logo

క్రీడా స్ఫూర్తి.. యువ దీప్తి

రెండు నెలలు.. 256 మ్యాచ్‌లు.. 257 జట్లు.. 19.58 లక్షల మంది వీక్షకులు (క్రీడాభిమానులు).. 5 వేల మంది క్రీడాకారులతో సీఎం కేసీఆర్‌ క్రికెట్‌ ట్రోఫీ గతేడాది అందరి దృష్టిని ఆకర్షించింది.

Published : 08 Feb 2023 02:03 IST

అవార్డు దక్కించుకున్న ‘సీఎం కేసీఆర్‌ ట్రోఫీ
న్యూస్‌టుడే, సిద్దిపేట

బ్యాటింగ్‌ చేస్తున్న మంత్రి హరీశ్‌రావు

రెండు నెలలు.. 256 మ్యాచ్‌లు.. 257 జట్లు.. 19.58 లక్షల మంది వీక్షకులు (క్రీడాభిమానులు).. 5 వేల మంది క్రీడాకారులతో సీఎం కేసీఆర్‌ క్రికెట్‌ ట్రోఫీ గతేడాది అందరి దృష్టిని ఆకర్షించింది. మంత్రి హరీశ్‌రావు సారథ్యంతో యువతలో క్రీడా స్ఫూర్తిని రగిలిస్తూ సిద్దిపేటలో వివిధ దశల్లో మ్యాచ్‌లు కొనసాగాయి. ఈ తరుణంలోనే అతిపెద్ద టోర్నీ-2022గా నిలవగా, ‘క్రిక్‌ హీరోస్‌’ సంస్థ (యాప్‌) పురస్కారాన్ని ప్రకటించడం విశేషం.

ఆదర్శ పంథా : గతేడాది ఫిబ్రవరి 20 నుంచి ఏప్రిల్‌ 20 వరకు సిద్దిపేట క్రీడా మైదానం వేదికగా టోర్నీ కొనసాగింది. సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజును పురస్కరించుకొని మంత్రి ఆధ్వర్యంలో కొనసాగింది. ఇప్పటికే సిద్దిపేట వివిధ రంగాల్లో ప్రత్యేకతను చాటుతోంది. పలు అంశాల్లో ఆదర్శ పంథాను కొనసాగిస్తూ వివిధ స్థాయిల్లో పురస్కారాలు స్వీకరించింది. క్రీడా రంగంలోనూ తనదైన ముద్రవేసేలా.. యువతను క్రీడా మైదానాల వైపు మళ్లించారు. అందుకు సీఎం కేసీఆర్‌ క్రికెట్‌ టోర్నీ దోహదం చేసింది.

మంత్రి నేతృత్వం : మూడేళ్లుగా మంత్రి నేతృత్వంలో పోటీలు సాగుతున్నాయి. ఈ తరుణంలో 2022లో అతిపెద్ద టోర్నీగా (సీజన్‌-2) నిలిచింది. అత్యధిక జట్లు.. పెద్దసంఖ్యలో క్రీడాకారులు ఇందులో భాగస్వాములు అయ్యారు. జాతీయ స్థాయిలో వివిధ విభాగాల్లో ప్రకటించిన పురస్కారాలలో బిగ్గెస్ట్‌ టోర్నమెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా నిలిచింది. సిద్దిపేటలో సీఎం కేసీఆర్‌ క్రికెట్‌ ట్రోఫీ (సీజన్‌-3) ప్రారంభోత్సవం రోజున నిర్వాహకులైన మంత్రి హరీశ్‌రావుకు సంబంధిత ప్రతినిధులు పురస్కారాన్ని అందించనున్నారు.

పక్కా ప్రణాళిక : మూడేళ్ల కిందట సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా క్రికెట్‌ టోర్నీ మొదలెట్టారు. యువత ఆసక్తి చూపగా.. పక్కా ప్రణాళికతో నిర్వాహకులు ముందుకు సాగారు. తొలిది విజయవంతం కావడంతో ఏటా నిర్వహణకు నిర్ణయించారు. ఫ్లడ్‌ లైట్ల వెలుగుల మధ్య రాత్రింబవళ్లు మ్యాచ్‌లు జరిగాయి. పలువురు ప్రముఖులు హాజరై ప్రోత్సహించారు. కథానాయకులు అఖిల్‌, సుమన్‌, క్రికెట్‌ ప్రముఖులు నోయల్‌ డేవిడ్‌, చాముండేశ్వరీనాథ్‌, తిలక్‌వర్మ తదితరులు హాజరయ్యారు. పురస్కారం మరింత బాధ్యత పెంచిందని  గతంలో నిర్వహణ బాధ్యతలు చేపట్టిన మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, కలకుంట్ల మల్లికార్జున్‌ తెలిపారు.

దక్కిన గౌరవం: మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట క్రీడాకారులు, యువ స్ఫూర్తికి దక్కిన గౌరవం ఇది. జిల్లా కేంద్రంలోని మైదానం ఎంతో మంది క్రీడాకారులకు చక్కటి వేదికగా మారింది. ఇద్దరు రంజీ వరకు వెళ్లారు. గల్లీ నుంచి దిల్లీస్థాయిలో ఈ ప్రాంత కీర్తి చేరడం ఆనందంగా ఉంది. క్రిక్‌ హీరోస్‌ ప్రతినిధులకు ధన్యవాదాలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని