logo

కొమురవెల్లిలో యువకుడుఆత్మహత్య

కొమురవెల్లి మండల కేంద్రంలో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. గ్రామస్థులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు.. కొమురవెల్లికి చెందిన బూర్గుల వెంకటేశ్‌(32) ఇంట్లో ఎవరూలేని సమయంలో

Updated : 23 Jan 2022 05:59 IST

చేర్యాల, న్యూస్‌టుడే: కొమురవెల్లి మండల కేంద్రంలో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. గ్రామస్థులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు.. కొమురవెల్లికి చెందిన బూర్గుల వెంకటేశ్‌(32) ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరి వేసుకొని తనువు చాలించాడు. ఇంజినీరింగ్‌ చదివి బిల్డరుగా జీవనం సాగిస్తున్న అతడు గత ఏడాది మార్చిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మతిస్థిమితం కోల్పోయాడు. అప్పటి నుంచి మనోవేదనకు గురవుతున్నాడని ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు పేర్కొంటున్నారు. ‘చేతికొచ్చిన పనులు చేజారుతున్నాయని, చేస్తున్న పనులు మరిచిపోతున్నానని, బతకాలని లేదని, చనిపోతున్నా..’ అంటూ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడని కొమురవెల్లి ఏఎస్సై అంజయ్య తెలిపారు.


చెరువులో దూకి వృద్ధుడి బలవన్మరణం

కొండపాక, న్యూస్‌టుడే: రెండేళ్ల కిందట చనిపోయిన భార్య మరణం ఆయన్ను మద్యానికి బానిసగా మార్చింది. ఇక భరించడం నా వల్ల కాదని, ఆత్మహత్య చేసుకుంటానంటూ నాలుగైదు రోజులుగా చుట్టుపక్కల వారితో చెబుతూ వస్తుండగా చివరికి అన్నంత పనిచేశాడు. కొండపాక మండలం దమ్మకపల్లిలో శనివారం చోటు చేసుకున్న ఈ ఘటనలో గుమ్మడిదల బిక్షపతి (72) అనే వృద్ధుడు మల్లంకుంట చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కుకునూరుపల్లి ఎస్‌ఐ పుష్పరాజ్‌, గ్రామస్థులు తెలిపిన వివరాలు.. దమ్మకపల్లికి చెందిన గుమ్మడిదల బిక్షపతి భార్య మల్లవ్వ రెండేళ్ల కిందట తీవ్ర అనారోగ్యం బారిన పడగా హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స చేయించినా ఫలితం లేక పోయింది. భార్య మరణం ఆయన్ను కుంగదీసింది. పదేపదే ఆమెను తలచుకుంటూ బాధపడేవారు. కుమారుడు బాలయ్య బాగా చూసుకుంటున్నా ఆయన భార్యను తలచుకుంటూ మద్యం తాగుతూ గడిపేవాడు. తనకు బతకాలని లేదని, ఆత్మహత్య చేసుకుంటానని చెబుతూ వస్తుండగా మద్యం మత్తులో చెబుతున్నారని భావించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు పొలానికి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లిన బిక్షపతి సాయంత్రం 5 గంటలు అయినా ఇంటికి రాలేదు. దాంతో కుటుంబసభ్యులు, గ్రామస్థులు కలిసి పొలం చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోయింది. శనివారం ఉదయం చెరువు సమీపంలోని పొలం వద్దకు వెళ్లి చూడగా గట్టుపై చెప్పులు, మద్యం సీసా, కొంత డబ్బు కన్పించాయి. చెరువులో గాలించగా బిక్షపతి మృతదేహం వెలుగుచూడటంతో కొడుకు, కోడలు బోరున విలపించారు. ఆయన కుమారుడు బాలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని