logo

కాంగ్రెస్‌తోనే ప్రజాస్వామ్య పాలన: సీఎల్పీ నేత భట్టి

దేశంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినప్పుడే ప్రజాస్వామ్య పాలన సాగుతుందని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. పీపుల్స్‌ మార్చ్‌ పేరుతో చేపట్టిన పాదయాత్ర శనివారం 79వ రోజుకు చేరుకుంది.

Published : 04 Jun 2023 03:29 IST

మాట్లాడుతున్న గద్దర్‌, చిత్రంలో భట్టి విక్రమార్క తదితరులు

అచ్చంపేట న్యూటౌన్‌, న్యూస్‌టుడే: దేశంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినప్పుడే ప్రజాస్వామ్య పాలన సాగుతుందని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. పీపుల్స్‌ మార్చ్‌ పేరుతో చేపట్టిన పాదయాత్ర శనివారం 79వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేటలో ఏర్పాటు చేసిన కార్నర్‌ సమావేశంలో భట్టి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు పోలీసులు లేకుండా బయట తిరుగుతారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు స్వేచ్ఛగా తిరిగే వాతావరణం ఏర్పడాలన్నారు. భారాస తొమ్మిదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి శూన్యమని ఎద్దేవా చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో పోడు రైతులు సాగు చేసుకుంటున్న భూములను లాక్కున్న సంస్కృతి కేసీఆర్‌ ప్రభుత్వానిదన్నారు. ఆదిలాబాద్‌లో చెట్టును, పుట్టను పూజించుకునే ఆదివాసీలను అడవుల్లో నుంచి తరలించే కుట్రలు చేయడం దుర్మార్గమన్నారు. లింగాల మండలంలోని రాయవరం, క్యాంపు రాయవరంలో అటవీ భూములను లాక్కోవడం సరైనది కాదన్నారు.    హిమాచల్‌ప్రదేశ్‌, కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని, రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ, రూ.500కే వంటగ్యాస్‌ ఇస్తామన్నారు. ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు, భూమి లేని నిరుపేదలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామన్నారు. ఉమ్మడి జిల్లాలోని పాలమూరు-రంగారెడ్డి, శ్రీ ఉమామహేశ్వర, చెన్నకేశవ ప్రాజెక్టులను పూర్తి చేసి నీళ్లిచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే అన్నారు.  సామాజిక మార్పులను కోరుతూ చేస్తున్న ఉద్యమం అచ్చంపేటలో కాంగ్రెస్‌ గెలుపునకు నాంది కావాలని పిలుపునిచ్చారు.

* రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే  అన్నారు. రాష్ట్ర ప్రజల లక్ష్యాలు నెరవేర్చడానికి భట్టి పాదయాత్ర చేయడం గర్వించతగ్గ విషయమన్నారు. రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీ పేరును దశాబ్ది వేడుకల్లో ప్రస్తావించకపోవడం సరైంది కాదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రత్యేక తెలంగాణ ఇస్తే పేదల జీవితాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో మార్పు రాలేదన్నారు.

* తమిళనాడు సీఎల్పీ నేత సెల్వా పెర్తుంగై మాట్లాడుతూ భట్టి పాదయాత్ర రాష్ట్ర ప్రజల్లో మార్పును తీసుకొస్తుందన్నారు. రాహుల్‌ గాంధీ జోడో యాత్ర, భట్టి నిర్వహిస్తున్న పీపుల్స్‌ మార్చ్‌ యాత్రకు విశేష స్పందన లభించిందన్నారు. నాయకులు నాగం జనార్దన్‌రెడ్డి, వీహెచ్‌, గద్దర్‌, మల్లురవి, ధర్మపురి సంజయ్‌, ప్రసాద్‌, శివసేనారెడ్డి, బెల్లయ్యనాయక్‌, రాహుల్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని