logo

చేపల వేటకు వెళ్లి.. మత్స్యకారుడి మృతి

చెరువులో చేపలు పట్టేందుకు విసిరిన వల కాళ్లకు చుట్టుకొని నీటితో మునిగి ఊపిరాడక ఓ మత్స్యకారుడు మృతి చెందిన ఘటన మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం పోతారంలో చోటుచేసుకుంది.

Published : 03 Feb 2023 01:03 IST

మనోహరాబాద్‌, న్యూస్‌టుడే: చెరువులో చేపలు పట్టేందుకు విసిరిన వల కాళ్లకు చుట్టుకొని నీటితో మునిగి ఊపిరాడక ఓ మత్స్యకారుడు మృతి చెందిన ఘటన మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం పోతారంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ సందీప్‌రెడ్డి తెలిపిన వివరాలు.. పోతారానికి చెందిన దుంపల యాదగిరి (50), నాగమణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఓ కూతురికి వివాహం కాగా, చిన్న కూతురు దివ్యాంగురాలు. యాదగిరి కూలీ పనులు చేయడంతో పాటు చెరువులో చేపలు పడుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బుధవారం సాయంత్రం యాదగిరి చేపలు పట్టేందుకు వెళ్లాడు. రాత్రయినా తిరిగి రాకపోవడంతో నాగమణి.. తన మామ రాజయ్యకు విషయం చెప్పింది. గ్రామానికి చెందిన స్వామితో కలిసి వెతకగా వద్ద మృతుడి దుస్తులు కనిపించాయి. అప్పటికే చీకటి పడటంతో గురువారం అందులో వెతకగా మృతదేహం లభ్యమైంది. నాగమణి ఫిర్యాదుతో కేసు నమోదైనట్లు ఎస్‌ఐ చెప్పారు.


కారు ఢీకొని వృద్ధురాలి మృతి

కంది, న్యూస్‌టుడే: జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళుతున్న వృద్ధురాలిని కారు ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందింది. ఈ ఘటన సంగారెడ్డి రూరల్‌ ఠాణా పరిధిలో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై ఖుర్షీద్‌ తెలిపిన వివరాలు.. కంది మండలం కవలంపేట్‌కు చెందిన ఎం.పెంటమ్మ(65) 65వ నంబరు జాతీయ రహదారిపై నడుచుకుంటూ మనవడిని పాఠశాలకు తీసుకెళుతోంది. సంగారెడ్డి నుంచి పటాన్‌చెరు వైపు వెళ్తున్న కారు ఆమెను బలంగా ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందింది. కొడుకు నర్సింలు ఫిర్యాదు మేరకు కారు యజమాని శ్రీధర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


భార్య ప్రవర్తనకు విసిగిపోయి.. భర్త ఆత్మహత్య

దుబ్బాక, న్యూస్‌టుడే: భార్యకు వివాహేతర సంబంధం ఉందనే కారణంతో జీవితం మీద విరక్తి చెందిన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన దుబ్బాక మండలం శిలాజినగర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని మదిర గ్రామం టేకులతండాలో గురువారం చోటుచేసుకుంది. దుబ్బాక సీఐ మున్నూరు కృష్ణ వివరాలు తెలిపారు. టేకులతండాకు చెందిన వ్యక్తి (38)కి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అతను రెండేళ్ల క్రితం బతుకు దెరువుకు విదేశాలకు వెళ్లాడు. నెల క్రితం తిరిగి వచ్చాడు. ఇదే గ్రామానికి చెందిన దేవేందర్‌తో తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని తెలుసుకున్నాడు. భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఆమె బుధవారం ఇంటి నుంచి వెళ్లిపోయింది. గురువారం గ్రామంలోని బంధువుల వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు చీరతో భర్త ఉరి వేసుకున్నాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని, పంచనామా నిర్వహించారు. తమ బావ మృతికి చెల్లి, ఆమె ప్రియుడే కారణమని మృతుని బావమరిది ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


బావ ప్రేమించి.. పెళ్లికి నిరాకరించాడని..

కొండాపూర్‌, కొడంగల్‌: మేనబావ, యువతి ప్రేమించుకున్నారు. బావ పెళ్లికి నిరాకరించడంతో యువతి మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసింది. చికిత్స పొందుతూ మృతిచెందింది. ఎస్సై వెంకటేశం తెలిపిన వివరాలు.. కొడంగల్‌లోని ఓ గ్రామానికి చెందిన యువతి(19) నర్సింగ్‌ చదువుతోంది. బావను ప్రేమించిన యువతి.. గత 22న హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌నగర్‌ వద్ద పెళ్లి విషయమై అతడితో గొడవపడింది. బావ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో కొండాపూర్‌ మండలంలోని ఓ ఫాంహౌజ్‌లో పనిచేస్తున్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. గత నెల 31న అక్కడే పురుగుల మందు తాగింది. తల్లిదండ్రులు గమనించి హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని