logo

చెత్త రహితం.. దేశంలో మొదటి స్థానం

రాష్ట్రంలో ఎన్నో అంశాల్లో సిద్దిపేట ఆదర్శంగా నిలుస్తోందని, పట్టణాభివృద్ధి కార్యక్రమాలకు అంతటా అధ్యయన కేంద్రం, ప్రయోగశాలగా మారిందని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్‌రావు అన్నారు.

Published : 21 Mar 2023 02:42 IST

లక్ష్యంతో ముందడుగేద్దాం: మంత్రి హరీశ్‌రావు

క్యాంపు కార్యాలయంలో పాల్గొన్న అధికారులు, నాయకులు

సిద్దిపేట, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఎన్నో అంశాల్లో సిద్దిపేట ఆదర్శంగా నిలుస్తోందని, పట్టణాభివృద్ధి కార్యక్రమాలకు అంతటా అధ్యయన కేంద్రం, ప్రయోగశాలగా మారిందని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట బల్దియా ప్రగతిపై హైదరాబాద్‌ నుంచి ఆన్‌లైన్‌ వేదికగా సోమవారం దృశ్య సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర, జాతీయస్థాయిలో పట్టణం 20 పురస్కారాలు అందుకుందని, ఆ స్ఫూర్తిని కొనసాగిద్దామన్నారు. సంపూర్ణ స్వచ్ఛతకు అడుగులు వేద్దామని, చెత్త రహిత పట్టణంగా దేశంలో మొదటి స్థానంలో నిలుద్దామన్నారు. బ్లాక్‌ స్పాట్‌ల ఏర్పాటుకు తావులేకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ప్రజల సహకారంతో పని చేయాలన్నారు. బ్లాక్‌ స్పాట్‌ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసు కమిషనర్‌ శ్వేతను ఆదేశించారు. పట్టణంలో మురుగు కాల్వల్లో మట్టి, ఇళ్ల ఆవరణల్లో చెత్తను వెనువెంటనే శుభ్రం చేయించాలన్నారు. బుస్సాపూర్‌లోని రిసోర్సుపార్కుకు చెత్త వేర్వేరుగా చేరాలని, నిఘా పెంచాలన్నారు. వార్డుస్థాయి కంపోస్టు యార్డులు మరిన్ని పెంచాలని, సేంద్రియ ఎరువు తయారీ చేయాలన్నారు. మొక్కలు విరివిగా నాటాలన్నారు. నిర్మాణ వ్యర్థాల నిర్వహణకు స్థలాన్ని పరిశీలించి ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. బయోగ్యాస్‌ ప్లాంట్‌లో సీఎన్‌జీ ఉత్పత్తి మరింత పెంచాలని, స్టీల్‌ బ్యాంకులను సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ప్రచారం విస్తృతం చేయాలన్నారు. ఆరోగ్య మహిళా క్లినిక్‌లలో రుతుప్రేమ స్టాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. స్వచ్ఛబడి ద్వారా విద్యార్థులకు అవగాహన పెంచాలన్నారు. మంత్రి వ్యక్తిగత కార్యదర్శి అశోక్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సంపత్‌కుమార్‌, మాజీ ఛైర్మన్‌ రాజనర్సు, ఓఎస్డీ బాలరాజు, డా. శాంతి, మున్సిపల్‌ అధికారులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని