logo

ఇక వేగంగా.. ఆదాయం పెంచేలా..

ఆర్టీసీ.. నష్టాలను అధిగమించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇందుకు వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది.

Published : 30 Jan 2023 02:56 IST

మెదక్‌లోని లాజిస్టిక్స్‌ కేంద్రం

న్యూస్‌టుడే, మెదక్‌ అర్బన్‌: ఆర్టీసీ.. నష్టాలను అధిగమించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇందుకు వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది. ప్రయణికుల మన్ననలు పొందేందుకు పలు రాయితీలకు సైతం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 2020 జూన్‌ 19న కార్గో, కొరియర్‌ సేవలను ప్రారంభించింది. సదరు సేవలపై విస్తృతంగా ప్రచారం చేయడంతో అత్యధికులు వినియోగించుకుంటున్నారు. తద్వారా సంస్థకు ఆదాయం సమకూరుతోంది. సరకుల రవాణా సేవలను ఆర్టీసీ ప్రారంభించడంతో సత్ఫలితాలు వచ్చాయి. ఆదాయ అన్వేషణలో భాగంగా ఏర్పాటు చేసిన కార్గో సర్వీసును మరింత అభివృద్ధికి ప్రణాళిక రూపొందించారు.

దేశవ్యాప్తంగా..

కార్గో సేవలను దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు లాజిస్టిక్స్‌గా పేరు మార్చారు. మెదక్‌ రీజియన్‌ పరిధిలో మొత్తం 8, వికారాబాద్‌ జిల్లాలో మూడు డిపోలు ఉన్నాయి. ఓ వైపు ప్రయాణికులను చేరవేస్తూనే, మరోవైపు సరకులను వినియోగదారుల వద్దకు చేరుస్తోంది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో 19 చోట్ల బుకింగ్‌ కేంద్రాలను నెలకొల్పారు.

కిలో లోపే..

కొత్త సేవల్లో భాగంగా పంపించే పార్సిల్‌ బరువు కిలోకు మించకుండా ఉండాలి. దీని విలువ రూ.5 వేలకు మించకూడదు. ఇటు పంపించే వారికి, అటు తీసుకునే వారికి సంక్షిప్త సందేశాలు అందుతాయి. ఇతర రాష్ట్రానిల్లోని నగరాలకు ఐదు కిలోల బరువున్నవి రవాణా చేయనున్నారు.

నూతన సేవలు..

తాజాగా పార్సిళ్లను సత్వరమే రవాణా చేసేందుకు ‘ఏఎం టు పీఎం’ పేరిట నూతన సేవలను సంస్థ ఎండీ సజ్జనార్‌ ప్రారంభించారు. రూ.99కే పంపించేందుకు అవకాశం కల్పించారు. మధ్యాహ్నం 12 గంటల్లోపు బుక్‌ చేస్తే రాత్రి 9 గంటలకు, రాత్రి 9 గంటల్లోపు అయితే మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు గమ్యస్థానానికి చేరవేయనున్నారు. ప్రస్తుతం సిద్దిపేట డిపోలో సదరు సేవలు షురూ చేశారు. ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు సత్వర పార్సిల్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి.


సద్వినియోగం చేసుకోండి

సుదర్శన్‌, ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్‌, మెదక్‌

వినియోగదారులకు సత్వర సేవలు అందించడమే లక్ష్యంగా ఏఎం టు పీఎం సేవలను పరిచయం చేస్తున్నాం. తద్వారా పార్సిల్‌ బుక్‌ చేసిన తర్వాత గరిష్ఠంగా 9 గంటల్లోపు గమ్యస్థానానికి చేరుస్తాం. పార్సిల్‌పై పక్కా పర్యవేక్షణ ఉంటుంది. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని ఆర్టీసీని ఆదరించాలి. వేగంగా గమ్యాలకు చేరవేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని