Harish rao: కేంద్రం నిధులు ఆపటంపై బండి సంజయ్‌ సమాధానం చెప్పాలి: మంత్రి హరీశ్‌రావు

తెలంగాణ భాజపా నేతలపై మంత్రి హరీశ్‌రావు మరోసారి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మోదీ ఫొటోలు పెట్టాలంటూ భాజపా శ్రేణులు గొడవలు చేస్తున్నారని మండిపడ్డారు. 

Updated : 24 Mar 2023 15:37 IST

సిద్దిపేట: సీఎం కేసీఆర్ అడగ్గానే కొత్త మండలాలు ఏర్పాటు చేశారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా భూంపల్లి, అక్బర్‌పేట్‌లో ఇవాళ పర్యటించిన మంత్రి.. కొత్త మండలాల్లో ఏర్పాటు చేసిన తహశీల్దార్‌ కార్యాలయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ ఫొటోలు పెట్టట్లేదని భాజపా నేతలు గొడవలు చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు.

‘‘గ్యాస్‌, పెట్రోల్‌ ధరలు పెంచినందుకు మోదీ ఫొటోలు పెట్టుకోండి. చేనేత వస్త్రాలపై జీఎస్టీ వేసినందుకు ఫొటోలు వేసుకోండి’’ అని భాజపా నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టనని సీఎం కేసీఆర్‌ ఖరాఖండిగా చెప్పారని.. అందుకే రాష్ట్రానికి రావాల్సిన రూ.6వేల కోట్ల నిధులు ఆపేశారని ధ్వజమెత్తారు. కేంద్రం నిధులు ఆపటంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తే కేంద్రం ఓర్వలేకపోతోందన్నారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయనంటే రాష్ట్ర ప్రభుత్వమే కొని రైతులకు అండగా నిలిచిందని చెప్పారు. మహారాష్ట్రలోని సరిహద్దు గ్రామాల సర్పంచ్‌లు తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని విజ్ఞప్తులు చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు ఈ సందర్భంగా తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని