logo

చిత్తశుద్ధి లేని బల్దియా

అభివృద్ధి కార్యక్రమాలు సమయానికి పూర్తవ్వాలంటే నిధులు అవసరం. హుస్నాబాద్‌ బల్దియాలో ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలు మెండుగా ఉన్నా పాలకవర్గం పట్టించుకోవటం లేదు.

Published : 23 Mar 2023 01:26 IST

న్యూస్‌టుడే, హుస్నాబాద్‌

హుస్నాబాద్‌ పురపాలక సంఘం

అభివృద్ధి కార్యక్రమాలు సమయానికి పూర్తవ్వాలంటే నిధులు అవసరం. హుస్నాబాద్‌ బల్దియాలో ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలు మెండుగా ఉన్నా పాలకవర్గం పట్టించుకోవటం లేదు. ప్రభుత్వ పరంగా వచ్చే వివిధ గ్రాంట్ల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. పుర సాధారణ నిధి నుంచి పారిశుద్ద్య ఉద్యోగుల వేతనాలు, వీధి దీపాలు, నీటి సరఫరా నిర్వహణ, విద్యుత్తు బిల్లులకు సరిపోవడం లేదు. ఒక్కోసారి వేతనాలు ఇవ్వడానికి సాధారణ నిధిలో సరైన నిల్వలు లేక ఇతర గ్రాంట్ల నుంచి మళ్లిస్తున్నారు. ఆస్తి పన్నులు, వ్యాపార లైసెన్సులు, ఇంటి నిర్మాణ అనుమతి రుసుములు, అంగడి వేలం తదితరాల ద్వారా ఏటా రూ.2.50 కోట్ల ఆదాయం వస్తోంది. పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తే రూ.3 కోట్లకుపైగా చేరుకునే అవకాశం ఉంది. కొందరు ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నా ఆస్తి పన్ను విధింపు ప్రారంభం కాలేదు. వీటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పట్టణంలో దాదాపు 800 పైగా వ్యాపార దుకాణాలు ఉన్నాయి. వాటిలో యాభై శాతానికి పైగా వృత్తి వ్యాపార లైసెన్సులు లేవు. కేవలం బ్యాంకు రుణాలు, ఇతర వాణిజ్య పన్నుల ధ్రువీకరణ పత్రాలు పొందడానికి అవసరం ఉన్న వారే లైసెన్సులు తీసుకుంటున్నారు.

ఇష్టారాజ్యంగా ప్రచార బోర్డులు

గత రెండేళ్లుగా పురపాలిక పరిధిలో వివిధ రకాల షాపింగ్‌ మాల్స్‌, దుస్తుల దుకాణాలు, రెస్టారెంట్లు, బేకరీలు, ఆటోమొబైల్స్‌ ఏర్పాటు అయ్యాయి. వాస్తవానికి పురపాలిక నుంచి ట్రేడ్‌ లైసెన్సు పొందిన తర్వాతనే ప్రారంభించాలి. ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించడం లేదు. పట్టణంలో మాంసం, చికెన్‌ సెంటర్లు దాదాపు 80 ఉన్నాయి. ఇందులో 70 శాతం వాటికి అనుమతుల్లేవు. అధికారులు పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా మాంసం దుకాణాల నుంచి ప్రతిరోజు పశు వధశాల రుసుము వసూలు చేయాలి. పశువధశాల ఏర్పాటు చేయడంలో పాలకవర్గం నిర్లక్ష్యం వహిస్తోంది. పురపాలికకు ఆదాయంతోపాటు వినియోగదారులకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన మాంసం లభించే అవకాశం ఉంది. ఇటీవల ప్రతి శుక్రవారం జరిగే అంగడి వేలం రూ.కోటి వరకు రావాల్సి ఉండగా రూ.80 లక్షలకే పరిమితమైంది. వేలంలో పోటీ పెరిగితే మరో రూ.20 లక్షలకు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా పట్టణంలో హోర్డింగులు, డివైడర్లపై ఉండే స్తంభాలు ప్రచార బోర్డులపై అన్నిటికీ రుసుము వసూలు చేయాల్సి ఉంది. ఇష్టారాజ్యంగా ఏర్పాటవుతున్నాయి. ఇళ్ల స్థలాలకు సంబంధించి ఖాళీగా ఉన్నవాటిపై సెస్సు వసూలు చేసే అవకాశం ఉన్నా చేయడం లేదు. రెండేళ్ల క్రితం పలు చోట్ల ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరగగా తొలగించారు. సెల్‌ టవర్లకు సంబంధించి రుసుము వసూలు చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. దాదాపు 25 పైగా టవర్లు ఉన్నాయి. పలు ఆదాయ మార్గాలపై దృష్టి సారిస్తే పురపాలికకు మరో రూ.50 లక్షలకు పైగా ఆదాయం చేకూరనుంది.


దృష్టి పెట్టి, తాఖీదులిస్తాం: - రాజమల్లయ్య, కమిషనర్‌, పురపాలక సంఘం, హుస్నాబాద్‌

వివిధ రకాల లైసన్సుల జారీ, రుసుము వసూళ్లపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఇటీవల ట్రేడ్‌ లైసన్సుల జారీకి కొత్త విధానం వచ్చింది. విస్తీర్ణాన్ని బట్టి నిర్ణయిస్తాం. టవర్లకు సంబంధించి తాఖీదులు జారీ చేస్తాం. బల్దియా ఆదాయాన్ని మరింత సమకూర్చుకొని అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చిస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని