logo

కబ్జాలవుతున్నా కదలికేది?

ఏళ్ల పాటు ఉద్యోగం చేసి వచ్చిన వేతనంలో పైసాపైసా కూడబెట్టుకున్నారు. హైదరాబాద్‌కు శివారులో స్థలాలు కొనుగోలు చేశారు. రిజిస్ట్రేషన్లయ్యాయి. పట్టా భూములంటూ గతంలో అధికారులూ అనుమతులిచ్చారు. ఆ తర్వాత ఇదంతా ప్రభుత్వ భూమి అంటూ చెప్పేయడంతో కొనుగోలు చేసిన వారంతా తీవ్ర షాక్‌కు గురయ్యారు

Published : 13 Aug 2022 01:38 IST

పట్టించుకోని అధికారులు

 అమీన్‌పూర్‌ మండలం ఐలాపూర్‌లో తీరిది..
ఈనాడు, సంగారెడ్డి

విద్యుత్తు ఉద్యోగుల హౌసింగ్‌ సొసైటీ విక్రయించిన స్థలాల్లో పనులు

ఏళ్ల పాటు ఉద్యోగం చేసి వచ్చిన వేతనంలో పైసాపైసా కూడబెట్టుకున్నారు. హైదరాబాద్‌కు శివారులో స్థలాలు కొనుగోలు చేశారు. రిజిస్ట్రేషన్లయ్యాయి. పట్టా భూములంటూ గతంలో అధికారులూ అనుమతులిచ్చారు. ఆ తర్వాత ఇదంతా ప్రభుత్వ భూమి అంటూ చెప్పేయడంతో కొనుగోలు చేసిన వారంతా తీవ్ర షాక్‌కు గురయ్యారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించి హక్కుల కోసం పోరాడుతున్నారు. ఇంతలోనే కొందరు యథేచ్ఛగా కబ్జాలకు దిగారు. ఏం చేయాలో పాలుపోక రెవెన్యూ అధికారుల దృష్టికి బాధితులు విషయాన్ని తీసుకెళ్లారు. అయినా ప్రయోజనం దక్కలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నాలుగు దశాబ్దాల క్రితం లేఔట్‌..
విద్యుత్తు ఉద్యోగుల సహకార హౌసింగ్‌ సొసైటీ 1982లో ఏర్పడింది. అమీన్‌పూర్‌ మండలం ఐలాపూర్‌లోని రెండు సర్వే సంఖ్యల్లో కలిపి 131 ఎకరాల విస్తీర్ణంలో లేఔట్‌ను అభివృద్ధి చేశారు. 725 కుటుంబాలకు చెందిన ఉద్యోగులు ఇక్కడ స్థలాలు కొనుగోలు చేశారు. భవిష్యత్తులో ధరలు పెరిగితే ఆమేరకు ప్రయోజనం దక్కుతుందని భావించారు. ఉద్యోగ విరమణ తర్వాత అక్కడే ఇళ్లు కట్టుకోవాలని కలలు కన్నారు. వీరు రిజిస్ట్రేషన్‌ చేసుకొని కొన్నవి పట్టా భూములు కావని, అవన్నీ ప్రభుత్వ భూములేనంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసు విచారణ కొనసాగుతోంది. తుది తీర్పు తమకే అనుకూలంగా వస్తుందని వారు భావిస్తున్న తరుణంలో కొందరు ఈ స్థలాలను కబ్జా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాళ్లు, మట్టి పోసి...
‘ఈ భూమి ప్రభుత్వానిదంటూ అధికారులు చెబుతున్నారు. కొందరు కబ్జాలకు దిగుతుంటే ఎందుకు అడ్డుకోవడం లేదని..’ విద్యుత్తు ఉద్యోగుల హౌసింగ్‌ సొసైటీకి చెందిన సభ్యుడు బుచ్చిబాబు అధికారులను ప్రశ్నిస్తున్నారు. పట్టపగలే కొందరు ట్రాక్టర్లలో రాళ్లు, మట్టి తెచ్చి చదును చేస్తున్నారని, తాము గతంలో పాతిన హద్దురాళ్లనూ తొలగిస్తున్నారని.. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని మిగతా సభ్యులు ఆరోపిస్తున్నారు.


ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదిస్తున్నాం..
- విజయ్‌, తహసీల్దారు, అమీన్‌పూర్‌

విద్యుత్తు ఉద్యోగుల సహకార హౌజింగ్‌ సొసైటీ కోసం అభివృద్ధి చేసిన లేఅవుట్‌ స్థలం ప్రభుత్వ భూమి అంటూ న్యాయస్థానంలో కేసు వేశాం. ప్రస్తుతం విచారణ దశలో ఉంది. తుదితీర్పు వచ్చేవరకు యథాతథస్థితి కొనసాగించాలని గతంలో న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. ఇందులో కొంత మేర ఆక్రమణలు జరుగుతున్నాయి. అది మా దృష్టికీ వచ్చింది. ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్నంతా నివేదికల రూపంలో ఉన్నతాధికారులకు నివేదిస్తున్నాం. తుదితీర్పు వచ్చిన తర్వాత ఆ మేరకు చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని