logo

దారులు అధ్వానం.. ప్రయాణం దయనీయం

పల్లె దారులపై ప్రయాణానికి అష్టకష్టాలు తప్పడం లేదు. రెండేళ్లుగా కురిసిన భారీ వర్షాలకు రోడ్లు గుంతలయంగా మారాయి. చాలా చోట్ల కంకర తేలి అధ్వానంగా మారాయి.

Published : 21 Mar 2023 02:32 IST

న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్‌, కొండాపూర్‌, కంది, సదాశివపేట

రాళ్లు తేలిన కొండాపూర్‌-తెర్పోల్‌ దారి

ల్లె దారులపై ప్రయాణానికి అష్టకష్టాలు తప్పడం లేదు. రెండేళ్లుగా కురిసిన భారీ వర్షాలకు రోడ్లు గుంతలయంగా మారాయి. చాలా చోట్ల కంకర తేలి అధ్వానంగా మారాయి. సకాలంలో మరమ్మతులు చేపట్టకపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రస్తుతం పనులు చేపట్టడానికి అనువైన కాలం. ఇకనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు జిల్లాలోని పీఆర్‌, ఆర్‌అండ్‌బీ రహదారులపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకతపై కథనం.

క్షేత్ర స్థాయిలో ఇలా..

* సదాశివపేట మండలం ఆత్మకూర్‌ నుంచి సింగూరు ప్రాజెక్టుకు వెళ్లే దారిపై భారీగా గోతులు ఏర్పడ్డాయి. అదే మండలం నిజాంపూర్‌-వెల్టూర్‌, సదాశివపేట-వెంకటాపూర్‌, సదాశివపేట-తంగేడుపల్లి, కంబాలపల్లి రోడ్లదీ ఇదే పరిస్థితి.

* అందోలు మండలం కిచ్చన్నపల్లి మార్గంలో రెండు కిలో మీటర్ల మేర తారు లేచి.. కంకర తేలింది. దానంపల్లిలో వంతెన వద్ద గుంతలు ఏర్పడ్డాయి. చందంపేట, చింతకుంట మార్గాల్లోనూ ప్రయాణికులకు ఇక్కట్లు తప్పడం లేదు.

* కొండాపూర్‌ మండలం తొగర్‌పల్లి వరకు ఇటీవల తారు వేశారు. ఆ తర్వాత అనంత సాగర్‌ వరకు 12 కిలో మీటర్ల మేర రోడ్డంతా అధ్వానంగా మారింది. కొండాపూర్‌-తెర్పోల్‌ మార్గంలో వంతెన వద్ద భారీ గుంతలున్నాయి.

* కంది మండలం కాశీపూర్‌ నుంచి కలివేముల, చెర్లగూడెం, తోపుగొండ వరకు సుమారు 15 కిలో మీటర్ల వరకు చాలా చోట్ల కయ్యలు పడ్డాయి. కాశీపూర్‌లోని చెరువు కట్టపై బిక్కుబిక్కుమంటూ ప్రయాణం చేయాల్సిన పరిస్థితి.

* సంగారెడ్డి మండలం కల్పగూర్‌ నుంచి మంజీరా డ్యాంకు వెళ్లే రహదారి కోతకు గురయింది. కొత్లాపూర్‌ నుంచి మక్తా అల్లూరు వరకు దారంతా గుంతలమయంగా మారింది.

అధికారులు ఏమంటున్నారంటే..

రహదారుల మరమ్మతులకు చర్యలు తీసుకుంటున్నామని ఆర్‌అండ్‌బీ ఈఈ సురేశ్‌, పీఆర్‌ ఈఈ జగదీశ్వర్‌ తెలిపారు. ప్రభుత్వం ఇటీవల నిధులు మంజూరు చేసిదన్నారు. గుత్తేదారులు పనులు చేసేందుకు ముందుకు రావడం లేదని, టెండరు ప్రక్రియతే పనులు చేపడతామని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని