logo

అనుమానంతో అంతమొందించారు..

తమకు సంబంధించిన మహిళలతో చనువుగా ఉంటున్నాడనే అనుమానంతో మిత్రులే అంతమొందించారు.

Published : 29 Jan 2023 03:10 IST

యువకుడి అదశ్యంలో వీడిన మిస్టరీ

నిందితులను చూపుతున్న పోలీసులు

తూప్రాన్‌, న్యూస్‌టుడే: తమకు సంబంధించిన మహిళలతో చనువుగా ఉంటున్నాడనే అనుమానంతో మిత్రులే అంతమొందించారు. ఈ నెల 21న తూప్రాన్‌లో అదృశ్యమైన వ్యక్తి మిస్టరీని పోలీసులు ఛేదించారు. శనివారం తూప్రాన్‌లో జరిగిన సమావేశంలో సీఐ శ్రీధర్‌ వివరా వెల్లడించారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం తిప్పాపూర్‌కు చెందిన గొడుగు నరేశ్‌ (25), మమత దంపతులు కొన్నాళ్లుగా ఉపాధి నిమిత్తం తూప్రాన్‌లో నివాసం ఉంటున్నారు. ఈ నెల 21న ఇంట్లో నుంచి వెళ్లిన నరేశ్‌ తిరిగిరాలేదు. మమత అన్ని చోట్ల వెతకగా ఫలితం లేకపోవడంతో 23న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టారు. అతడి మిత్రులు షేక్‌ అహ్మద్‌ (తిప్పాపూర్‌), మల్లేశ్‌ (ఆబోతుపల్లి), పర్శ మల్లేశ్‌ (తూప్రాన్‌)లను అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తామే నరేశ్‌ను హత్య చేసినట్లు ఒప్పుకొన్నారు. వారు చెప్పిన ఆధారంగా తూప్రాన్‌ మండలం కిష్టాపూర్‌ వెళ్లే దారిలో కప్పెర నర్సింహాస్వామి ఆలయం సమీపంలో ఉన్న ఓ బావిలో చంపి పడేసినట్లు గుర్తించారు. బావిలో ఉన్న నరేశ్‌ మృతదేహాన్ని బయటకు తీశారు.

హత్య చేసి.. వాళ్లే ఫిర్యాదు చేసి..

షేక్‌అహ్మద్‌, ఆబోతుపల్లి మల్లేశ్‌లకు ఇద్దరు మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్నాయి. వారితో నరేశ్‌ చనువుగా ఉంటుండటంతో అనుమానం మొదలైంది. చివరకు నరేశ్‌ హతం చేయాలని వారిద్దరు భావించారు. ఇందుకు పక్కా ప్రణాళిక రూపొందించుకున్నారు. పర్శ మల్లేశ్‌ సాయం తీసుకున్నారు. ఈ నెల 21న నరేశ్‌తో కలిసి మద్యం తాగారు. ఆ తర్వాత ఊపిరాడకుండా గట్టిగా అదిమి పట్టుకున్నారు. రాయితో తలపై బాదడంతో తీవ్ర రక్తస్రావమై మృతి చెందాడు. అతడి ఆనవాళ్లను గుర్తించకుండా ఉండేందుకు మృతదేహానికి రాయి కట్టి బావిలో పడేశారు. అతడి ద్విచక్ర వాహనాన్ని సైతం అందులోనే పడేసి ఇళ్లకు చేరుకున్నారు. ఆ మరుసటి రోజు హతుడు నరేశ్‌ భార్య మమత బంధువులతో కలిసి వీరిని ఆరా తీశారు. తమకేమీ తెలియదని చెప్పారు. 23న పోలీసుస్టేషన్‌కు వెళ్లి అదశ్యమైనట్లు ఫిర్యాదు చేశారు. ఆ మరుసటి రోజు పర్శ మల్లేశ్‌, షేక్‌ అహ్మద్‌లు పరారయ్యారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. శనివారం వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని సీఐ వివరించారు. స్థానిక ఎస్‌ఐ సురేశ్‌కుమార్‌, సిబ్బంది ఉన్నారు.

వర్గల్‌ మండలం అనంతగిరిపల్లికి చెందిన బిక్షపతి, హంసమ్మ దంపతుల కుమార్తె మమతకు బిక్కనూరు మండలం తిప్పాపూర్‌కు చెందిన నరేశ్‌తో నాలుగేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల లోపు ఇద్దరు పిల్లలున్నారు. గతంతో మమత అమ్మానాన్నలు మృతిచెందారు. ఇప్పుడు భర్త హత్యకు గురవడంతో నా పరిస్థితి ఏంటని కన్నీరుమున్నీరుగా విలపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని