్తున్నారు. అక్కడ 220 మంది విద్యార్థినులకు మరుగుదొడ్లు సరిపడక అసౌకర్యానికి గురవుతున్నారు. చదువుకునేందుకు, నిద్రించేందుకు ఒకే గదులు వినియోగిస్తున్నారు.
* ఉండవల్లి కస్తూర్బాను కలుగోట్లలో నిర్వహిస్తున్నారు. కేటీదొడ్డికి మంజూరైన విద్యాలయాన్ని ర్యాలంపాడులోని నివాస గృహాల్లో నిర్వహిస్తున్నారు.
వైద్య సేవలు అంతంతమాత్రం : ప్రతి గ్రామంలోనూ వైద్య సేవలు విస్తరించాల్సి ఉండగా, కొత్త మండలాలను అధికారులు పట్టించుకోవడం లేదు. ఉండవల్లి మండలంలో 25 వేలకు పైగా జనాభా ఉన్నా.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయలేదు. ప్రజలు మానవపాడు, క్యాతూర్‌ ఆసుపత్రులపై ఆధారపడాల్సి వస్తోంది. అత్యవసర సమయాల్లో వైద్యానికి పరుగులు తీయాల్సి వస్తోంది.
* కేటీదొడ్డి గ్రామాల ప్రజలు సైతం ధరూర్‌, గట్టు మండలాలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఫలితంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందడం లేదు. పురిటి నొప్పులొస్తే 15 కి.మీ. దూరంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు వెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నారు.


ఇబ్బందులకు గురవుతున్నాం : కొత్త మండలం ఏర్పాటుతో ఎంతో సంతోషించాం. ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు లేవు. వైద్యం కోసం మేమంతా ఇతర మండలాల్లోని పీహెచ్‌సీలకు వెళ్లాల్సి వస్తోంది. ప్రభుత్వం జిల్లా కేంద్రాల్లో నిర్మించినట్లుగా మండలాల్లోనూ భవనాలు నిర్మించి అభివృద్ధికి బాటలు వేయాలి.

నర్సింహులు, ఉండవల్లి


మండలాల అభివృద్ధికి కృషి : సమస్యల పరిష్కారం, మండలాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నా. కొత్త మండలాల్లోనూ శాశ్వత ప్రభుత్వ భవనాలను నిర్మించాలని, ముఖ్యమంత్రి, మంత్రి దృష్టికి తీసుకెళ్లాం. రాజోలి కేజీబీవీ భవనాన్ని గుత్తేదారు వదిలేయడం సమస్యగా మారింది. ఉండవల్లిలో దాదాపు పూర్తి కావచ్చింది. ఉండవల్లి పీహెచ్‌సీ నిర్మాణం కోసం రూ.2.70 కోట్లు మంజూరయ్యాయి. ఉత్తర్వులు వస్తే పనులు ప్రారంభించి, వైద్య సేవలు అందుబాటులోకి వచ్చేలా చూస్తాం.

అబ్రహం, ఎమ్మెల్యే, అలంపూర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని