logo

సర్కారు బడుల్లో సౌర వెలుగులు

సౌర విద్యుత్తు.. పర్యావరణ హితం.. ఆర్థికంగా మేలు చేయనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం.. సర్కారు బడుల్లో సౌర విద్యుత్తు వ్యవస్థ ఏర్పాటుపై దృష్టి సారించింది.

Published : 29 Jan 2023 03:10 IST

న్యూస్‌టుడే, సిద్దిపేట

సిద్దిపేటలోని ఇందిరానగర్‌ ప్రాథమిక పాఠశాల

సౌర విద్యుత్తు.. పర్యావరణ హితం.. ఆర్థికంగా మేలు చేయనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం.. సర్కారు బడుల్లో సౌర విద్యుత్తు వ్యవస్థ ఏర్పాటుపై దృష్టి సారించింది. ‘మన ఊరు - మన బడి/బస్తీ’ పథకం కింద టీఎస్‌రెడ్‌కో నేతృత్వంలో తొలుత సిద్దిపేట జిల్లాలో ఏడు పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా (పైలెట్‌ ప్రాజెక్టు) ఈ ప్రక్రియ చేపట్టింది. ఇదే క్రమంలో సిద్దిపేట, మెదక్‌ జిల్లాల్లో 119 విద్యాలయాల్లో ఏర్పాటుకు సంకల్పించింది. ఫలితంగా బడుల్లో ఉచిత విద్యుత్తు సాకారం కానుండగా.. సోలార్‌ నెట్‌ మీటరింగ్‌ (ఆన్‌గ్రిడ్‌ సోలార్‌ ఎనర్జీ సిస్టం) విధానంలో మిగులు విద్యుత్తును విక్రయించి లాభం పొందే ఆస్కారం కలగనుంది.
పలు సర్కారు బడుల్లో విద్యుత్తు వ్యవస్థ సరిగా లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. సకాలంలో బిల్లులు చెల్లించక.. కనెక్షన్లు తొలగించిన సందర్భాలు ఉన్నాయి. మరికొన్ని చోట్ల అసలు కనెక్షన్లు లేకుండానే కొనసాగుతున్నాయి. ఆయా సమస్యలకు పరిష్కారం చూపేలా ప్రభుత్వం ముందడుగు వేసింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు - మన బడి పథకం ద్వారా పలు ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో సౌర కాంతులు అందించేందుకు నిర్ణయించింది. సిద్దిపేట జిల్లాలో 58, మెదక్‌ జిల్లాలో 61 పాఠశాలల్లో 2 కేడబ్ల్యూ (కిలో వాట్స్‌) సామర్థ్యంతో సౌర విద్యుత్తు వ్యవస్థ ఏర్పాటుకు నిశ్చయించింది. ఈ లెక్కన దాదాపు రూ.1.89 కోట్లు వెచ్చించనున్నారు. తొలి విడత కింద ఈ విద్యా సంవత్సరంలో 30 శాతం మేర విద్యాలయాల్లో అమర్చనున్నారు. సిద్దిపేట - 17, మెదక్‌ - 18 చోట్ల ఫిబ్రవరిలో బిగించేందుకు టీఎస్‌రెడ్‌కో నిర్ణయించింది. తద్వారా ఒక్కో పాఠశాలలో ఆరు సౌర పలకలు, ఒక ఇన్వెర్టర్‌, ఏసీ, డీసీ బాక్సు వ్యవస్థను బిగించనున్నారు. ఇప్పటికే సిద్దిపేట జిల్లాలో రూర్బన్‌ పథకం కింద తొమ్మిది, సీబీఎఫ్‌ కింద మెదక్‌లో ఐదు విద్యాలయాలు, 15 వసతిగృహాల్లో అందుబాటులోకి తెచ్చారు. ఆయా చోట్ల చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. మెదక్‌లో ఓ జూనియర్‌ కళాశాల సైతం ఉంది.

సౌర పలకాల ఏర్పాటు ఇలా..

మిగులు విద్యుత్తుతో..

సిద్దిపేట ఇందిరానగర్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో నాట్కో సంస్థ సహకారంతో టీఎస్‌రెడ్‌కో నేతృత్వంలో 2019 సంవత్సరంలో 5 కేడబ్ల్యూ సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్తు వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. గతంలో ప్రతి నెలా దాదాపు రూ.10 వేల వరకు విద్యుత్తు బిల్లు వచ్చేది. ప్రస్తుతం సౌర విద్యుత్తు ఉత్పత్తి కారణంగా ఏటా రూ.లక్ష వరకు ఆదా అవుతోంది. ఆన్‌గ్రిడ్‌ విధానంతో ఉత్పత్తి అయ్యే విద్యుత్తు ప్రతి నెలా అవసరాలకు వినియోగించగా.. మిగులును విద్యుత్తు శాఖకు విక్రయించవచ్చు. యూనిట్‌కు రూ.3.20 చొప్పున శాఖ కొనుగోలు చేస్తుంది. ఈతరహా వ్యవస్థను విడతల వారీగా ఇరు జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో అమలు చేయడం ద్వారా సత్ఫలితాలు సాధ్యం కానున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని