logo

తనిఖీలే కీలకం.. సమావేశాలు కనం..

ఆసుపత్రుల్లో రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు కల్పించడంతో పాటు నిర్వహణ మెరుగుపర్చేందుకు అభివృద్ధి కమిటీల పాత్ర కీలకం. వీటిని ఏర్పాటుచేసి మూడు నెలలకోసారి సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం సూచించినా క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లే

Published : 05 Jul 2022 01:48 IST

ఊసేలేని ఆసుపత్రి అభివృద్ధి కమిటీలు

న్యూస్‌టుడే, మెదక్‌, శివ్వంపేట, రామాయంపేట, చేగుంట, నర్సాపూర్‌ రూరల్‌, కౌడిపల్లి, తూప్రాన్‌

సుపత్రుల్లో రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు కల్పించడంతో పాటు నిర్వహణ మెరుగుపర్చేందుకు అభివృద్ధి కమిటీల పాత్ర కీలకం. వీటిని ఏర్పాటుచేసి మూడు నెలలకోసారి సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం సూచించినా క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. జిల్లాలో సమావేశాలు నిర్వహించడం లేదని కమిటీ ఛైర్మన్లయిన ఎంపీపీలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. రోగుల సమస్యలు పరిష్కారానికి నోచడం లేదు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఆసుపత్రుల తీరుపై ‘న్యూస్‌టుడే’ పరిశీలన కథనం.

జిల్లాలో 19 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రితో పాటు నర్సాపూర్‌లో ప్రాంతీయ, తూప్రాన్‌, రామాయంపేట, కౌడిపల్లిలో సామాజిక ఆసుపత్రులు ఉన్నాయి. ఆయా వాటిల్లో మెదక్‌లోని జిల్లా ఆసుపత్రి, నర్సాపూర్‌ ఆసుపత్రుల్లో రోగుల తాకిడి అధికంగా ఉంటుంది. ప్రస్తుతం చలి, జ్వరం, దగ్గు, డెంగీ, టైపాయిడ్‌ వంటి వాటితో ప్రభుత్వ ఆసుపత్రులకు రోగులు వస్తుంటారు. కనీస వసతులు కరవై అవస్థలు తప్పడంలేదు. ఇక చాలా చోట్ల వైద్య పరికరాలు మూలకు చేరాయి.

శివ్వంపేటలో...

సమస్యలు పరిష్కారం కాక.. 

మూడు నెలలకోసారి అభివృద్ధి కమిటీ సమావేశాలు నిర్వహించాలి. దవాఖానాల్లో నెలకొన్న సమస్యలపై చర్చించి పరిష్కారానికి మార్గం చూపాల్సి ఉంటుంది. వైద్య విధాన పరిషత్తు ఆసుపత్రుల్లో కమిటీలు ఏర్పాటుచేయలేదు. జిల్లాలోని 19 పీహెచ్‌సీల్లో కమిటీలను ఏర్పాటు చేసినా సమావేశాలు నిర్వహించడం లేదు. కమిటీలో ఎంపీపీ ఛైర్మన్‌గా, జడ్పీటీసీ సభ్యులు, సర్పంచులు, వైద్యాధికారి, ఎంపీడీవో, తహసీల్దార్‌ సభ్యులుగా ఉంటారు.

సిబ్బంది కొరత..

నర్సాపూర్‌లోని వంద పడకల ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. ఇద్దరు జనరల్‌ ఫిజీషియన్‌, కంటి, చర్మ, రేడియాలజిస్ట్‌ వైద్యులు లేరు. 30 మంది సిబ్బందికి 20 మందే ఉన్నారు. ఆపరేషన్‌ థియేటర్‌ సహాయకులు ఒక్కరూ లేరు. డయాలసీస్‌ కేంద్రం లేక రోగులు హైదరాబాద్‌ లేదంటే మెదక్‌కు వెళ్లాల్సి వస్తోంది. స్కానింగ్‌కు పాత యంత్రాలనే వినియోగిస్తున్నారు.

వసతులున్నా..

రామాయంపేటలో రూ.5 కోట్లతో ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించారు. ఇటీవల వైద్యవిధాన పరిషత్తులోకి మార్చగా, వైద్యుల కొరత వేధిస్తోంది. ప్రస్తుతం ముగ్గురే ఉన్నారు. గైనకాలజిస్ట్‌ లేక ప్రసవాల జోలికే వెళ్లడం లేదు. నాలుగు రోజులుగా ఇన్వర్టర్‌ పని చేయడం లేదు. విద్యుత్తు లేకపోతే చిన్నపాటి ఛార్జింగ్‌ దీపాన్ని ఏర్పాటు చేసుకొని వెళ్లదీస్తున్నారు. కౌడిపల్లి పీహెచ్‌సీకి ఇటీవల వర్గోన్నతి కల్పించినా ఇంకా ముందడుగు పడలేదు. ఇద్దరు వైద్యులే ఉన్నారు.

జాతీయ రహదారిలో..

తూప్రాన్‌లో 50 పడకలతో ఆసుపత్రిని నిర్మించారు. 44వ జాతీయ రహదారి కావడంతో నిత్యం రోడ్డు ప్రమాద బాధితులను ఇక్కడికే తీసుకొస్తారు. ఆర్థోపెడిక్‌ వైద్యుడు లేకపోవడంతో ప్రైవేటుకు పంపిస్తున్నారు. ట్రామా కేర్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి.

అధ్వానంగా పారిశుద్ధ్యం..

మెదక్‌లోని ప్రాంతీయ ఆసుపత్రిలో సమస్యలదే రాజ్యం. పారిశుద్ధ్యం లోపించింది. రక్తనిధి కేంద్రం ఎదుట నీళ్లు నిలుస్తున్నాయి. భవనం పెచ్చులూడుతోంది. పైప్‌లైన్లు స్తంభించి, నీటి సరఫరాకు ఆటంకం ఏర్పడుతోంది. ఇటీవల రెండు వార్డుల్లో నీరు, విద్యుత్తు సరఫరా నిలిచిపోయి అంధకారం ఏర్పడింది. ఇక పలు గదుల్లో పందికొక్కుల తవ్వకంతో రంధ్రాలు ఏర్పడి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సీసీ రహదారి లేక వర్షానికి బురదమయమే.

పీహెచ్‌సీలలో ఇలా..

* పెద్దశంకరంపేట పీహెచ్‌సీ డిస్పెన్సరీ గదుల్లో నిర్వహిస్తున్నారు. దీంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

* రామాయంపేట మండలం ప్రగతిధర్మారంలో గదుల కొరత వేధిస్తోంది. శౌచాలయాలు లేకపోవడం గమనార్హం.

* శివ్వంపేటలో ఆపరేషన్‌ థియేటర్‌ నిరుపయోగంగా ఉంది. ప్రసవాలు సరిగా జరగడం లేదు.

* నర్సాపూర్‌ మండలం రెడ్డిపల్లిలో భవనం ఇరుగ్గా ఉంది. విస్తరించాల్సి ఉంది. కేవలం ఆరు పడకలే ఉండటం సమస్యగా మారింది.

* కొల్చారం మండంలం రంగంపేటలో భవనం శిథిలావస్థకు చేరింది. పెచ్చులూడుతున్నాయి. వర్షం పడితే నీళ్లు లోపలికి వస్తున్నాయి. నీటి సమస్య నెలకొంది.


మూడేళ్లు పని చేయక..

పాపన్నపేట పీహెచ్‌సీలో వర్షం కురిస్తే మొత్తం జలమయమే. ఆసుపత్రిలో బిడ్డ పుట్టగానే వేడి తగిలేలా రెండు బేబీ వార్మర్లను ఏర్పాటుచేశారు. అవి మూడేళ్లుగా పని చేయక మూలకు చేరాయి. వాటి గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు.


నిరీక్షించాల్సిందే..

చేగుంటలో విద్యుత్తు తీగలు వేలాడుతున్నాయి. గర్భిణులు కూర్చునేందుకు కుర్చీలు లేకపోగా, ఇరుకు స్థలంలో నిరీక్షించాల్సిందే. ప్రసవాలు సైతం ఎప్పుడో ఒకటి జరుగుతున్నాయి. నార్సింగి పీహెచ్‌సీలో ప్రసవాల గది నిర్మాణం రెండేళ్లుగా అసంపూర్తిగా ఉంది.


నిర్వహించాలని సూచించాం

- వెంకటేశ్వర్‌రావు, జిల్లా వైద్యాధికారి

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అభివృద్ధి కమిటీ సమావేశాలు నిర్వహించాలని వైద్యాధికారులను ఇదివరకే ఆదేశించాం. గతంలో ఎంపీపీల అధ్యక్షతన కమిటీలు వేశాం. ఇకపై మూడునెలలకో సారి సమావేశాల ఏర్పాటుకు దృష్టిసారిస్తాం.


ఉన్నతాధికారుల దృష్టికి..

- పి.చంద్రశేఖర్‌, ప్రభుత్వ ఆసుపత్రుల జిల్లా సమన్వయకర్త

ప్రాంతీయ, సామాజిక ఆసుపత్రుల్లో అభివృద్ధి కమిటీల ఏర్పాటు చేసే విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. అక్కడి నుంచి ఆమోదం రాగానే చర్యలు చేపడతాం. ప్రస్తుతం పాత వాటినే కొనసాగిస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని