logo

ప్రోత్సాహంపై ఆశ.. అందక నిరాశ!

పాల ఉత్పత్తిని పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి. ఇవి కేవలం  మాటలకే పరిమితం కావడంతో పాడి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Published : 02 Dec 2022 02:02 IST

న్యూస్‌టుడే, మెదక్‌ టౌన్‌

పాల ఉత్పత్తిని పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి. ఇవి కేవలం  మాటలకే పరిమితం కావడంతో పాడి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాణా ధర విపరీతంగా పెరగడంతో, నిర్వహణ భారంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన అదనపు ప్రోత్సాహకం అందకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. దీంతో విజయ డెయిరీకి కాకుండా, ప్రైవేట్లో పాలను విక్రయిస్తున్నారు.   మరికొందరు గేదెలను కొనుగోలు చేసేందుకు డబ్బులు లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు.

జిల్లా కేంద్రంలో విజయ డెయిరీ ఉంది. దీని పరిధిలో చేగుంట, కౌడిపల్లి, రామాయంపేట, రేగోడ్‌, పెద్దశంకరంపేట, పాపన్నపేటల్లో బల్క్‌మిల్క్‌ సెంటర్లు, 155 సేకరణ కేంద్రాలున్నాయి. రైతులు ఆరువేల వరకు ఉన్నారు.వీరంతా రోజువారీగా 5,800 లీటర్ల పాలు విక్రయిస్తున్నారు. వీరికి తోడ్పాటు అందించేందుకు వెన్న శాతంతో సంబంధం లేకుండా లీటరకు రూ.4 చొప్పున 2017 సెప్టెంబరు నుంచి ప్రభుత్వం ప్రోత్సాహకాన్ని చెల్లించింది. ధర అధికంగా రావడంతో విజయ డెయిరీ వైపు మొగ్గు చూపారు. ఎప్పుడు లేని విధంగా 2019లో కేంద్రాల నుంచి రోజుకు 12 వేల లీటర్లు వచ్చాయి. 2020 మే నుంచి ఇవ్వకపోవడంతో రూ.1.18 కోట్లు బకాయిలు పేరుకుపోయాయి. ఇవి ఎప్పుడు వస్తాయో స్పష్టత లేదు. దీంతో ప్రస్తుతం కేంద్రాల ద్వారా 5,800 లీటర్లు మాత్రమే డెయిరీకి వస్తున్నాయి. ఈ విషయంలో సర్కారు దృష్టి సారించకపోతే రాబోయే రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.


ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం

ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకం విడుదల కాలేదు. 2020 మే నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా రూ.1.18 కోట్ల బకాయిలు రైతులకు చెల్లించాల్సి ఉంది. సర్కారు వారి ఖాతాలో జమ చేస్తుంది. ఎప్పుడు విడుదల అవుతాయనేది సమాచారం లేదు. పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం.

శ్రీనివాస్‌, డీడీ, విజయ డెయిరీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని