logo

వలే మృత్యుపాశమైంది

చేపలు పట్టేందుకని వెళ్లి వల కాలుకు చుట్టుకోవడంతో చెరువులో మునిగి ఓవ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన పరిగి మండల పరిధిలోని రూప్‌ఖాన్‌పేట్‌ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది.

Published : 10 Aug 2022 01:46 IST

చెరువులో మునిగి ఒకరి మృతి


మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చుతున్న గ్రామస్థులు

పరిగి గ్రామీణ, న్యూస్‌టుడే: చేపలు పట్టేందుకని వెళ్లి వల కాలుకు చుట్టుకోవడంతో చెరువులో మునిగి ఓవ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన పరిగి మండల పరిధిలోని రూప్‌ఖాన్‌పేట్‌ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై విఠల్‌రెడ్డి, గ్రామస్థులు తెలిపిన ప్రకారం..గ్రామానికి చెందిన సంగెం సందయ్య (58) భార్య వెంకటమ్మతో కలిసి ఇటుక బట్టీల్లో పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. సోమవారం ఉదయం చేపలు పట్టేందుకు చిగురాల్‌పల్లి గ్రామ చెరువు వద్దకు వెళ్లాడు. స్థానికులు నీరు అధికంగా ఉంది చెరువులోకి వెళ్లొద్దని హెచ్చరించినా వినకుండా వల వేసేందుకు చెరువులోకి దిగాడు. చీకటి పడినా ఇంటికి చేరుకోక పోవడంతో కుటుంబ సభ్యులు గ్రామ పరిసరాల్లోని చెరువులన్నీ వెతికినా ఆచూకీ లభించలేదు. మరుసటి రోజు (మంగళవారం) ఉదయాన్నే గ్రామస్థులతో కలిసి మళ్లీ వెతికేందుకు బయలు దేరగా చిగురాల్‌పల్లి చెరువు గట్టుపైన అతని దుస్తులు కనిపించాయి. చెరువులో మునిగి ఉంటాడని భావించారు. కొందరు స్థానికులు చెరువులో మధ్యాహ్నం 12 గంటల వరకు వెతకగా వలకు చిక్కుకుని ప్రాణాలు కోల్పోయి కనిపించాడు. కోటపల్లి నుంచి గజ ఈతగాళ్లు వచ్చేంతలో గ్రామస్థులు శవాన్ని ఒడ్డుకు చేర్చారు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని