logo

రాయితీ రుణం.. మహిళలకు వరం

మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే కుటుంబానికి ఎంతో తోడ్పాటు లభిస్తుంది. సెర్ప్‌ ఆధ్వర్యంలో మహిళా సంఘాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎన్నో అవకాశాలను కల్పిస్తోంది.

Published : 19 Mar 2023 02:04 IST

ఆహారోత్పత్తుల తయారీతో ఉపాధి
జిల్లాలో 379 మందికి అవకాశం
న్యూస్‌టుడే, చేగుంట

మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే కుటుంబానికి ఎంతో తోడ్పాటు లభిస్తుంది. సెర్ప్‌ ఆధ్వర్యంలో మహిళా సంఘాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎన్నో అవకాశాలను కల్పిస్తోంది. చాలామంది వాటిని సద్వినియోగం చేసుకోవడం లేదు. 35 శాతం రాయితీతో డీఆర్డీఏ ఆధ్వర్యంలో జిల్లాలో ప్రధానమంత్రి ఫార్మలైజేషన్‌ ఆఫ్‌ మైక్రో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (పీఎంఎఫ్‌ఎంఈ) ద్వారా మహిళా సంఘాల సభ్యులకు రుణాలు ఇవ్వనున్నారు. బృందంగా కాకుండా వ్యక్తిగతంగానే అందించనున్నారు. వీటితో కేవలం ఆహార ఉత్పత్తులను మాత్రమే తయారు చేయాల్సి ఉంటుంది. డీఆర్డీఏ అధికారులు అన్ని మహిళా సంఘాల సభ్యులకు వీటి గురించి అవగాహన కల్పిస్తున్నారు. డబ్బులు ఇప్పిస్తామని చెబుతున్నా అవగాహనలేక చాలామంది ముందుకు రావడం లేదు.

ఒక్కొక్కరికి రూ.20 లక్షలు

ఒక్కో మహిళకు రూ.20 లక్షల వరకు ఇవ్వనున్నారు. జిల్లావ్యాప్తంగా 379 మందికి అందించే అవకాశముంది. ఒక మహిళ రూ.20 లక్షలు తీసుకుంటే అందులో రూ.7 లక్షల వరకు రాయితీ లభించనుంది. అలాగే ఆహార ఉత్పత్తుల పరిశ్రమ ఏర్పాటు చేస్తే మరి కొందరికి ఉపాధి లభించే అవకాశాలున్నాయి. 50 రకాల ఆహార ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చు. బేకరి, బనానా చిప్స్‌, బిస్కెట్లు, బ్రెడ్స్‌, చిరుధాన్యాలు, చాక్లెట్లు, కొబ్బరిపొడి, కొబ్బరినూనె లాంటవి ఎన్నో తయారు చేయొచ్చు. దీనికిగాను తప్పకుండా ఐకేపీలో సభ్యురాలై ఉండాలి. డీఆర్డీఏ అధికారులే బ్యాంకు నుంచి రుణాలు ఇప్పిస్తారు.
* రాయితీ ఎక్కువగా ఉండటంతో మహిళలు ఉపాధి పొందేందుకు బాగుంటుందని అధికారులు చెబుతున్నారు. అర్హత ఉన్న ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇంటి పట్టునే ఉంటూ నచ్చిన యూనిట్‌ను ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందొచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం ఐకేపీ అధికారులు గ్రామాల్లోకి వెళ్లి మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు.


సద్వినియోగం చేసుకోవాలి

-భీమయ్య, అదనపు డీఆర్డీవో

ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకునేందుకు ముందుకు రావాలి. రాయితీ ఎక్కువగా ఉన్నందున ఎంతో ప్రయోజనకారిగా ఉంది. ఇంటివద్దనే ఆహారోత్పత్తుల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేసుకోవచ్చు. దాదాపు అన్నింటికీ మార్కెటింగ్‌ సదుపాయం ఉంది. మహిళలు ముందుకొస్తే బ్యాంకర్లతో రుణాలు ఇప్పించేందుకు సిద్ధంగా ఉన్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని