logo

బాల్యం.. చదువుకు దూరం

పద్నాలుగేళ్ల లోపు చిన్నారులు విధిగా పాఠశాలలకు వెళ్లాలి. విద్యతో బంగారు భవితకు బాటలు వేసుకోవాలి. ఈ నిబంధనలు చాలా చోట్ల అమలు కావడం లేదు.

Published : 02 Dec 2022 02:02 IST

ఇటుక బట్టీల వద్ద కార్మికుల పిల్లలు

ఏర్పాటు కాని పనిప్రాంత పాఠశాలలు

న్యూస్‌టుడే, జిన్నారం

ద్నాలుగేళ్ల లోపు చిన్నారులు విధిగా పాఠశాలలకు వెళ్లాలి. విద్యతో బంగారు భవితకు బాటలు వేసుకోవాలి. ఈ నిబంధనలు చాలా చోట్ల అమలు కావడం లేదు. ప్రధానంగా ఇటుక బట్టీల్లో పని చేసే కార్మికుల పిల్లలు బడులకు దూరంగా ఉంటుండటంతో వారికి చదువు అందడం లేదు. వీరిలో కొందరు బాల కార్మికులుగానూ మారుతున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఇటుక బట్టీల సీజన్‌ ప్రారంభమైంది. స్థానికులే కాకుండా, జిల్లాలోని ఇతర ప్రాంతాలు, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి కార్మికులు వచ్చారు. వారితో పాటు పిల్లలనూ తీసుకొచ్చారు. ఇలాంటి వారి కోసం పనిప్రాంత పాఠశాలలు ఏర్పాటు చేయాలనే నిబంధనలు ఉన్నా అమలు కాని తీరుపై కథనం.

ఉమ్మడి జిన్నారంలో అధికంగా..

ఉమ్మడి జిన్నారం మండలంలోని అన్నారం శివారులో 40 వరకు ఇటుక బట్టీలున్నాయి. ఏ బట్టీ వద్ద చూసినా చిన్నారులు కనిపిస్తున్నారు. వీరిలో కొందరు తల్లిదండ్రులకు సహకరిస్తున్నారు. ఇది చట్ట విరుద్ధమైనా పనులు తొందరగా అవుతాయని యజమానులు ప్రోత్సహిస్తున్నారు. ఇటుకలను ఆరబెట్టడం, బట్టీల వద్దకు మోయటం, ప్రమాదకరంగా ఉన్న నీటి గుంతల నుంచి జలాన్ని తరలించడం వంటి పనులు చేస్తున్నారు. ఉమ్మడి జిన్నారం మండలంలోని అన్నారం, దోమడుగు, కిష్టాయపల్లి, గడ్డపోతారం, సోలక్‌పల్లి, పటాన్‌చెరు, సంగారెడ్డి, హత్నూర, సదాశివపేట, జహీరాబాద్‌ తదితర ప్రాంతాల్లో వందలాదిగా బట్టీలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో 14 ఏళ్ల లోపు చిన్నారులు 5వేల మందికి పైగానే ఉంటారనే అంచనా ఉంది. ఒక్క జిన్నారం మండలంలోనే  15 వందల మంది వరకు ఇలాంటి పిల్లలున్నారు.

అధికారులు దృష్టి సారిస్తేనే..

విద్యాశాఖ ఆధ్వర్యంలో పని ప్రాంత పాఠశాలలు ఏర్పాటు చేయాలి. ఇటుక బట్టీల యజమానులు వసతి కల్పించాలి. విద్యాశాఖ విద్యార్థులకు కావాల్సిన పలకలు, పుస్తకాలు అందించాలి. వేరే రాష్ట్రాల విద్యార్థులుంటే.. ఆ భాష తెలిసినవారు.. లేదంటే ఆ రాష్ట్రం నుంచి వాలంటీర్లను రప్పించాలి. పిల్లలకు మధ్యాహ్న భోజనం అందించాలి. ఈ దిశగా జిల్లా ఉన్నతాధికారులు, విద్యా శాఖాధికారులు దృష్టి సారించాలని పలువురు సూచిస్తున్నారు. లేదంటే పాఠశాలలకు వెళ్లాల్సిన బాలలు కార్మికులుగా మారే ప్రమాదం ఉంది.


వెంటనే ప్రారంభించేలా చర్యలు

విజయ, జిల్లా విద్యాశాఖ ఏడీ

నవంబరులోనే పని ప్రాంత పాఠశాలలు ప్రారంభించాల్సి ఉంది. ఒడిశా ప్రతినిధులుగానీ, బట్టీల యజమానులు గానీ ఈ విషయాన్ని మా దృష్టికి తేలేదు. ఎక్కడెక్కడ ఇటుక బట్టీలు ఉన్నాయి, ఎంత మంది విద్యార్థులున్నారని సర్వే చేయించి.. పాఠశాలలు ప్రారంభిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని