వెక్కిళ్లొస్తున్నాయి.. వాళ్లిక రారు!
అమ్మే శ్వాసగా నాన్నే ధ్యాసగా ఇన్నాళ్లు ఆడుతూపాడుతూ జీవిస్తున్న తొమ్మిదేళ్ల బాలుడికి వారు వెంటవెంటనే కానరాని దూరాలకు వెళ్లడంతో దుఃఖభాజనమైంది. మిరుదొడ్డి మండలం భూంపల్లికి చెందిన స్వామి, వెంకటవ్వ దంపతులు వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. వారికి తొమ్మిదేళ్ల కుమారుడు వెంకటేశ్ ఉన్నాడు. వెంకటవ్వ పది రోజుల క్రితం రక్తహీనత రుగ్మతతో చికిత్స పొందుతూ మృతి చెందింది. భార్య చనిపోవటంతో మనస్తాపానికి గురైన స్వామి అనారోగ్యం పాలై ఈ నెల 25న చనిపోయాడు. అమ్మానాన్నలను కోల్పోయిన బాలుడు విధిలేక అంత్యక్రియలను నానమ్మ, తాత ఆధ్వర్యంలో పూర్తి చేశాడు. చిన్న వయసులోనే ఎవరికీ రాకూడని కష్టాన్ని వెంకటేశ్ ఎదుర్కోవాల్సి రావడంతో గ్రామస్థులు, బంధువులు బోరున విలపిస్తున్నారు. తన భవిష్యత్తేమిటో పూర్తిగా అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్న చిన్నారి కళ్లలో కన్నీటి సుడులు తిరుగుతుండగా నానమ్మ, తాత ఒళ్లో సేదతీరుతున్నాడు. వెంకటేశ్ను తెరాస రాష్ట్ర నాయకుడు బక్కి వెంకటయ్య పరామర్శించి రూ.5 వేల ఆర్థిక సాయం చేశారు. చదువు కోసం సాయం చేస్తానని చెప్పారు.
- న్యూస్టుడే, మిరుదొడ్డి