logo

సమగ్ర సమాచారం.. కొలువు సాధనకు అభయం!

ఎక్కడెక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నది తెలుసుకోవడం కాస్త కష్టమే. అర్హత తగ్గట్టు కొలువులు ఖాళీగా ఉన్నాయా తెలుసుకొని దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఆయా వివరాలు తెలిస్తే సన్నద్ధం అయ్యేందుకు మార్గం సుగమం అవుతుంది.

Published : 22 May 2022 02:31 IST

వెబ్‌సైట్‌ ఆవిష్కరణలో మంత్రి హరీశ్‌రావు
- ‘జాబ్‌స్పేస్‌’ వెబ్‌సైట్‌
ఈనాడు, సంగారెడ్డి

ఎక్కడెక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నది తెలుసుకోవడం కాస్త కష్టమే. అర్హత తగ్గట్టు కొలువులు ఖాళీగా ఉన్నాయా తెలుసుకొని దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఆయా వివరాలు తెలిస్తే సన్నద్ధం అయ్యేందుకు మార్గం సుగమం అవుతుంది. ఇదే లక్ష్యంతో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో అడుగు పడింది. గ్రంథాలయ సంస్థలు ఈ దిశగా ముందుకు సాగి వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకురావడం విశేషం. జాబ్‌స్పేస్‌ పేరిట దీన్ని రూపొందించగా, దీనికి సంబంధించిన యాప్‌ను సైతం సిద్ధం చేస్తున్నారు.
ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని గ్రంథాలయ సంస్థలు కలిసి ఉద్యోగ ఖాళీల సమాచారం అందించే ఈ వెబ్‌సైట్‌ను రూపొందించాయి. గ్రంథాలయాల్లో సభ్యులుగా ఉన్నవారికి ఎప్పటికప్పుడు చేరేలా ఏర్పాట్లు చేయడం గమనార్హం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే నోటిఫికేషన్లతో పాటు సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లోని ప్రైవేటు సంస్థల్లో ఖాళీల గురించి ఇందులో పొందుపరుస్తున్నారు.

ప్రభుత్వ ప్రకటనలు..

తెలంగాణ ప్రభుత్వం 91 వేల ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టిన విషయం విదితమే. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సైతం ప్రకటనలు విడుదల చేస్తుంటాయి. మరోవైపు ప్రైవేటు బ్యాంకింగ్‌, ఇతరత్రా రంగాల్లోనూ ఖాళీలను భర్తీ చేస్తుంటారు. ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు నిరుద్యోగులకు చేరవేసేలా ఈ వెబ్‌సైట్‌ను రూపొందించారు. రూ.200 చెల్లించి గ్రంథాలయంలో సభ్యత్వం తీసుకున్న అందరూ ఆయా సేవలు పొందే అవకాశం కల్పించారు. సభ్యులు ఉచితంగా పుస్తకాలు ఇంటికి తీసుకెళ్లడంతో పాటు డిజిటల్‌ లైబ్రరీ సేవలు వినియోగించుకునే వెసులుబాటు కల్పించారు.
 సభ్యత్వాలు పెంచేలా..
ఉమ్మడి జిల్లాలో 53 గ్రంథాలయాలు కొనసాగుతున్నాయి. వీటిల్లో ప్రస్తుతం 42 వేల మందికి పైగా సభ్యులుగా ఉన్నారు. ఈ సంఖ్యను మరింత పెంచి గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకునేలా యువతను ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగా వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రస్తుతం పోటీపరీక్షలకు యువత సిద్ధమవుతున్న వేళ గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచడం గమనార్హం. సంగారెడ్డి, సిద్దిపేట జిల్లా గ్రంథాలయాల్లో మధ్యాహ్నం ఉచితంగా భోజనం అందిస్తున్నారు. గ్రంథాలయాల్లో సభ్యత్వం ఉన్నవారు జాబ్‌స్పేస్‌ వెబ్‌సైట్‌, యాప్‌ను ఉపయోగించుకునేలా ప్రణాళిక రూపొందించారు. దీనివల్ల సభ్యత్వాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది.
అర్హతలు.. వేతనాలు..
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పారిశ్రామిక వాడ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జహీరాబాద్‌లో ఏర్పాటుచేస్తోన్న నిమ్జ్‌లో పరిశ్రమలను స్థాపిస్తున్నారు. సిద్దిపేట జిల్లా వర్గల్‌లో ఆహార పరిశ్రమలు నెలకొల్పనున్నారు. సిద్దిపేట, గజ్వేల్‌ పరిసరాల్లో ఇప్పటికే పలు కర్మాగారాలు అందుబాటులోకి వచ్చాయి. మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం కాళ్లకల్‌లో పారిశ్రామిక వాడ వెలిసింది. చేగుంట, చిన్నశంకరంపేట, నర్సాపూర్‌ ప్రాంతాల్లో పలు రంగాలకు సంబంధించిన పరిశ్రమలను నెలకొల్పారు. మహీంద్రా, పెప్సీ, ఎంఆర్‌ఎఫ్‌ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలతో పాటు అరబిందో, హెటిరో లాంటి ఫార్మా కంపెనీలూ ఉన్నాయి. ఇలాంటి ప్రైవేటు సంస్థలన్నింటితో చర్చించి ఆయా చోట్ల ఉండే ఉద్యోగ ఖాళీలను సదరు వెబ్‌సైట్‌, యాప్‌లో పొందుపర్చనున్నారు. విద్యార్హతలు, వేతనం వంటి ప్రాథమిక వివరాలతో పాటు ఆయా ఉద్యోగాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్నీ సభ్యులకు అందిస్తున్నారు.
ఎప్పటికప్పుడు అభివృద్ధి..
- హరీశ్‌రావు, ఆర్థికశాఖ మంత్రి

ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని నిరుద్యోగులకు ఉపయుక్తంగా ఉండేలా ఈ వెబ్‌సైట్‌ను రూపొందించాం. ఎప్పటికప్పుడు దీన్ని అభివృద్ధి చేస్తాం. ఈ సేవలను నిరుద్యోగులు వినియోగించుకోవాలి. ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న గ్రంథాలయాల్లోనూ పోటీపరీక్షలకు అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచుతున్నాం.
విజయవంతమైతే..
ప్రస్తుతం ఈ వెబ్‌సైట్‌ను ఉమ్మడి జిల్లాకు పరిమితం చేశారు. ఇక్కడ ప్రయోగపూర్వకంగా పరిశీలించి విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. గత నెల 25న ఈ వెబ్‌సైట్‌ను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సిద్దిపేటలో ప్రారంభించారు. మంత్రి హరీశ్‌రావు సూచనలతో సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట జిల్లాల గ్రంథాలయాల సంస్థ అధ్యక్షులు పట్లోళ్ల నరహరిరెడ్డి, చంద్రాగౌడ్‌, లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిల నేతృత్వంలో రూపొందించారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని