logo

కళ్లెదుటే కన్నకూతురు దుర్మరణం

అసలే ఆర్థిక ఇబ్బందులతో ఉన్న కుటుంబంలో కూతురు దుర్మరణం పెను విషాదం నింపింది. గుర్తుతెలియని వాహనం ఆ యువతి పాలిట మృత్యుశకటంగా

Published : 12 Aug 2022 01:08 IST

పటాన్‌చెరు అర్బన్‌, న్యూస్‌టుడే: అసలే ఆర్థిక ఇబ్బందులతో ఉన్న కుటుంబంలో కూతురు దుర్మరణం పెను విషాదం నింపింది. గుర్తుతెలియని వాహనం ఆ యువతి పాలిట మృత్యుశకటంగా మారింది.  బైకును ఓ వాహనం ఢీకొన్న ఘటనలో కన్న తండ్రి కళ్లెదుటే కుమార్తె దుర్మరణం పాలైంది. ఈ హృదయ విదారక ఘటన పటాన్‌చెరు ఠాణా పరిధిలో జరిగింది. ఎస్సై ప్రసాదరావు తెలిపిన వివరాల ప్రకారం రామచంద్రాపురం ఎంఐజీకి చెందిన జాఫర్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె రేష్మాబేగమ్‌ (17) ఇంటి వద్దే ఉంటోంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇంటర్‌ చదువు మధ్యలోనే స్వస్తి పలికింది. ఈ క్రమంలో కొంతకాలంగా సైనస్‌తో ఇబ్బంది పడుతోంది. సంగారెడ్డిలో ఉన్న ఈఎన్‌టీ ఆసుపత్రిలో చూపించుకునేందుకు తండ్రి జాఫర్‌తో కలిసి గురువారం ద్విచక్ర వాహనంపై వెళ్తోంది. పటాన్‌చెరు మండలం ముత్తంగి చర్చి సమీపం జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం వీరిని బలంగా ఢీకొంది. దీనితో రేష్మాబేగమ్‌ తీవ్రంగా గాయపడి తండ్రి జాఫర్‌ కళ్ల ముందే దుర్మరణం పాలైంది. తండ్రికి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. కూతురు మృతితో గుండెలవిసేలా రోదించాడు. పటాన్‌చెరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని