logo

లీజుకు స్థలం.. సమీకృత విపణికి సుగమం

ఖేడ్‌ పురపాలిక పరిధిలో సమీకృత విపణి నిర్మాణానికి ఏడాది కిందట రూ.2 కోట్లు మంజూరయ్యాయి.

Published : 29 Jan 2023 03:10 IST

న్యూస్‌టుడే, నారాయణఖేడ్‌

కేటాయించనున్న వక్ఫ్‌ స్థలం

ఖేడ్‌ పురపాలిక పరిధిలో సమీకృత విపణి నిర్మాణానికి ఏడాది కిందట రూ.2 కోట్లు మంజూరయ్యాయి. అనువైన స్థలం లేకపోవడంతో నిర్మాణం ప్రారంభం కాలేదు. తాజాగా పట్టణ మధ్యలోని వక్ఫ్‌బోర్డుకు సంబంధించిన రెండెకరాలను లీజు పద్ధతిన ఇవ్వడానికి ఉత్తర్వులు జారీ కావడంతో సమీకృత విపణి నిర్మాణానికి మార్గం సుగమమైంది. ప్రస్తుతం కూరగాయలు, చేపలు, మాంసం దుకాణాలు రోడ్ల వెంట నిర్వహిస్తుండటంతో ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సమీకృత విపణి నిర్మాణంతో అవస్థలు దూరం కానున్న నేపథ్యంలో కథనం.

ప్రస్తుత పరిస్థితి..

ఖేడ్‌ పట్టణంలో కూరగాయల దుకాణాలను ఏళ్లుగా అంబేడ్కర్‌ కూడలి నుంచి పాత ఎస్‌బీహెచ్‌ వరకు రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. ఈ ఇక్కట్లను దూరం చేయాలనే ఉద్దేశంతో ఆరేళ్ల కిందట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో రూ.కోటితో రైతుబజార్‌ నిర్మించారు. 108 కూరగాయల దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు నిర్మించిన షెడ్లు అనువుగా లేకపోవడం సమస్యగా మారింది. ప్రవేశ ద్వారం నుంచి లోపలికి వెళ్లే చోట.. ఇరువైపులా షెడ్లు నిర్మించగా వాటి వెనుకాల రెండింటిని నిర్మించారు. దుకాణాల కేటాయింపు వివాదాస్పదం కావడం, వ్యాపారులు ఆసక్తి చూపకపోవడంతో పట్టణంలోని రహదారుల వెంటే కూరగాయల దుకాణాలు నిర్వహిస్తున్నారు. చేపలు, మాంసం దుకాణాలదీ ఇదే పరిస్థితి.

రూ.2 కోట్లు మంజూరు

కూరగాయాలు, మాసం, చేపల దుకాణాలను ఒకే చోట ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఏడాది కిందట ప్రభుత్వం రూ.2 కోట్లు మంజూరు చేసింది. పట్టణంలో అనువైన స్థలాలు లేకపోవడంతో నిర్మించలేకపోయారు. రాజీవ్‌కూడలి సమీపంలో వక్ఫ్‌బోర్డు పరిధిలో దర్గాకు సంబంధించి 39.30 ఎకరాల భూమి ఉంది. అందులో మంగల్‌పేట, ర్యాకల్‌ మార్గాల్లో రోడ్డుకు ఇరువైపులా వ్యాపారులు షెడ్లు వేసుకుని వ్యాపారాలు కొనసాగిస్తుండగా మధ్యలో షాదీఖానా నిర్మించారు. ఇక్కడ రెండు ఎకరాలను లీజు పద్ధతిన కేటాయించడానికి వక్ఫ్‌బోర్డు అనుమతిస్తూ వారం కిందట ఉత్తర్వులు జారీ చేసింది. రూ.2 కోట్లతో సమీకృత విపణిని నిర్మించి కూరగాయలు, చేపలు, మాసం దుకాణాలను అందులో కేటాయించనున్నారు. ఆయా దుకాణాదారుల వద్ద నుంచి లీజు సొమ్మును వసూలు చేయనున్నారు. త్వరలోనే నిర్మాణానికి పురపాలిక అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని