logo

అనుమానమే పెను భూతం

భార్యపై అనుమానంతో ఆమెను హత్య చేశాడు. ఆ తర్వాత ఆందోళన చెంది భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంగారెడ్డి జిల్లా అందోలు మండలం నాద్లాపూర్‌లో చోటుచేసుకుంది.

Published : 21 Mar 2023 02:17 IST

ఆలిని అంతమొందించి ఆత్మహత్య

మల్లమ్మ, నారాయణ

జోగిపేట, న్యూస్‌టుడే: భార్యపై అనుమానంతో ఆమెను హత్య చేశాడు. ఆ తర్వాత ఆందోళన చెంది భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంగారెడ్డి జిల్లా అందోలు మండలం నాద్లాపూర్‌లో చోటుచేసుకుంది. జోగిపేట సీఐ నాగరాజు, ఎస్సై సామ్యానాయక్‌ తెలిపిన వివరాలు.. నాద్లాపూర్‌కు చెందిన ముద్దాయిపేట నారాయణ(56) మల్లమ్మ(50) భార్యాభర్తలు. వీరికి కొడుకు, కూతురు ఉన్నారు. కూతురికి వివాహం కాగా.. కుమారుడు నర్సింలు హైదరాబాద్‌లోని ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. గతంలో నారాయణ చేనేత కార్మికుడిగా పనిచేసేవాడు. గ్రామంలో అప్పులు చేయడంతో వాటిని తీర్చేందుకు భార్యతో కలిసి కుమారుడి వద్దకు వెళ్లారు. అక్కడే కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రెండు రోజుల క్రితం మృతురాలి చెల్లెలి కూతురు వివాహానికి భార్యాభర్తలు కలిసి టేక్మాల్‌ మండలం అచ్చన్నపల్లికి వెళ్లారు. ఆ వేడుకలోనూ భార్యపై అనుమానంతో ఆమెతో భర్త గొడవపడ్డాడు. గతంలోనూ పలుమార్లు ఇలాగే గొడవలు జరగగా గ్రామస్థుల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. ఆదివారం సాయంత్రం దంపతులిద్దరు కలిసి స్వగ్రామమైన నాద్లాపూర్‌లోని సొంతింటికి వచ్చారు. ఆ ఇంటిని చూసుకుంటున్న అదే గ్రామానికి అంబమ్మను తన ఇంటికి పంపించారు. రాత్రి దంపతులిద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది. ఆగ్రహించిన నారాయణ భార్యను గొడ్డలితో నరికి హత్య చేశారు. పోలీసులు తనను అరెస్టు చేస్తారేమోనని ఆందోళన చెంది ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. సోమవారం ఉదయం అంబమ్మ ఆ ఇంటికి వచ్చి తలుపు తీయగా నారాయణ, మల్లమ్మ మృతదేహాలు కనిపించాయి. వెంటనే గ్రామస్థుల సహాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో మద్యం గొలుసు దుకాణాలు అధికమయ్యాయని, తరచూ గొడవలు జరుగుతున్నాయని, నారాయణ మద్యం మత్తులోనే ఘాతుకానికి పాల్పడ్డాడని ఆ గ్రామ మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని