logo

‘ప్రైవేటుకు మిన్నగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు’

రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేటు కన్నా మిన్నగా వైద్య సేవలు అందిస్తున్నామని హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం హుస్నాబాద్‌లోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు ఆహార పంపిణీ కార్యక్రమాన్ని ఆయన

Published : 25 Jun 2022 01:25 IST

ఆసుపత్రిలో ఆహారాన్ని పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే తదితరులు

హుస్నాబాద్‌, హుస్నాబాద్‌ గ్రామీణం: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేటు కన్నా మిన్నగా వైద్య సేవలు అందిస్తున్నామని హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం హుస్నాబాద్‌లోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు ఆహార పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో వ్రైద్య సేవలు మెరుగపడ్డాయన్నారు. రానున్న రోజుల్లో 50 పడకల మాతాశిశు ఆరోగ్య కేంద్రం ఏర్పాటు కానుందన్నారు. బాలింతకు కేసీఆర్‌ కిట్‌ అందచేశారు.

గండిపల్లి ప్రాజెక్టు పనులు చేపడుతాం..

గౌరవెల్లి ప్రాజెక్టు పనులు పూర్తయిన వెంటనే గండిపల్లి ప్రాజెక్టు పనులు చేపడుతామని హుస్నాబాద్‌ ఎమ్మెల్యే తెలిపారు. శుక్రవారం అక్కన్నపేట ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ మాలోతు లక్ష్మి అధ్యక్షతన జరిగిన మండల పరిషత్తు సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. గండిపల్లి ప్రాజెక్టుకు ఎలాంటి భూ సేకరణ చేయాల్సిన అవసరం లేదన్నారు. కేవలం 11 ఇళ్లు మాత్రమే మునిగిపోతాయన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టును నీటితో నింపిన తర్వాత అక్కడి నుంచి గండిపల్లికి సరఫరా చేస్తామన్నారు. గౌరవెల్లి నిర్వాసితులకు ఎలాంటి నష్టం జరగవద్దని, వారికి ఇబ్బంది కల్గకుండా ఉండేందుకే కాలువల ద్వారా నీరందించాలనేది తమ ఆలోచన అన్నారు. నిర్వాసితులకు పరిహారం చెల్లించడంతో పాటు మానవతా దృక్పథంతో తాజా మేజర్లకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు.

క్రీడల్లో రాణించేందుకు ప్రాంగణాలు

గ్రామీణ విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తి పెంచేందుకు ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తోందని ఎమ్మెల్యే అన్నారు. అక్కన్నపేట మండలం పోతారం(జె)లో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాన్ని శుక్రవారం సాయంత్రం ప్రారంభించి మాట్లాడారు. ఖోఖో, వాలీబాల్‌, షటిల్‌, కబడ్డీ మైదానాలు బాగున్నాయని సర్పంచిని అభినందించారు. కొద్దిసేపు షటిల్‌, వాలీబాల్‌ ఆడారు. మొక్కలు నాటారు. అక్కన్నపేట రైతువేదికలో కల్యాణలక్ష్మి పథకం కింద 106 మందికి రూ.1.06 కోట్ల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీటీసీ సభ్యురాలు భూక్యా మంగ, పుర అధ్యక్షురాలు రజిత, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రమేశ్‌రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సౌమ్య తదితరులు పాల్గొన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని