logo

మెరుగైన వైద్యం.. ఆరోగ్య భాగ్యం

గతంలో సర్కారు దవాఖానాల్లో సరైన సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మెరుగైన వైద్యం అందడం గగనమే. రానురాను పరిస్థితిలో మార్పు వచ్చింది. ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించడం, సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో నాణ్యమైన

Published : 12 Aug 2022 01:08 IST

ఆసుపత్రుల అభివృద్ధి, ఆధునికీకరణ
న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్‌

గతంలో సర్కారు దవాఖానాల్లో సరైన సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మెరుగైన వైద్యం అందడం గగనమే. రానురాను పరిస్థితిలో మార్పు వచ్చింది. ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించడం, సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో నాణ్యమైన సేవలకు బాటలు పడ్డాయి. ఒకప్పుడు ప్రధాన పట్టణాలకే పరిమితమైన ఆసుపత్రులు, నేడు పల్లె ముంగిటకు వచ్చాయి. ప్రత్యేక పథకాలు అమలు చేయడంతోపాటు వసతులు కల్పించడంతో ఆదరణ పెరుగుతోంది. వజ్రోత్సవం వేళ వైద్య రంగంలో వచ్చిన మార్పులు, స్థితిగతులపై ప్రత్యేక కథనం.

వార్డులో చికిత్స

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మొదట 250 పడకల ఆసుపత్రి ఉండేది. అనంతరం 150 పడకలతో తల్లీబిడ్డల సంరక్షణకు  మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రం అందుబాటులోకి వచ్చింది. ఉమ్మడి జిల్లా వాసులతోపాటు సమీపంలోని రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లా వాసులు వచ్చి చికిత్స పొందుతుంటారు. గతేడాది ఈ ఆసుపత్రికి వైద్య కళాశాల, నర్సింగ్‌ కళాశాల మంజూరయ్యాయి. ఐసీయూ, రక్తశుద్ధి, వెల్‌నెస్‌ కేంద్రం ద్వారా సేవలు అందిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులకు పాలియేటివ్‌ కేర్‌ సెంటర్‌ ఉంది. హైదరాబాద్‌కు, కార్పొరేట్‌ ఆసుపత్రులకు వెళ్లడం నుంచి విముక్తి లభించింది.

మార్పులు   ఇలా...!...

పల్లె, బస్తీ దవాఖానాలుగా ఏర్పాటు చేసి వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. పట్టణాల్లో 5వేల  జనాభా ఉన్న వార్డులకు ఒక బస్తీ దవాఖానా ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా 642 ఆరోగ్య ఉపకేంద్రాల్లో విభజన చేసి, 22 ఆసుపత్రులను పల్లె దవాఖానాలుగా ఏర్పాటు చేశారు. గతంలో పట్టణ ఆరోగ్య కేంద్రంగా సంగారెడ్డిలో రెండు ఉండేవి. వాటి స్థాయి పెంచారు. పటాన్‌చెరులో, జహీరాబాద్‌లో పట్టణ ఆరోగ్య కేంద్రాలున్నాయి.

పీహెచ్‌సీల నుంచి సీహెచ్‌సీలుగా ...
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి సామాజిక ఆరోగ్య కేంద్రాలుగా స్థాయి పెంచారు. వాటిలో సదాశివపేట, మిర్జాపూర్‌, కరాస్‌ గుత్తి, కోహీర్‌, కల్హేర్‌ సీహెచ్‌సీలుగా మార్చారు. ఆరుపడకల నుంచి 30పడకలకు స్థాయిపెంచారు. జోగిపేట, నారాయణఖేడ్‌, పటాన్‌చెరు, జహీరాబాద్‌ ఆసుపత్రులలో 50 పడకల నుంచి 100 పడకలకు స్థాయి పెంచి, ఇక్కడ అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నారు.

ఝరాసంగంలో కార్పొరేట్‌ హంగు

తల్లీబిడ్డలకు భరోసా
కేసీఆర్‌ కిట్టు, అమ్మఒడి, 102 సేవలు అందిస్తున్నారు. సంగారెడ్డిలో 150 పడకలు మాతాశిశు సంరక్షణ కేంద్రం ఉంది. నారాయణఖేడ్‌లో ఎంసీహెచ్‌ భవనం పనులు సాగుతున్నాయి. జహీరాబాద్‌లో 50 పడకల భవనం నిర్మాణానికి రూ.7.05 కోట్ల నిధులు ఇటీవల మంజూరయ్యాయి. సంగారెడ్డిలో 20 పడకలతో నవజాత శిశు కేంద్రం కొనసాగుతోంది. అత్యవసరంలో వైద్యం అందించేందుకు పది పడకల ఐసీయూ వినియోగంలోకి వచ్చింది. అంతేగాకుండా పౌష్టికాహార లోపం ఉన్న చిన్నారులను చేరదీసేందుకు పునర్జీవన కేంద్రంలో 10 పడకలు ఏర్పాట్లు చేశారు. పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రిని సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 100పడకల నుంచి 200పడకలకు పెంచనున్నారు.  జిల్లా జనరల్‌ ఆసుపత్రిలో టీ-హబ్‌ సేవలు అందుతున్నాయి. ఇక్కడ 57 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. నాలుగు రూట్లుగా రెండ వాహనాల ద్వారా ఆయా పీహెచ్‌సీల నుంచి రక్త నమూనాలను సేకరిస్తున్నారు.

రక్తశుద్ధి కేంద్రం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని