logo

ఎట్టకేలకు నిధులు

మండల వనరుల కేంద్రాలు, పాఠశాలల సముదాయం(కాంప్లెక్స్‌)లకు ఎట్టకేలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.

Published : 02 Dec 2022 02:02 IST

ఎమ్మార్సీ, పాఠశాలల సముదాయాలకు 50 శాతం విడుదల

సంగారెడ్డి మండల విద్యాధికారి కార్యాలయం

న్యూస్‌టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ: మండల వనరుల కేంద్రాలు, పాఠశాలల సముదాయం(కాంప్లెక్స్‌)లకు ఎట్టకేలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 2022-23 విద్యా సంవత్సరం ప్రారంభమై ఐదున్నర నెలలైనా ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రాకపోవడంతో ఆయా కేంద్రాల్లో అధికారులు, ప్రధానోపాధ్యాయులు ఇబ్బందులు పడ్డారు. ప్రతి రోజు రిపోర్టుల తయారీ, రిజిస్టర్ల నిర్వహణ, అంతర్జాల వినియోగం.. ఇలా అనేక కార్యక్రమాలు జరుగుతుంటాయి. వీటికి కేటాయించే సగం నిధులు ప్రస్తుతం విడుదల కావడంతో కొంత వరకు ఇబ్బందులు తీరనున్నాయి. ఎమ్మార్సీలకు రూ.8.55 లక్షలు, సముదాయ పాఠశాలల సముదాయాలకు రూ.19.12 లక్షలు కలిపి మొత్తం 27.67 లక్షలు విడుదల చేశారు. వీటిలో ఎస్సీ కాంపొనెంట్‌ కింద 24 శాతం, ఎస్టీ కాంపొనెంట్‌ కింద 14 శాతం, మిగిలిన 62 శాతం జనరల్‌ కాంపొనెంట్‌ కింద నిధులు కేటాయిస్తారు.

కొంత ఊరట: ప్రతి మండల కేంద్రంలో పాఠశాలల నిర్వహణకు మండల వనకుల కేంద్రం(మండల విద్యాధికారి కార్యాలయం) ఉంటుంది. ఇక్కడ ఆయా మండలాలకు సంబంధించిన పాఠశాలలు, ఉపాధ్యాయులకు సంబంధించిన సమాచార సేకరణ జరుగుతుంది. ప్రతి ఏడాది ఎమ్మార్సీకి రూ.90 వేల నిధులు కేటాయిస్తారు. ఈ ఏడాదికి సగం నిధులు రూ.45 వేలు వారి అకౌంట్లకు జమ చేశారు. దీనితో పాటు కాంప్లెక్స్‌ పాఠశాలకు ఏడాదికి రూ.45 వేలు కేటాయిస్తారు. వీరికీ 50 శాతం రూ.22,500 నికేటాయించారు. జిల్లాలో 85 కాంప్లెక్స్‌ పాఠశాలలకు నిలులు విడుదల చేశారు. 18 బడులను కలిపి ఓ కాంప్లెక్స్‌ పాఠశాలను ఏర్పాటు చేశారు. దీని పరిధిలోని ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయుడిగా బాధ్యతలు తీసుకుంటారు.

కొత్త మండలాలకు మంజూరేది?

జిల్లాలో 27 మండలాలు ఉన్నాయి. వీటిలో కొత్తగా ఏర్పాటైన 8 మండలాలకు నిధులివ్వలేదు. ఈ మండలాల్లో ఎమ్మార్సీ భవనాలు లేకపోవడంతోనే నిధులు కేటాయించలేదని సమగ్ర శిక్ష అధికారులు పేర్కొంటున్నారు. అందుబాటులోని నిధులు సర్దేబాటు చేసుకోవాలని, మిగిలినవి త్వరలో మంజూరవుతాయని సెక్టోరియల్‌ అధికారి వెంకటేశం తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని