logo

రెండు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం

సిద్దిపేట జిల్లాలో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. ఉగాది పండుగ రోజు ఈ ఘటనలు చోటుచేసుకోవడంతో ఆయా ప్రాంతాల్లో విషాదం నెలకొంది.

Published : 23 Mar 2023 01:26 IST

పండుగ పూట విషాదం

సిద్దిపేట అర్బన్‌, కొండపాక, న్యూస్‌టుడే: సిద్దిపేట జిల్లాలో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. ఉగాది పండుగ రోజు ఈ ఘటనలు చోటుచేసుకోవడంతో ఆయా ప్రాంతాల్లో విషాదం నెలకొంది. సిద్దిపేట గ్రామీణ ఠాణా ఎస్‌ఐ కిరణ్‌రెడ్డి తెలిపిన వివరాలు.. దుబ్బాక మండలం చేర్వాపూర్‌కు చెందిన చిట్టిపాక విజయ్‌కుమార్‌(23), స్నేహితుడైన బదనకంటి రఘు(25) సిద్దిపేటలో కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం కూలీ పనులు ముగించుకొని ఇంటికి ద్విచక్ర వాహనంపై తిరిగి వెళ్తున్నారు. ఇర్కోడు శివారులోకి రాగానే దుబ్బాక నుంచి సిద్దిపేట వైపు వస్తున్న బొలేరో వాహనం, ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. విజయ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. రఘును 108 వాహనంలో సిద్దిపేట ఆసుపత్రికి తరలించగా చనిపోయాడని వైద్యులు తెలిపారు. విజయ్‌కుమార్‌కు భార్య మమత, ఐదు నెలల కుమార్తె ఉంది. రఘుకు దుబ్బాక మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో నెల రోజుల క్రితం వివాహం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో ఘటనలో కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లికి చెందిన సింగోజి ఆంజనేయులు(60) మంగళవారం హైదరాబాద్‌కు వెళ్లి తిరిగి రాత్రి బస్సులో ప్రయాణమై కొమురవెల్లి కమాన్‌ వద్ద దిగాడు. నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న క్రమంలో ద్విచక్ర వాహనం వేగంగా వచ్చి ఆంజనేయులును బలంగా ఢీకొనడంతో అపస్మారకస్థితికి చేరాడు. వాహనంపై ఉన్న విశ్వనాథపల్లికి చెందిన గుల్ల బాబుకు తీవ్రగాయాలయ్యాయి. మరో బస్సులోని ప్రయాణికుడు 100కు ఫోన్‌ చేసి సమాచారమిచ్చాడు. క్షతగాత్రులను ములుగు ఆర్వీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆంజనేయులు మృతి చెందాడు. అతడికి భార్య, ఐదుగురు కుమారులున్నారు. కుమారుడు భాస్కర్‌ ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ పుష్పరాజ్‌ కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని