logo

కాగితాల్లోనే ఆధునిక గోదాములు...

ఓ వైపు వరి పంట చేతికొచ్ఛి. దిగుబడులు విక్రయిస్తున్నారు. ప్రభుత్వం కేంద్రాలను ఏర్పాటుచేసి కొనుగోలు చేస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా క్షేత్రస్థాయిలో ధాన్యం నిల్వ చేసేందుకు గోదాముల సమస్య వేధిస్తోంది.

Published : 24 May 2022 02:33 IST

స్థల సేకరణ చేసినా నిధులకు నిరీక్షణ..

న్యూస్‌టుడే, నర్సాపూర్‌


నర్సాపూర్‌లో గోదాము నిర్మాణానికి సేకరించిన స్థలం

ఓ వైపు వరి పంట చేతికొచ్చి.. దిగుబడులు విక్రయిస్తున్నారు. ప్రభుత్వం కేంద్రాలను ఏర్పాటుచేసి కొనుగోలు చేస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా క్షేత్రస్థాయిలో ధాన్యం నిల్వ చేసేందుకు గోదాముల సమస్య వేధిస్తోంది. పంటల దిగుబడులను నిల్వ చేసేందుకు రైతులకు, ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం, మొక్కజొన్న, పత్తి ఉత్పత్తులను నిల్వ చేయడానికి అవస్థలు పడాల్సి వస్తోంది. ఆయా ఇబ్బందులను గుర్తించిన పాలకులు రెండేళ్ల క్రితం నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. ఇందుకు ప్రభుత్వ స్థలాలను సేకరించినా ఇంతవరకు ఒక్క అడుగు ముందుకు పడకపోవడం గమనార్హం.

నియోజకవర్గ కేంద్రం నర్సాపూర్‌తో పాటు వెల్దుర్తిలో ఆధునిక వ్యవసాయ మార్కెట్‌ గోదాముల నిర్మాణానికి రెండేళ్ల కిందట ప్రతిపాదనలు పంపించారు. రెండు చోట్ల్ల 40 వేల మెట్రిక్‌ టన్నుల నిల్వ సామర్థ్యం ఉన్న వాటిని నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు నిధుల మంజూరకు ప్రతిపాదనలు పంపించారు. అయితే అవి కాస్త దస్త్రాలకే పరిమితమయ్యాయి.

సర్వే చేపట్టి..

డివిజన్‌ కేంద్రం నర్సాపూర్‌లో మెదక్‌ మార్గంలోని 731 సర్వే నెంబరులో ప్రభుత్వ భూమిని సర్వే చేశారు. 30 ఎకరాలు అనుకూలంగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో అక్కడే నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదన రూపొందించారు. అక్కడికి వెళ్లేందుకు తాత్కాలిక దారి సైతం నిర్మింపజేశారు. మరోవైపు వెల్దుర్తిలో సర్వే చేపట్టి అనుకూలమైన భూములను గుర్తించారు. మార్కెటింగ్‌, రెవెన్యూ శాఖ అధికారులు సంయుక్తంగా ఈ ప్రక్రియ పూర్తిచేశారు. ఇక ఆ తర్వాత వాటి ఊసే మరచిపోయారు. వాటిని నిర్మించి అందుబాటులోకి తీసుకొస్తే రైతులకు వెతలు తప్పడమే కాకుండా పలువురికి ఉపాధి లభించే అవకాశం లేకపోలేదు.

తప్పని పాట్లు

గత రెండు, మూడేళ్లుగా వర్షాలు సమృద్ధిగా కురవడంతో చెరువులు, కుంటల కింద సాగు పెరిగి దిగుబడులు వచ్చాయి. అయితే వీటి నిల్వకు ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది ధాన్యం నిల్వ చేయడానికి ఏఎంసీ షెడ్లు, గురుకులాలు, ప్రభుత్వ వసతిగృహాలు, మూతపడిన కోళ్లఫారాలు, కంపెనీలను వినియోగించుకోవాల్సి వచ్చింది. చివరకు నర్సాపూర్‌లో కొత్తగా నిర్మాణం చేపట్టిన బస్‌డిపోలో సైతం బస్తాలు భద్రపరిచారు. మిల్లులో సైతం ఎక్కడ చూసినా ధాన్యం బస్తాలే కనిపించాయి. అదే గోదాములు అందుబాటులోకి వచ్చి ఉంటే ఈ ఇబ్బందులు తప్పేవి.

నాబార్డు నిధులతో..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నాబార్డు నిధులతో విరివిగా గోదాముల నిర్మాణం చేపట్టింది. నియోజకవర్గ వ్యాప్తంగా ఆరు మండలాల్లో వీటి నిర్మాణాలు జరిగాయి. నర్సాపూర్‌, శివ్వంపేట మండలం చిన్నగొట్ట్టిముక్ల, వెల్దుర్తి, కొల్చారం, కౌడిపల్లి మండలాల్లో 5 వేల మెట్రిక్‌ టన్నుల నిల్వ సామర్థ్యం మేర నిర్మాణం చేపట్టారు. వీటి వల్ల ఆయా మార్కెట్‌ కమిటీలకు ప్రతి నెలా లక్షల రూపాయల ఆదాయం చేకూరుతోంది. ఆధునిక గోదాముల నిర్మిస్తే రైతులు తాము పండించిన పంట ఉత్పత్తులను దాచుకునేందుకు అవకాశం కలుగుతుంది. తద్వారా ఏఎంసీలకు ఆదాయం పెరుగుతుంది. మార్కెట్లో మద్దతు ధర లభించనప్పుడు విక్రయించవచ్ఛు

ముఖ్యమంత్రిని కలిసి నివేదిస్తా.. : - మదన్‌రెడ్డి, నర్సాపూర్‌ ఎమ్మెల్యే

గోదాముల అవసరాన్ని గుర్తించి కొత్త వాటి నిర్మాణం చేపట్టాలని నిర్ణయించాం. నిధుల మంజూరు కోరుతూ నాబార్డుకు ప్రతిపాదనలు పంపించాం. స్థలాలు సైతం అందుబాటులో ఉన్నాయి. ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తా. సమస్యను వివరించి నిధుల మంజూరుకు కృషి చేస్తా.

ప్రస్తుతం ఇదీ పరిస్థితి...

2500 మెట్రిక్‌ టన్నులవి: 02

అందుబాటులో ఉన్న గోదాములు: 09

ప్రతి నెలా వస్తున్న ఆదాయం రూ.8.50 లక్షలు

5 వేల మెట్రిక్‌ టన్నులవి: 07

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని